BS4 Cars Fuel Efficiency With E20 Petrol: భారతదేశంలో 2025 నాటికి E20 పెట్రోల్‌ను పూర్తిగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కానీ పాత BS4 కార్లు ఈ కొత్త ఇంధనానికి సిద్ధమా?. తాజాగా చేసిన రియల్‌-వరల్డ్‌ టెస్టుల ప్రకారం - పాత BS4 మోడళ్లలో E20 పెట్రోల్‌ వాడితే మైలేజ్‌ తగ్గుదల స్పష్టంగా తెలుస్తోంది.

E20 పెట్రోల్‌ అంటే ఏమిటి?E20 అనేది 20% ఎథనాల్‌, 80% పెట్రోల్‌ మిశ్రమం. ఎథనాల్‌ పర్యావరణహితమైనప్పటికీ, ప్రతి లీటరుకు 30% తక్కువ ఎనర్జీ ఇస్తుంది. దీంతో, వాహనాల ఫ్యూయల్‌ ఎఫిషియన్సీ సహజంగానే తగ్గుతుంది.

ఏ మోడళ్లపై టెస్ట్‌ చేశారు?2016 Maruti Suzuki Dzire, 2016 Hyundai Grand i10, 2017 Volkswagen Polo GT TSI మోడళ్లపై E20 పెట్రోల్‌తో మైలేజ్‌ టెస్టులు చేశారు. ఇవన్నీ BS4 స్పెక్‌ ఇంజిన్లు, అంటే E10 ఇంధనానికి మాత్రమే సరిపోయే పాత మోడళ్లు.

టెస్ట్‌ ఫలితాలు

మైలేజ్‌ పరీక్ష ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి:

మారుతి డిజైర్‌: మైలేజ్‌ 12.4% తగ్గింది. సగటున 19.3 km స్పీడ్‌లో - E10 ఇంధనంతో ఈ కారు లీటరుకు 12.65 km మైలేజ్‌ ఇచ్చింది. E20 ఇంధనంతో 11.49 km మైలేజ్‌ ఇచ్చింది. 

హ్యుందాయ్‌ గ్రాండ్‌ i10: మైలేజ్‌ 9.2% తగ్గింది. సగటున 19.3 km స్పీడ్‌లో - E10 ఇంధనంతో ఈ కారు లీటరుకు 11.19 km మైలేజ్‌ ఇచ్చింది. E20 ఇంధనంతో 9.8 km మైలేజ్‌ ఇచ్చింది. 

వోక్స్‌వ్యాగన్‌ పోలో GT TSI: మైలేజ్‌ కేవలం 5.2% తగ్గింది. సగటున 18 km స్పీడ్‌లో - E10 ఇంధనంతో ఈ కారు లీటరుకు 9.63 km మైలేజ్‌ ఇచ్చింది. E20 ఇంధనంతో 9.13 km మైలేజ్‌ ఇచ్చింది. 

వోక్స్‌వ్యాగన్‌ పోలో లో ఉన్న 1.2 లీటర్‌ టర్బో ఇంజిన్‌ అధిక కంప్రెషన్‌ రేషియోతో పని చేయడం వల్ల E20లోనూ కొంత మైలేజ్‌ రికవర్‌ చేయగలిగింది. కానీ డిజైర్‌, i10 వంటి నేచురల్‌ ఆస్పిరేటెడ్‌ ఇంజిన్లు E20కి తగినట్టు ట్యూన్‌ కాలేదు.

ఎందుకు తేడా వస్తుంది?ఎథనాల్‌ తక్కువ ఎనర్జీ ఇస్తుంది. అయితే అది ఆక్టేన్‌ రేటింగ్‌ను పెంచుతుంది, దీంతో కొన్ని టర్బో ఇంజిన్లు ఇగ్నిషన్‌ టైమింగ్‌ సర్దుబాటు చేసుకుని ఎఫిషియన్సీని కాపాడగలవు. కానీ పాత నేచురల్‌ ఇంజిన్లు అలా చేయలేవు. అందుకే అవి ఎక్కువ ఫ్యూయల్‌ వాడతాయి. డిజైర్‌లో ఉన్న 4-స్పీడ్‌ టార్క్‌ కన్వర్టర్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ మోడల్‌ కూడా మైలేజ్‌ తగ్గడానికి ఇదే ప్రధాన కారణం.

E20 వాడకం వల్ల భవిష్యత్‌ ప్రభావంపాత BS4, ప్రారంభ BS6 మోడళ్ల యజమానులు E20 వాడితే లాంగ్‌టర్మ్‌లో సీళ్లు, రబ్బరు భాగాలు, ఇంజెక్టర్‌లు డ్యామేజ్‌ అయ్యే అవకాశం ఉంది. కొన్ని కంపెనీలు (ఉదా: మారుతి) అప్‌గ్రేడ్‌ కిట్లు ఇవ్వొచ్చు కానీ అవి కేవలం సేఫ్టీకి మాత్రమే; మైలేజ్‌ డ్రాప్‌ తగ్గించలేవు.

E20 ఇంధనం పర్యావరణానికి మంచిదే కానీ పాత వాహనాల యజమానుల జేబుకు కొంచెం భారమవుతుంది. మైలేజ్‌ తగ్గడం వల్ల రన్నింగ్‌ ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యంగా, కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌ ధర తగ్గించకపోవడంతో ఈ ప్రభావం మరింత బాగా కనిపిస్తుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.