YCP leader YV Subbareddy:  షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరకుండా తాను రాయబారం నిర్వహించలేదని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. విజయమ్మను మాత్రమే లోటస్ పాండ్ లో కలిశానని కుటుంబ విషయాలు మాట్లాడానన్నారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో సీఎం జగన్ ను వైవీ సుబ్బారెడ్డి కలిశారు. క్యాంప్ ఆఫీస్ దగ్గర ఉన్న మీడియాతో మాట్లాడారు.  జగన్ తరపున తాను వైఎస్ షర్మిలతో మధ్యవర్తిత్వం చేసినట్లు ప్రచారం జరుగుతోంది కానీ అది నిజం కాదన్నారు. తాను ఎవరితోనూ మధ్యవర్తిత్వం చేయలేదని తెలిపారు. తాను మామూలుగానే అప్పుడప్పుడు విజయమ్మను కలసి కుటుంబ విషయాలపై మాట్లాడతానని చెప్పారు. నెల రోజుల తర్వాత ఆదివారం విజయమ్మను హైదరాబాద్ లో కలిశానన్నారు. కొద్దిసేపు కుటుంబ విషయాలపై విజయమ్మ, తాను మాట్లాడుకున్నామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.


షర్మిల కాంగ్రెస్‌లో చేరుతారో లేదో తెలియదు !                  


చంద్రబాబును దత్తపుత్రుడిని సీఎం చేసేందుకు తమపై బురద జల్లుతున్నారని వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. కుట్రలు కుతంత్రాలు చేస్తూ, వైఎస్ కుటుంబ సభ్యులను బజారు కెక్కిస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా.. సీఎం జగన్ కు నష్టమేమీ లేదని తెలిపారు. తామేమీ రాయబారాలు చేయాల్సిన పని లేదని చెప్పారు. ప్రజలే జగన్ ను మరోసారి ఆశీర్వదించి సీఎంను చేస్తారన్నారు.  షర్మిల కాంగ్రెస్ పార్టీలో   చేరుతున్నారో లేదో తనకు సమాచారం లేదని చెప్పారు. సీఎం జగన్ వెంట మేమంతా ఉంటాం.. రాబోయే రోజుల్లో జగన్ ను సీఎంను చేసుకుంటామని పేర్కొన్నారు.


షర్మిల కాంగ్రెస్ లోకి వెళ్లిన జగన్‌కు నష్టం లేదు !                      


షర్మిల కాంగ్రెస్ లోకి వెళ్లినా.. తమకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం చేసే అభివృద్ది కార్యక్రమాలే తమకు విజయాన్ని అందిస్తాయని తెలిపారు. చాలా స్థానాల్లో వైసీపీ నష్ట పోకుండా ఉండేందుకే అభ్యర్థులను మార్చుతున్నాం.. వాస్తవ పరిస్థితులు, వేర్వేరు కారణాలతో సీట్లు మార్చుతున్నట్లు తెలిపారు. ఏడాది నుంచి మార్పుల విషయాన్ని సీఎం జగన్ ఎమ్మెల్యేలకు చెబుతున్నారన్నారు. పలువురు ఎమ్మెల్యేలు షర్మిల వైపు వెళ్తున్నారని కొందరు సృష్టిస్తున్నారని తెలిపారు. వ్యక్తిగత కారణాలతో కొందరు పార్టీలు మారుతున్నారు.. వ్యక్తిగత కారణాలతోనే షర్మిల వెంట వెళ్లాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే నిర్ణయమని చెప్పారు. 


దాడి వీరభద్రరావుకు సీటు ఇచ్చే అవకాశం లేదు !                  


సీట్లు ఇవ్వలేని వారికి అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తామని సీఎం హామీ ఇస్తున్నారని తెలిపారు. గెలుపు అవకాశాలను బట్టి, అభ్యర్థిపై ఉన్న వ్యతిరేకతను బట్టి సీట్లు మార్పు ఉంటుందని అన్నారు. ఎన్ని సీట్లలో మార్పులు ఉంటాయన్నది ఇప్పుడేమీ చెప్పలేమని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. విశాఖలోని అనకాపల్లిలో  ప్రత్యేక  పరిస్థితులు ఉన్నాయని అక్కడ దాడి వీరభద్రరావుకు కానీ ఆయన కుమారులకు కానీ సీటు ఇచ్చే పరిస్థితి లేదన్నారు.కొంత ఓపిక పట్టాలని చెప్పామని కానీ ఆయన వినిపించుకోలేదన్నారు.