New Headlight Rules For Cars, Bikes: కార్లు, బైకుల హెడ్‌లైట్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులకు సిద్ధమవుతోంది. రాత్రివేళ వాహనదారులను ఇబ్బంది పెట్టే తీవ్రమైన వెలుగును తగ్గించడమే లక్ష్యంగా కొత్త నిబంధనలను ప్రతిపాదించింది. రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) ఈ మార్పులను పరిశీలిస్తోంది. ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే, కొత్తగా తయారయ్యే బైక్‌ల హెడ్‌లైట్ విధానంలో పెద్ద మార్పు రావచ్చు. ప్రస్తుతం, వాహనదారులు తమకు అవసరమైనప్పుడు హైబీమ్‌ను ఉపయోగించవచ్చు. అయితే కొత్త ప్రతిపాదన ప్రకారం, కొత్త టూవీలర్లలో హెడ్‌లైట్లు ఆటోమేటిక్‌గా ఆన్ అవుతాయి. సాధారణ పరిస్థితుల్లో అవి లోబీమ్‌లోనే ఉండేలా నిబంధన రావచ్చు.

Continues below advertisement

అయితే ఇప్పటికే రోడ్డుపై ఉన్న బైక్‌లకు ఈ నిబంధన వర్తించదు. కొత్తగా తయారయ్యే ద్విచక్ర వాహనాలకే ఇది వర్తించే అవకాశం ఉంది. ఎదురుగా వచ్చే వాహనదారుల కళ్లలోకి నేరుగా తీవ్రమైన వెలుగు పడకుండా చూడటమే దీని ప్రధాన ఉద్దేశం.

హెడ్‌లైట్ తీవ్రతపైనా ప్రభుత్వం పరిమితులు తగ్గించే అంశాన్ని పరిశీలిస్తోంది. ప్రస్తుతం టూవీలర్లకు అనుమతించే గరిష్ఠ తీవ్రత 1.5 లక్షల కాండెలా వరకు ఉంది. దీనిని 1 లక్ష కాండెలాకు తగ్గించే ప్రతిపాదన వచ్చింది.

Continues below advertisement

కార్ల విషయంలో ప్రస్తుతం ఉన్న 2.25 లక్షల కాండెలా పరిమితిని 1.5 లక్షల కాండెలాకు తగ్గించే అవకాశం ఉంది. దీని వల్ల అత్యంత ప్రకాశవంతమైన హెడ్‌లైట్ల నుంచి వచ్చే గ్లేర్‌ను నియంత్రించవచ్చని అధికారులు భావిస్తున్నారు.

హెడ్‌లైట్ రంగు ఉష్ణోగ్రతపైనా పరిమితి తీసుకురావాలని ప్రతిపాదించారు. దీనిని గరిష్ఠంగా 6,500 కెల్విన్‌కు పరిమితం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా చాలా తెల్లగా లేదా నీలం రంగులో కనిపించే తీవ్రమైన వెలుగు ఇతర వాహనదారులకు అసౌకర్యం కలిగించకుండా చూడటం దీని ఉద్దేశం.

ఇది కూడా చదవండి: రూ.9,999 చెల్లించి Apache RTR 160 కొనేయండి, నెలవారీ EMI ఎంత కట్టాలి

పట్టణ ప్రాంతాల్లో హైబీమ్ వినియోగంపైనా కొత్త నిబంధన రావచ్చు. అవసరం లేని సమయంలో హైబీమ్ ఉపయోగిస్తే డ్రైవర్‌ను హెచ్చరించేలా వాహనాల్లో ఆడియో అలర్ట్ ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉంది. అయితే హైవేపై గంటకు 60 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు ఈ హెచ్చరిక పనిచేయకుండా మినహాయింపు ఇవ్వాలని ప్రతిపాదించారు. అధిక వేగంలో అనవసరమైన హెచ్చరికలతో డ్రైవర్‌కు ఇబ్బంది కలిగించకుండా ఈ మార్పు చేయనున్నారు.

బస్సులు & భారీ వాహనాల విషయంలోనూ కీలక ప్రతిపాదన ఉంది. రాత్రివేళ, వర్షం, పొగమంచు వంటి తక్కువ దృశ్యమానత ఉన్న పరిస్థితుల్లో ఈ వాహనాలు స్పష్టంగా కనిపించేలా రిఫ్లెక్టివ్ టేప్‌ను తప్పనిసరి చేయాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీంతో, వెనుక నుంచి వచ్చే వాహనదారులు పెద్ద వాహనాలను ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుంది.

ఎదురుగా వచ్చే వాహనాల హెడ్‌లైట్ల నుంచి వచ్చే గ్లేర్ వల్ల డ్రైవర్లకు కొంతసేపు రోడ్డు, పాదచారులు, ఇతర వాహనాలు స్పష్టంగా కనిపించకపోవచ్చు. బైక్‌లపై ప్రయాణించేవారికి ఈ సమస్య మరింత ఇబ్బందికరంగా మారుతుంది. కార్లలో ఉండే రక్షణ నిర్మాణం ద్విచక్రవాహనాలకు ఉండదు. అందుకే హెడ్‌లైట్ వెలుగును మాత్రమే తగ్గించడం కాకుండా, అవసరం లేని హైబీమ్ వినియోగాన్ని నియంత్రించడం, పెద్ద వాహనాలను సులభంగా గుర్తించేలా చేయడం వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.

ఇది కూడా చదవండి: రూ.8.71 లక్షల కియా సోనెట్‌ను రూ.1.30 లక్షల డౌన్‌పేమెంట్‌తో కొనొచ్చు! EMI, ఫైనాన్స్ డీటెయిల్స్ ఇవే!

అయితే ఇవి ప్రస్తుతం ప్రతిపాదనలు మాత్రమే. ఈ మార్పులపై సంబంధిత వర్గాల నుంచి సూచనలు, అభ్యంతరాలను MoRTH ఆహ్వానించింది. ఇందుకు 30 రోజుల గడువు ఇచ్చింది. సంప్రదింపులు, ఇతర అధికారిక ప్రక్రియలు పూర్తైన తర్వాత తుది నిబంధనలు ఖరారయ్యే అవకాశం ఉంది.

ఈ కొత్త నిబంధనలను వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి అమల్లోకి తీసుకురావడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అవి అమల్లోకి వస్తే వాహనాల హెడ్‌లైట్ ఎంత ప్రకాశవంతంగా ఉండాలి, హైబీమ్‌ను ఎప్పుడు ఉపయోగించాలి, రాత్రివేళ భారీ వాహనాలు ఎలా కనిపించాలి అనే అంశాల్లో కీలక మార్పులు రావచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.