Upcoming Flex Fuel Cars India 2026:ప్రతి రోజూ పెరుగుతున్న పెట్రోల్ ధరలు సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలు కొందామంటే ఛార్జింగ్ సమస్యలు, రేంజ్‌పై అనేక అనుమానాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కార్ల కంపెనీలు గుడ్ న్యూస్ చెబుతున్నాయి. భారీ సంఖ్యలో ఫ్లెక్స్ ఫ్యూయల్‌ వెహికల్స్ మార్కెట్‌లోకి రానున్నాయి. కేవలం పెట్రోల్‌తోనే కాకుండా, వందశాతం ఇథనాలతో నడిచే కార్లు, బైక్‌లపై పూర్తి సమాచారం ఇక్కడ చూద్దాం. 

Continues below advertisement

ఇది కేవలం ఒక టెక్నాలజీ మార్పు మాత్రమే కాదు, భారత్‌ రైతన్నల పంటల నుంచి తయారయ్యే ఇథనాల్‌తో మన వాహనాలు పరుగులు తీయబోతున్న ఆత్మనిర్భర్ ప్రయాణం. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా పెరుగుతున్న క్రూడ్‌ ఆయిల్‌ ధరల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రభుత్వం ఈ ఫ్లెక్స్‌ ఫ్యూయల్ వైపు వేగంగా అడుగులు వేస్తోంది. మరి ఈ కొత్త టెక్నాలజీ వల్ల మనకు వచ్చే లాభాలేంటీ? ధరలు ఎలా ఉండబోతున్నాయి?ఏయే కంపెనీలు రేసులో ఉన్నాయో చూద్దాం. 

అసలు ఏంటీ ఫ్లెక్స్‌ ఫ్యూయల్?  పెట్రోల్‌కు దీనికి తేడా ఏంటీ?

సాధారణంగా మన వాహనాలు పెట్రోల్‌ లేదా డీజిల్‌తో నడుస్తాయి. కానీ ప్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్స్‌ ప్రత్యేకత ఏంటంటే, ఇవి పెట్రోల్‌, ఇథనాల్ మిశ్రమంతో పని చేస్తాయి. ఇందులో కేవలం 20 శాతం ఇథనాల్‌ మాత్రమే కాకుండా, ఏకంగా వందశాతం ఇథనాల్  వాడుకోవచ్చు. ఈ ఇంజిన్‌లో ఉండే సెన్సార్లు ఇంధనంలోని ఇథనాల్ శాతాన్ని గుర్తించి, దానికి తగ్గట్టుగా పెర్ఫార్మెన్స్‌ను అడ్జెట్స్‌ చేసుకుంటాయి. ఇది వినియోగదారులకు, ప్రభుత్వానికి, పర్యావరణానికి ఒక నాన్‌ బ్రెయినర్ సొల్యూషన్ అని నిపుణులు చెబుతున్నారు. 

Continues below advertisement

రేసులో ఉన్న దిగ్గజ కంపెనీలు 

2026లో భారత్ రోడ్లపైకి ఫ్లెక్సస్ ఫ్యూయల్ వాహనాలు జాతర కనిపిస్తోంది. ఇప్పటికే పలు కంపెనీలు తమ మోడళ్లను లాంచ్ చేశాయి. మరికొన్ని సిద్ధంగా ఉన్నాయి. దేశంలోనే మొట్టమొదటి ఫ్లెక్స్ ఫ్యూయల్‌ కార్‌ మారుతి వ్యాగనర్‌ ఆర్‌ బయోఫ్లెక్సస్ పేరుతో జూన్ 4న లాంచ్ చేసింది. ఇది వంద శాతం ఇథనాల్‌తో నడుస్తుంది. 

టయోటా తన పాపులర్ మోడల్ ఇన్నోవా హైక్రాస్‌తో ఒక స్ట్రాంగ్ హైబ్రిడ్‌  ఫ్లెక్స్ ఫ్యూయల్‌ పైలట్ ప్రాజెక్టును నడుపుతోంది. టాటా మోటార్స్ వచ్చే ఏడాది ఆరంభం నాటికి తన మొదటి ప్లెక్స్ ఫ్యూయల్‌ వాహనాన్ని తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. హీరో మోటోకార్ప్‌ జూన్‌3న హీరో హెచ్‌ఎఫ్‌ డీలక్స్‌, హీరో స్ప్లెండర్‌ ప్లస్‌ ఫ్లెక్స్ ఫ్యూయల్‌ వేరియంట్లను మార్కెట్‌లోకి తెచ్చింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ కూడా ఇప్పటికే క్లాసిక్‌ 35 మోడల్‌ను ఫ్లెక్స్ ఫ్యూయల్‌ అనుకూలంగా మార్చింది. మిగిలిన పోర్ట్‌పోలియోను కూడా అప్‌డేట్ చేస్తోంది. 

ఫ్లెక్స్ ఫ్యూయల్ సామాన్యుడికి లాభమా? నష్టమా?

ఫ్లెక్స్ ఫ్యూయల్‌ వాహనాల విషయంలో రెండు ప్రధాన సవాళ్లు ఉన్నాయి. ఫ్లెక్స్ ఫ్యూయల్‌ కార్లు సాధారణ పెట్రోల్‌ కార్ల కంటే సుమారు 50 వేల నుంచి 85వేల వరకు ఎక్కువ ధర ఉండచ్చు. అయితే టూవీలర్స్‌ ధర వ్యత్యాసం కేవలం 4 శాతమే ఉంటుంది. ఇథనాల్‌లో పెట్రోల్ కంటే తక్కువ శక్తి ఉంటుంది. కాబట్టి మైలేజీ 30 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. ఈ లోటును పూడ్చాలంటే ఇథనాల్‌ ధర పెట్రోల్ కంటే కనీసం 30 శాతం తక్కువగా ఉండాలని పరిశ్రమ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో E85 ఇంధనం ధర 82 రూపాయలు ఉండగా, పెట్రోల్ ధర 102 కంటే ఎక్కువగా ఉంది. 

బ్రెజిల్‌లా భారత్ మారుతుందా?

ఫ్లెక్స్ ఫ్యూయల్‌ విజయంలో బ్రెజిల్‌ ప్రపంచానికి ఆదర్శం. అక్కడ విక్రయించే కొత్త కార్లలో 90 శాతం FFVs ఉన్నాయి. బ్రెజిల్‌లో ఇథనాల్ వినియోగం పెరగడానికి ప్రధాన కారణం అది పెట్రోల్ కంటే చౌకగా లభించడమే. భారత్ కూడా అదే దారిలో వెళ్తే, మన ముడి చమురు దిగుమతులు తగ్గి, విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది. అంతేకాకుండా ఎలక్ట్రిక్ వాహనాల కోసం చైనాపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని విశ్లేషకులు చెబుతున్నారు. 

2030 నాటికి భారత్ కార్ మార్కెట్‌ 60 లక్షల వాహనాలకు చేరుతుందని అంచనా. అందులో ఎలక్ట్రిక్ వాహనాల వాటా 20 శాతం మాత్రమే ఉన్నా, మిగిలిన వాహనాలు ఇంధనంపైనే నడవాలి. ఈ క్రమంలో ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీ ఒక గేమ్ ఛేంజర్‌్ కానుంది. అయితే ప్రభుత్వం ఇథనాల్ ధరలను మరింత తగ్గించి, జీఎస్టీ రాయితీలు ఇస్తే తప్ప సామాన్యులు దీని వైపు మొగ్గు చూపే అవకాశం తక్కువగా కనిపిస్తోంది.