FASTag Rule: దేశ వ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కీలక సమాచారం అందించింది. ఏప్రిల్ 10 నుండి టోల్ ప్లాజాల వద్ద నగదు లావాదేవీలను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించింది. హైవేలపై ప్రయాణాన్ని మరింత వేగంగా, సులభతరం చేయడానికి ఈ డిజిటల్ విప్లవాన్ని తీసుకువస్తోంది. దీనివల్ల టోల్ గేట్ల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం ఉండదు.
నగదు చెల్లింపులు ఇక చెల్లవు..
ఏప్రిల్ 10 నుంచి టోల్ బూత్ల వద్ద కరెన్సీ నోట్లను తీసుకోరు. ప్రతి వాహనానికి ఫాస్టాగ్ (FASTag) తప్పనిసరి. ఒకవేళ మీ కారుకు ఫాస్టాగ్ లేకపోయినా లేదా అందులో బ్యాలెన్స్ లేకపోయినా యూపీఐ (UPI) ద్వారా చెల్లించే అవకాశం ఉంటుంది. అయితే, ఇది మీకు ఖరీదైన వ్యవహారం కానుంది. ఫాస్టాగ్ లేకుండా యూపీఐ ద్వారా టోల్ కడితే, సాధారణ ధర కంటే 25 శాతం అదనపు బాదుడు ఉంటుంది. అంటే ఫాస్టాగ్ ఉంటేనే మీకు తక్కువ ఖర్చుతో ప్రయాణం సాగుతుంది.
చెల్లించకపోతే రెట్టింపు జరిమానా..
ఒకవేళ వాహనదారులు ఫాస్టాగ్ లేదా యూపీఐ రెండింటి ద్వారా కూడా చెల్లింపులు చేయడానికి నిరాకరిస్తే, వారికి టోల్ ప్లాజాలోకి ప్రవేశం నిరాకరించబడుతుంది. అదనంగా సదరు వాహనానికి ఈ-నోటీసు జారీ చేసే అవకాశం ఉంది. మూడు రోజుల లోపు ఆ బకాయిలు చెల్లించకపోతే, జరిమానా మొత్తం రెట్టింపు అవుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఐడీ కార్డుల వెయివర్లకు చెక్..
ఇప్పటివరకు చాలామంది ప్రభుత్వ ఐడీ కార్డులు చూపించి ప్రైవేట్ వాహనాల్లో టోల్ మినహాయింపు పొందే ప్రయత్నం చేసేవారు. ఏప్రిల్ 10 నుండి అటువంటి పద్ధతులకు స్వస్తి పలకనున్నారు. కేవలం అధికారికంగా 'ఎగ్జెంప్టెడ్ ఫాస్టాగ్' (Exempted FASTag) కలిగిన వాహనాలకు మాత్రమే టోల్ మినహాయింపు లభిస్తుంది. దీనివల్ల టోల్ ప్లాజాల వద్ద జరిగే అనవసర వాగ్వాదాలు తగ్గుతాయని ఎన్హెచ్ఏఐ భావిస్తోంది.
ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ (Annual Pass) అప్డేట్..
తరచుగా హైవేలపై ప్రయాణించే వారి కోసం రూ. 3,075 ధరతో యాన్యువల్ పాస్ అందుబాటులో ఉంది. ఈ పాస్ ద్వారా ఏడాది కాలంలో లేదా 200 సార్లు టోల్ ప్లాజాల నుండి వెళ్లవచ్చు. వ్యక్తిగత నాన్-కమర్షియల్ వాహనదారులకు ఇది ఎంతో పొదుపుగా ఉంటుంది. దీనిని రాజ్మార్గ్ యాత్ర యాప్ (Rajmarg Yatra App) లేదా ఎన్హెచ్ఏఐ వెబ్సైట్ ద్వారా సులభంగా పొందవచ్చు. పేమెంట్ చేసిన 24 గంటల్లోనే ఈ పాస్ మీ ఫాస్టాగ్కు లింక్ అవుతుంది. హైవే ప్రయాణం చేసే ముందు మీ ఫాస్టాగ్ రిఛార్జ్ సరిగ్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఏప్రిల్ 10 నుండి చిల్లర దొరకలేదనే ఇబ్బందులు ఉండవు, కానీ డిజిటల్ పేమెంట్ సిద్ధంగా ఉంచుకోవాలని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
