YSRCP files petition in Supreme Court against Waqf Act : వక్ఫ్ బిల్లును చట్టంగా చేయడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టులో వైఎస్ఆర్సీపీ పిటిషన్ వేసింది. ముస్లిం సమాజం ఆందోళనలను పరిష్కరించడంలో వైఫల్యం, రాజ్యాంగ ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణిస్తూ వక్ఫ్ చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని వైఎస్ఆర్సీపీ తెలిపింది. ఈ బిల్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 13, 14, 25 , 26 లను ఉల్లంఘిస్తుందని పిటిషన్లో పేర్కొంది. . ప్రాథమిక హక్కులు, చట్టం ముందు సమానత్వం, మత స్వేచ్ఛ , మతపరమైన వర్గాలు తమ సొంత వ్యవహారాలను నిర్వహించడానికి స్వయంప్రతిపత్తిని రాజ్యాంగం హామీ ఇచ్చిందన్నారు. సెక్షన్ 9 , 14 కింద ముస్లిమేతర సభ్యులను చేర్చడం వక్ఫ్ సంస్థల అంతర్గత పనితీరులో జోక్యంగా పరిగణించాలని.. ఈ నిబంధన బోర్డుల మతపరమైన లక్షణాన్ని, పరిపాలనా స్వచ్చను దెబ్బతీస్తుందని వైసీపీ తన పిటిషన్ లో పేర్కొంది.
ఇప్పటికే వక్ఫ్ చట్టం-2025 సవరణ బిల్లుపై సుప్రీంకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. ముస్లిం పర్సనల్ లా బోర్డు, ఇతర ముస్లిం సంస్థలు, ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని, ముస్లిం ఆస్తుల సేకరణకు వ్యతిరేకమని వాదిస్తూ పిటిషన్ వేశాయి. అసదుద్దీన్ ఓవైసీ, తృణమూల్ కాంగ్రెస్ తో పాటు తమిళనాడులో రాజకీయ పార్టీ పెట్టిన విజయ్ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లు ప్రధానంగా వక్ఫ్ చట్టంలోని సవరణలు రాజ్యాంగ విరుద్ధమని, మత స్వేచ్ఛను ఉల్లంఘిస్తాయని, వక్ఫ్ ఆస్తుల నిర్వహణపై ప్రభావం చూపుతాయని వాదిస్తూ దాఖలు చేశారు.
నిజానికి వక్ఫ్ చట్టాన్ని పార్లమెంట్ లో వైఎస్ఆర్సీపీ వ్యతిరేకించింది. లోక్ సభలో బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. అయితే రాజ్యసభలో మాత్రం అనుకూలంగా ఓటేశారన్న ప్రచారం జరుగుతోంది. తాము బిల్లును వ్యతిరేకిస్తామని రాజ్యసభలో వైసీపీ పక్ష నేత సుబ్బారెడ్డి ప్రకటించారు. కానీ విపక్ష సభ్యులు .. వక్ఫ్ బిల్లును వ్యతిరేకించిన వారి ఓట్లు చూస్తే సరిపోలలేదు. మూడు ఓట్లు వక్ఫ్ బిల్లుకు మద్దతుగా ఎక్కువగా వచ్చాయి. అదే సమయంలో వ్యతిరేకించిన వారి ఓట్లు తక్కువగా వచ్చాయి. వైసీపీ సభ్యుల్లో ఒకరైన గుజరాత్ కు చెందిన పరిమిళ్ నత్వానీ బిల్లుకు అనుకూలంగా ఓటేశారని అంటున్నారు. ఆయన ఒక్కరే కాదని.. మరో ఇద్దరు, ముగ్గురు కూడా బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారని అంటున్నారు. విప్ జారీ చేశామని వైఎస్ఆర్సీపీ అంటున్నా.. ఓటింగ్ అయిపోయిన తర్వాత జారీ చేశారని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అయితే తాము బిల్లును సమర్థించడం లేదని నిరూపించుకునేందుకు వైసీపీ కోర్టులోనూ పిటిషన్లు దాఖలు చేసినట్లుగా భావిస్తున్నారు.