E20 Petrol Effect on BS3 Vehicles: ప్రస్తుతం భారత్‌లో అత్యంత చర్చనీయాంశంగా ఉన్న అంశం ఇథనాల్. ప్రభుత్వం ఇప్పుడు అన్ని పెట్రోల్ పంపులలో ఇథనాల్‌ను తప్పనిసరి చేసింది. ఈ ఇంధనంపై అనేక చోట్ల నిరసనలు జరుగుతున్నప్పటికీ, ఈలోగా, వాహన యజమానుల ఆందోళనల కారణంగా, కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఇథనాల్‌కు సంబంధించిన పరిస్థితిని పూర్తిగా స్పష్టం చేసింది. రాజ్యసభలో ఒక లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానమిస్తూ, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, E20 ఇంధనాన్ని ఉపయోగించడానికి వాహనాల ఇంజిన్‌ను మార్చడం లేదా ఎలాంటి పెద్ద మార్పులు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 

Continues below advertisement

అయితే, ఏప్రిల్ 1, 2005న అమల్లోకి వచ్చిన BS-III ప్రమాణాలతో, 2016కు ముందు తయారు చేసిన కొన్ని వాహనాలకు రబ్బరు భాగాలు, గాస్కెట్‌లను మార్చవలసి రావచ్చు. కాబట్టి, ఇథనాల్ ప్రభావానికి ఏ వాహన భాగాలు ఎక్కువగా గురవుతాయో, వేటిని మార్చవలసి ఉంటుందో పరిశీలిద్దాం.

ఈ వాహనాలు, విడిభాగాలపై ప్రభావం పడుతుందా?

E20 ఇంధనం ప్రభావాన్ని కచ్చితంగా అంచనా వేయడానికి ఇండియన్ ఆయిల్, ఐఐపి డెహ్రాడూన్, సియామ్, ఏఆర్ఏఐ ఒక అధ్యయనాన్ని నిర్వహించాయని ప్రభుత్వం తెలియజేసింది. ఈ అధ్యయనంలో కొన్ని ప్రధాన సమస్యలు వెలుగులోకి వచ్చాయి. అధ్యయన నివేదిక ప్రకారం, ఏప్రిల్ 1, 2005 తర్వాత తీసుకొచ్చిన, 2016కు ముందు తయారైన బీఎస్-III ప్రమాణాలకు అనుగుణమైన ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలు సమస్యలను ఎదుర్కోవచ్చు. 

Continues below advertisement

ఇంధన సరఫరా వ్యవస్థలోని రబ్బరు పైప్స్‌, రబ్బరు సీల్స్, గాస్కెట్లు, వాషర్లను కూడా మార్చవలసి రావచ్చు. ప్రభుత్వం చెప్పినదాని ప్రకారం, ఇది తీవ్రమైన సాంకేతిక సమస్య కాదు, సాధారణ వాహన సర్వీసింగ్ సమయంలో దీనిని సులభంగా మార్చవచ్చు.

ఇది పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుందా?

పార్లమెంటులో అడిగిన వివిధ టెక్నికల్ ప్రశ్నలకు సమాధానమిస్తూ, వాస్తవ పరిస్థితుల్లో నిర్వహించిన పరీక్షలు, క్షేత్రస్థాయి ప్రయోగాల్లో, పాత వాహనాల ఇంజన్లలో E20 వాడకం వల్ల అసాధారణమైన లేదా ఇంజన్ జామ్ అయ్యే సమస్యలు తలెత్తలేదని తేలిందని నితిన్ గడ్కరీ చెప్పారు. 

అంతేకాకుండా, వాహనాల డ్రైవింగ్ పనితీరు, కోల్డ్ స్టార్ట్‌లు, ఇతర మెటల్‌ పార్ట్స్‌ లేదా ప్లాస్టిక్ భాగాలపై E20 వల్ల ఎటువంటి ప్రతికూలమైన ప్రభావం కానీ, హానికరమైన ఎఫెక్ట్‌ లేదు. E20 ఇంధనాన్ని ఉపయోగించే వాహనాలపై ఆటోమొబైల్ తయారీదారులు తమ వారంటీ ప్రక్రియను కొనసాగిస్తున్నారని కూడా ఆయన పేర్కొన్నారు.

మైలేజీ తగ్గుతుందనే ప్రచారంపై ప్రకటన 

E20 పెట్రోల్ కారణంగా మైలేజీ తగ్గుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. E20 వల్ల తమ వాహనాల మైలేజీ తగ్గిపోయిందని చాలా మంది అనుమానిస్తున్నారు. అయితే, వాహనం మైలేజీ కేవలం ఎలాంటి ఇంధనం వాడుతున్నామనే దానిపై ఆధారపడి ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. వాహనం పరిస్థితి, సరైన డ్రైవింగ్ అలవాట్లు, ఇంజన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్‌లను సకాలంలో మార్చడం, సరైన టైర్ ప్రెజర్, వీల్ అలైన్‌మెంట్, ఎయిర్ కండిషనర్ లోడ్ వంటి అనేక ఇతర ముఖ్యమైన అంశాలు కూడా మైలేజీని ప్రభావితం చేస్తాయి. 

వాహన యజమానులందరికీ ముఖ్యమైన సలహా

గమనించదగ్గ విషయం ఏమిటంటే, మీ కారు లేదా బైక్ 2016 తర్వాత (BS-IV లేదా BS-VI) తయారై ఉంటే, అది E20 ఇంధనానికి పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీది 2016 కంటే ముందు తయారైన BS-3 మోడల్ అయితే, కంగారు పడకుండా, సర్వీసింగ్ సమయంలో అధికారిక వర్క్‌షాప్‌లో ఫ్యూయల్ పైపులు, రబ్బర్ గాస్కెట్‌లను చెక్‌ చేయించండి. అవసరమైతే వాటిని E20-కి అనుకూలమైన భాగాలతో మార్పించండి.