Ethanol Blended Fuel India: దేశంలో ఇంధన విధానంలో మరో కీలక మార్పు రానుంది. 2026 ఏప్రిల్‌ 1 నుంచి దేశవ్యాప్తంగా కనీసం 95 RON (రీసెర్చ్‌ ఆక్టేన్‌ నంబర్‌) రేటింగ్‌ ఉన్న పెట్రోల్‌ను మాత్రమే విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది అమల్లోకి వచ్చిన 20 శాతం ఎథనాల్‌ మిశ్రమం ఉన్న E20 పెట్రోల్‌ తర్వాతి దశగా ఈ నిర్ణయం వస్తోంది.

Continues below advertisement

ఆక్టేన్‌ రేటింగ్‌ అంటే?

ఇప్పటివరకు సాధారణ పెట్రోల్‌ ఆక్టేన్‌ రేటింగ్‌ సుమారు 91 నుంచి 92 RON వరకు ఉండేది. ఆక్టేన్‌ రేటింగ్‌ అంటే... వాగన ఇంజిన్‌లో నాకింగ్‌ లేకుండా ఇంధనం ఎంత సమర్థంగా దహనం అవుతుందో సూచించే ప్రమాణం. రేటింగ్‌ ఎక్కువగా ఉంటే ఇంజిన్‌ పనితీరు మెరుగ్గా ఉండటమే కాకుండా శక్తి వినియోగం కూడా సమర్థవంతంగా ఉంటుంది.

Continues below advertisement

ఎథనాల్‌ విషయానికి వస్తే, స్వతంత్రంగా దీని ఆక్టేన్‌ రేటింగ్‌ సుమారు 108 RON వరకు ఉంటుంది. పెట్రోల్‌లో 20 శాతం వరకు ఎథనాల్‌ను కలిపితే మొత్తం ఇంధన ఆక్టేన్‌ స్థాయి సుమారు 6 RON పెరుగుతుందని ఆయిల్‌ కంపెనీలు చెబుతున్నాయి. అంటే 91-92 RON ఉన్న సాధారణ పెట్రోల్‌, E20 రూపంలో ఇప్పుడు 97-98 RON స్థాయికి చేరుతుంది. ఈ నేపథ్యంలో 95 RON కనీస ప్రమాణం విధించడం సమంజసమైన నిర్ణయంగా ప్రభుత్వం భావిస్తోంది.

అయితే కొన్ని ప్రత్యేక ప్రాంతాలు లేదా ప్రత్యేక పరిస్థితుల్లో ఆయిల్‌ కంపెనీలకు తాత్కాలికంగా RON ప్రమాణానికి మాత్రమే అనుగుణంగా ఇంధనం విక్రయించే అవకాశం కూడా ఇవ్వొచ్చని సమాచారం. అయినప్పటికీ దేశవ్యాప్తంగా ఇంధన నాణ్యతను ఒకే విధంగా ఉంచడమే ప్రధాన లక్ష్యం.

ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు?

ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశ్యం దిగుమతి ముడి చమురు మీద ఆధారాన్ని తగ్గించడం. ఎథనాల్‌ను చెరకు, మొక్కజొన్న వంటి పంటల నుంచి తయారు చేస్తారు. ఇది దేశీయంగా ఉత్పత్తి అయ్యే పునరుత్పాదక ఇంధనం. ఎథనాల్‌ మిశ్రమాన్ని పెంచడం వల్ల రైతులకు కూడా మేలు కలుగుతుంది. వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్‌ పెరగడం ద్వారా రైతు ఆదాయం పెరుగుతుంది.

ఇంకా ఒక ముఖ్యమైన అంశం బీఐఎస్‌ (Bureau of Indian Standards) ప్రమాణాలు. దేశవ్యాప్తంగా ఇంధన నాణ్యతలో ఏకరూపత ఉండేలా BIS నిబంధనల ప్రకారం పెట్రోల్‌ను ప్రమాణీకరించనున్నారు. ఎథనాల్‌ హైగ్రోస్కోపిక్‌ స్వభావం కలిగి ఉండటంతో తేమను, మలినాలను ఆకర్షించే అవకాశం ఉంటుంది. సరైన మిశ్రమం లేకపోతే ముఖ్యంగా ఫ్యూయల్‌ ఇంజెక్షన్‌ ఇంజిన్‌లలో సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.

BIS స్పెసిఫికేషన్లు అమల్లోకి వస్తే బ్లెండింగ్‌, సరఫరా దశల్లో కఠినమైన నాణ్యత నియంత్రణ ఉంటుంది. దీని వల్ల కలుషిత ఎథనాల్‌ సరఫరా జోలికి వెళ్లే అవకాశాలు తగ్గుతాయి. ఇప్పటికే కొన్ని ఆటోమొబైల్‌ బ్రాండ్లు పాత వాహనాల కోసం E20 కన్వర్షన్‌ కిట్లను కూడా అందుబాటులోకి తెస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల సంగతేంటి?

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఈ మార్పు ప్రభావం స్పష్టంగా కనిపించనుంది. హైదరాబాద్‌, విజయవాడ వంటి నగరాల్లో ఉన్న పెట్రోల్‌ బంకుల్లో 95 RON ప్రమాణం అమల్లోకి వస్తే, ఆధునిక ఇంజిన్‌ టెక్నాలజీ ఉన్న కార్లు, బైక్‌లకు ఇది ప్రయోజనకరంగా మారుతుంది.

మొత్తంగా చూస్తే, 95 RON పెట్రోల్‌ నిర్ణయం కేవలం ఆక్టేన్‌ సంఖ్య పెంపు మాత్రమే కాదు. ఇది దేశ ఇంధన స్వావలంబన, పర్యావరణ పరిరక్షణ, రైతుల ఆదాయం పెంపు లక్ష్యాలకు అనుసంధానమైన వ్యూహాత్మక అడుగు అని చెప్పాలి. 2026 ఏప్రిల్‌ 1 నుంచి మీ వాహనంలోకి చేరే ప్రతి లీటర్‌ పెట్రోల్‌లో ఈ మార్పు కనిపిస్తుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.