Iran War Effect: పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు కేవలం భౌగోళిక రాజకీయాలకే పరిమితం కాలేదు.అవి గ్లోబల్ సప్లై చైన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రపంచ చమురు వాణిజ్యంలో 20 శాతం, భారతదేశ ముడి చమురు దిగుమతుల్లో 50 శాతం వాటా కలిగిన హోర్మూజ్ జలసంధి ప్రస్తుతం ఒ ప్రమాదకరమైన మలుపులో ఉంది. జల సంధి అధికారికంగా మూసివేయకపోయినా అక్కడ పెరిగిన ఇన్సూరెన్స్ రేట్లు, దాడులకు భయంతో షిప్పింగ్ కార్యాకలాపాలు స్తంభించిపోయాయి. 

Continues below advertisement

దాదాపు 4500 భారతీయ ఎగుమతిదారులు, 1800 మంది దిగుమతిదారులు ఈ మార్గంపై ఆధారపడి ఉన్నారు. షిప్పింగ్ కంపెనీలు ఇప్పుడు వార్ రిస్క్ సర్ఛార్జ్‌, ఎమర్జెన్సీ ఫ్యూయల్‌ సర్ఛార్జ్ వంటి కొత్త పన్నులను విధిస్తున్నాయి. దీని వల్ల కంటైనర్‌ రవాణా ఖర్చు ఏకంగా రెండు వేల నుంచి మూడు వేల డాలర్ల వరకు పెరిగింది షిప్పింగ్ ఆలస్యం వల్ల వస్తువులు చేరడానికి పట్టే సమయంలో మరో పది నుంచి ఇరవై రోజులు పెరుగుతోంది.  

విడిభాగాల కొరత ప్రారంభం 

ఆసియాలోనే అతి పెద్ద ఆటోమొబైల్‌ విడిభాగాల మార్కెట్‌ అయిన ఢిల్లీలోని కశ్మీర్‌ గేట్‌లోని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ముడి చమురు ధరలు పెరగడం వల్ల ప్లాస్టిక్‌, రబ్బర్, ప్యాకేజింగ్ మెటీరియల్స్‌ ధరలు పెరిగాయి. మార్కెట్‌ నిపుణుల ప్రకారం విడిభాగాల తయారీ ఖర్చు 25 శాతం నుంచి 50 శాతం వరకు పెరిగింది. 

Continues below advertisement

మరోవైపు ఇంధన ధరల పెరుగుదల వల్ల ఫ్యాక్టరీల్లో కార్మికులు స్వగ్రామాలకు తరలిపోతుండటంతో ఉత్పత్తి కుంటుపడింది. రబ్బర్ విడిభాగాల తయారీ ఖర్చు పది నుంచి 16 రూపాయలకి పెరగగా, ముడి చమురు ధరల పెరుగుదల వల్ల ప్లాస్టిక్‌ వస్తువుల ధరలు రెట్టింపు అవుతున్నాయి. దీనికి తోడు హుర్మూజ్ జలసంధి వద్ద సుమారు 2,300 పెట్రోలియం కంటైనర్లు నిలిచిపోవడం వల్ల సప్లై పూర్తిగా దెబ్బతింది. 

ధరల మోత వినియోగదారులపై ప్రభావం 

కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి తయారీదారులు ధరలను పెంచడం అనివార్యమని ప్రకటించారు. ముడిసరుకుల ధరలు పెరగడం వల్ల కార్లు, టీవీలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్ల ధరలు ఐదు శాతం నుంచి ఆరు శాతం వరకు పెరగనున్నాయి. మెర్సిడెస్‌ బెంజ్‌, ఆడి వంటి సంస్థలు ఇప్పటికే రెండు శాతం ధరల పెంపును ప్రకటించాయి. షూస్‌, ప్లాస్టిక్ ఆధారిత దుస్తుల ధరల 8 శాతం నుంచి 12 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది.

వార్ రూమ్‌లను ఏర్పాటు చేస్తున్న కంపెనీలు 

వాహన తయారీ సంస్థలు పాండమిక్‌ సమయంలో చేసినట్టుగానే క్రైసిస్ మేనేజ్‌మెంట్‌ టీమ్‌లను ఏర్పాటు చేస్తున్నాయి. అల్యూమినియం, కాపర్, ఎలక్ట్రానిక్ విడిభాగాల కోసం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే మార్గాలను అన్వేషిస్తున్నాయి. అయినప్పటికీ భారత్ విడిభాగాలు దిగుమతుల్లో చైనా వాటా 30 శాతంగా ఉంది. జర్మనీ, దక్షిణ కొరియా నుంచి కూడా దిగుమతులు పెరుగుతున్నప్పటికీ, ప్రస్తుతం పరిస్థితుల్లో ధరల నియంత్రణ అనేది తయారీదార్లకు ఒక సవాల్‌గా మారింది.  

నేటి పరిస్థితులు చూస్తుంటే 1970 నాటి అంతర్జాతీయ సంక్షోభాన్ని గుర్తు తెస్తుందని నిపుణులు చెబుతున్నారు. కేవలం చమురు మాత్రమే కాదు, టైల్స్, పేపర్, పెట్రోకెమికల్ ఉత్పత్తులపై ఆధారపడిన పరిశ్రమలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.