YSRCP MLAs decide to go to the Assembly for one day:  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఒక్క రోజు .. గవర్నర్ ప్రసంగానికి హాజరు కావాలని వైసీపీ ఎమ్మెల్యేలు  నిర్ణయం  తీసుకున్నారు. ఈ నిర్ణయం వెనుక ప్రధానంగా అనర్హత వేటు  భయం కనిపిస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం, ఏ ప్రజాప్రతినిధి అయినా సభ అనుమతి లేకుండా వరుసగా 60 పనిదినాల పాటు సమావేశాలకు గైర్హాజరైతే, వారి సభ్యత్వాన్ని రద్దు చేసే  అధికారం స్పీకర్‌కు ఉంటుంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ సుదీర్ఘ బడ్జెట్ సమావేశాలకు కూడా దూరంగా ఉంటే, ఈ 60 రోజుల గడువు సమీపించే ప్రమాదం ఉందని వైసీపీ భావిస్తోంది. అందుకే, కనీసం ఒక్క రోజు హాజరై సంతకం చేయడం ద్వారా ఆ సాంకేతిక ఇబ్బందిని అధిగమించాలని జగన్ మోహన్ రెడ్డి ఈ వ్యూహాన్ని రచించారు.

Continues below advertisement

అసెంబ్లీకి రానని చెప్పిన జగన్         

తనకు ప్రతిపక్ష హోదా ఇచ్చే వరకు అసెంబ్లీకి వెళ్లేది లేదని గతంలోనే జగన్ తెగేసి చెప్పారు. కానీ, సభ్యత్వం రద్దయితే రాజకీయంగా మరింత నష్టం జరుగుతుందనే ఆందోళన పార్టీలో మొదలైంది. గతంలో కూడా గవర్నర్ ప్రసంగం సమయంలో వైసీపీ సభ్యులు సభకు వచ్చి, కేవలం ఐదు నిమిషాల పాటు నిరసన తెలిపి వెనుదిరిగారు. ఈసారి కూడా అదే పంథాను అనుసరిస్తూ, కేవలం హాజరు పట్టికలో సంతకం చేసి తమ సభ్యత్వాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రజా సమస్యలపై చర్చించడం కంటే, పదవులను కాపాడుకోవడానికే వైసీపీ ప్రాధాన్యత ఇస్తోందని  టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.         

Continues below advertisement

హాజరు కోసమే ఒక్క రోజు రాక        

ఓట్లు వేసి గెలిపించిన ప్రజల సమస్యలను సభలో వినిపించకుండా, కేవలం అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి ఇలా  వేషాలు వేయడం ప్రజలను వంచించడమేనని టీడీపీ విమర్శిస్తోంది. జంగా ప్రజల మీద ప్రేమ ఉంటే సభకు వచ్చి చర్చల్లో పాల్గొనాలి కానీ, ఇలా దొడ్డిదారిన వచ్చి సంతకాలు పెట్టి వెళ్లడం ఏమిటి అని అధికార పక్షం ప్రశ్నిస్తోంది. ప్రతిపక్ష హోదా అనేది సభలో ఉన్న సంఖ్యాబలంపై ఆధారపడి ఉంటుందని, దాన్ని సాకుగా చూపి సభకు రాకపోవడం బాధ్యతారాహిత్యమని టీడీపీ నేతలు  అంటున్నారు.     

పదవి పోతుందన్న  భయంతోనే వెళ్తున్నారా?            

 వైసీపీ ఎమ్మెల్యేల అసెంబ్లీ రాక ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఒకవైపు ప్రతిపక్ష హోదా కోసం పట్టుబడుతూనే, మరోవైపు ఎమ్మెల్యే పదవులను కాపాడుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారనే విమర్శలను వైసీపీ ఎదుర్కొంటోంది. కేవలం ఒక్క రోజు హాజరుతో గండం గట్టెక్కాలని చూస్తున్న జగన్ వ్యూహం ఫలిస్తుందా లేక అధికార పక్షం దీనిపై చట్టపరంగా మరో అడుగు వేస్తుందా అనేది వేచి చూడాలి. సభ లోపల ఐదు నిమిషాల నిరసనతో వైసీపీ తన ఉనికిని చాటుకోవాలని చూస్తున్నా, అది ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలను తీసుకెళ్తుందనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.