YS Sharmila Son Raja Reddy Wedding: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి ఇంట పెళ్లి బాజాలు మోగాయి. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మనవడు, వైఎస్ షర్మిల, బ్రదర్ అనిల్‌ల ఏకైక కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహం అట్టహాసంగా జరిగింది. రాజస్థాన్ లోని జోధ్ పూర్ ప్యాలెస్‌లో వైఎస్ రాజారెడ్డి (YS Rajareddy), అట్లూరి ప్రియ (Atluri Priya)ల వివాహం వైభవంగా జరిగిందని తెలిసిందే. ఇరుకుటుంబాల సభ్యులతో పాటు అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో రాజారెడ్డి, ప్రియల వివాహం క్రైస్తవ సంప్రదాయంలో జరిగింది. వధూవరులు పరస్పరం ఉంగరాలు మార్చుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. దివంగత నేత వైఎస్సార్ ఫొటో సాక్షిగా మూడు రోజులపాలు ఈ పెళ్లి వేడుకలు జరిగాయి. 




నేడు (ఫిబ్రవరి 18న) ఉదయం 11 గంటలకు ఇరు కుటుంబసభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆదివారం సాయంత్రం షర్మిల తనయుడు రాజారెడ్డి, ప్రియల వివాహం ఘనంగా జరిపించారు. ఇదివరకే రాజా రెడ్డి, ప్రియా అట్లూరిల హల్దీ వేడుకల ఫొటోలు వైరల్ అయ్యాయి. తాజాగా వీరి వివాహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వచ్చేశాయి. కుమారుడు రాజా రెడ్డి, కోడలు ప్రియకు షర్మిల కంగ్రాట్స్ చెప్పారు. హల్దీ వేడుకల ఫొటోలను షర్మిలనే స్వయంగా షేర్ చేశారు. షర్మిల కుమారుడి వివాహానికి ఆమె తల్లి వైఎస్ విజయమ్మ హాజరయ్యారు. కానీ ఆమె సోదరుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ తన మేనల్లుడు రాజా రెడ్డి వివాహానికి హాజరు కాలేదు. సీఎం జగన్ సిద్ధం సభ సహా పలు రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. 


మూడు రోజుల పాటు రాజారెడ్డి వివాహ వేడుకలు
కుమారుడు రాజారెడ్డి వివాహ వేడుకల్లో భాగంగా వైఎస్ షర్మిల కుటుంబసభ్యులు మూడు రోజుల కిందటే రాజస్థాన్ లోని జోధ్‌పూర్ కు చేరుకున్నారు. 16న తేదీన సంగీత్‌, మెహందీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అందుకు సంబంధించిన ఫొటోలను వైఎస్ షర్మిల తాజాగా తన ఫాలోయర్లతో షేర్ చేసుకున్నారు. ఈ 17న (శనివారం) సాయంత్రం 5.30 గంటలకు రాజా రెడ్డి, ప్రియలు ఇరు కుటుంబసభ్యులు, అతికొద్ది మంది సన్నిహితులు ప్రముఖుల సమక్షంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆదివారం సైతం ప్రత్యేక ప్రార్థనలతో పాటు క్రైస్తవ సంప్రదాయంలో రాజా రెడ్డి, ప్రియల వివాహం జరిపించారు. 



హైదరాబాద్ లో గ్రాండ్‌గా విందు! 
రాజ‌స్థాన్‌లో వివాహం కావడంతో అనంత‌రం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్ష‌న్ చేయాలని ప్లాన్ చేశారు. హైదరాబాద్ లోని శంషాబాద్ ఫోర్ట్ గ్రాండ్ లో ఈ రిసిప్షెన్ కు నిర్ణయించారు. రాజకీయ నేతలతో పాటు సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు విందుకు హాజరుకానున్నారు. ఆ కార్య‌క్ర‌మాన్ని కూడా పూర్తి చేసుకున్న త‌ర్వాతే రాజ‌కీయ కార్య‌క‌లాపాల్లో ష‌ర్మిల పాల్గొనున్నట్లు తెలుస్తోంది.