AI Summit 2026: సాంకేతిక పరిజ్ఞానం మనిషి ఊహకు అందనంత వేగంగా దూసుకుపోతోంది. నిన్నటి వరకు సైన్స్ ఫిక్షన్ సినిమాలకే పరిమితమైన అద్భుతాలు ఇప్పుడు మన కళ్ల ముందే సాక్షాత్కరిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక నిపుణుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు జరుగుతున్న అంతర్జాతీయ సదస్సు గ్లోబల్ సౌత్లో నిర్వహించిన మొదటి అతి పెద్ద ఏఐ సమ్మిట్గా చరిత్ర సృష్టించింది.
ప్రధానమంత్ర నరేంద్రమోదీ ప్రారభించిన ఈ కార్యక్రమంలో ఓపెన్ ఏఐ సీఈఓ శ్యామ్ ఆల్ట్మాన్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వంటి దిగ్గజాలతోపాటు వందకుపైగా దేశఆల ప్రతినిధులు పాల్గొన్నారు. ఏఐ భవిష్యత్పై చర్చించారు. అయితే ఈ సదస్సులో అయితే అందర్నీ ఆశ్చర్యపరిచిన అంశం మాత్రం ఆటోమొబైల్ రంగంలో చోటుచేసుకుంటున్న విప్లవాత్మక మార్పులు. ముఖ్యంగా భారతీయ దిగ్గజం టాటా మోటార్స్ ప్రదర్శించిన సరికొత్త ఏఐ ఫీచర్లు వాహన రంగ భవిష్యత్ను సరికొత్తగా నిర్వహించబోతున్నాయి.
కారు చోరీలకు చెక్- మీ ఫేసే లాక్
నేటి కాలంలో వాహనాల చోరీలు అతిపెద్ద సమస్యగా మారాయి. కానీ ఇకపై ఆ భయం అక్కర్లేదని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. ఈ సమ్మిట్లో టాటా మోటార్స్ ప్రదర్శించిన బయోమెట్రిక్ వెరిఫికేషన్ సిస్టమ్ వాహన భద్రతలో సరికొత్త ప్రమాణాలను సెట్ చేస్తోంది. ఈ టెక్నాలజీ ప్రకారం కారును స్టార్ట్ చేయాలంటే కేవలం కీ ఉంటే సరిపోదు. డ్రైవర్ తన వేలి ముద్ర లేదా ఫేస్ ఐడెంటిఫికేషన్ నిర్దారించుకోవాలి.
అనధికారిక వ్యక్తులు, లేదా దొంగలు కారు లోపలికి వెళ్లి బయోమెట్రిక్ వెరిఫికేషన్ లేకుండా ఇంజిన్ స్టార్ట్ చేయలేరు. స్మార్ట్ఫోన్లో మనం చూసే సెక్యూరిటీ ఫీచర్లు ఇప్పుడు కార్లకు కూడా వర్తింపజేస్తున్నారు. అవసరం అయితే కుటుంబ సభ్యులు లేదా డ్రైవర్ల వివరాలను ముందే సిస్టమ్లో నమోదు చేసే వెసులుబాటు కూడా తీసుకొస్తున్నారు. దీని వల్ల భవిష్యత్లో ఇన్సూరెన్స్ ప్రీమియంలు తగ్గే అవకాశం ఉంది. యువ డ్రైవర్ల వేగాన్ని నియంత్రించే వీలు కూడా కలుగుతుంది.
వాయిస్ కమాండ్ కంట్రోల్
డ్రైవింగ్ అంటే స్టీరింగ్ పట్టుకోవడం గేర్లు మార్చడం అనే పాత పద్ధతులకు కాలం చెల్లబోతోంది. ఈ ఏఐ కార్లలో మీ మాటే కీలక పాత్ర పోషిస్తుంది. వాయిస్ కమాండ్లతో కారును నియంత్రించవచ్చు. ఇది కేవలం నావిగేషన్ మాత్రమే కాదు, కారు ఆటోమేటింక్గా నడిపించే దిశగా కీలక అడుగుగా భావిస్తున్నారు.
లాంగ్డ్రైవ్లకు వెళ్లే వారికి వాయిస్ కమాండ్ ఫీచర్ వరప్రసాదం కానుంది. డ్రైవర్ శ్రమ పడకుండానే కారు తనంతట తానుగా గమ్యానికి చేరుకోగలదు. ఇప్పటికే ప్రపంచ మార్కెట్లో టెస్లా వంటి సంస్థలు ఈ తరహా ప్రయోగాలు చేస్తున్నప్పటికీ భారతీయ రోడ్లకు అనుగుణంగా టాటా వంటి సంస్థలు ఏఐ సాఫ్ట్వేర్ను డెవలప్ చేస్తున్నారు.
పొగమంచులోనూ సురక్షితమైన డ్రైవింగ్
భారత్లో శీతాకాలంలో పొగమంచు కారణంగా జరిగే ప్రమాదాలు చాలా ఎక్కువ. ఈ సమస్యకు ఏఐ చెక్ పెట్టబోతోంది. వాహనాల్లో అమర్చిన రాడార్, లిడార్ వంటి అడ్వాన్స్డ్ సెన్సర్లు పొగమంచులో కూడా ముందు ఉన్న వాహనాల దూరాన్ని కచ్చితంగా గుర్తిస్తాయి. కంటికి కనిపించని అడ్డంకులను కూడా ఈ సెన్సర్లు గుర్తించి, వాహనానికి ఎలాంటి ప్రమాదం జరగకుండా చూస్తాయి. దీని వల్ల తక్కువ విజిబిలిటీ ఉన్నా సరే ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదు.
డ్రైవర్ నిద్రపోతున్నా గుర్తించే ఏఐ
రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలలో డ్రైవర్ల నిద్ర మత్తు ఒకటి. ఈ సమస్యను పరిష్కరించేందుకు డ్రైవ్ డ్రౌజినెస్ డిటె్షన్ వ్యవస్థను ప్రదర్శించారు. ఈ సిస్టమ్ డ్రైవర్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్, ఐ బ్లింకింగ్ను గమనిస్తూ ఉంటుంది. ఒక వేళ డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నట్టు గుర్తిస్తే, వెంటనే అలర్ట్ సౌండ్ ద్వారా హెచ్చరిస్తుంది. అలర్ట్కు డ్రైవర్ స్పందించకుంటే ఏఐ సిస్టమ్ మరింత వేగంగా స్పందిస్తుంది. ప్రమాదం జరగకుండా ఉండేందుకు కారు వేగాన్ని తగ్గిస్తుంది. ఆటోమేటిక్గా కారును ఆపేస్తుంది.
భారతీయ ఆటోమొబైల్ రంగంలో సరికొత్త శకం
ఢిల్లీ ఏఐ సమ్మిట్ 2026 ద్వారా భారత్ గ్లోబల్ ఏఐ హెబ్గా ఎదుగుతోందని స్పష్టమైంది. ఒకప్పుడు కేవలం విదేశీ కార్లకే పరిమితమైన లగ్జరీ ఫీచర్లు ఇప్పుడు సామాన్యుల భద్రత కోసం అందుబాటులోకి రానున్నాయి. మొత్తానికి భవిష్యత్ స్టీరింగ్పై చేతులు ఉండకపోవచ్చు, కానీ మన స్వరమే కారును నడిపిస్తుంది. రోడ్డు భద్రత పరంగా ఈ ఏఐ విప్లవం దేశంలోనే గేమ్ ఛేంజర్గా మారబోతోంది.