YS Sharmila  questions Jagan over supporting BJP: పార్లమెంటులో మహిళా రిజర్వేషన్లు , డీలిమిటేషన్ బిల్లుల చుట్టూ సాగుతున్న రాజకీయ రగడ ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఈ క్రమంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సోషల్ మీడియాలో ఘాటు ట్వీట్ పోస్టు చేశారు.  పార్లమెంటులో కీలకమైన బిల్లులపై ఓటింగ్ సందర్భంగా వైసీపీ వైఖరిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. విపక్షం ముసుగులో ఉన్న జగన్ మోహన్ రెడ్డి, అసలు సిసలు ఆర్ఎస్ఎస్ పక్షపాతి అని ఈ ఓటింగ్ ద్వారా తేటతెల్లమైందని విమర్శించింది. టీడీపీ, జనసేనల కంటే ఎక్కువగా మోదీని మోయాల్సిన అవసరం జగన్‌కు ఏముందని ప్రశ్నించిన కాంగ్రెస్, రాజ్యాంగ పరిరక్షణ కంటే బీజేపీ భజనే వైసీపీకి ముఖ్యమైపోయిందని ఆరోపించింది. అక్రమ డీలిమిటేషన్ బిల్లులకు మద్దతు పలికినందుకు జగన్ సిగ్గుపడాలని, తన ఐదేళ్ల పాలనలోని అవినీతి కేసుల నుంచి రక్షణ కోసమే ఆయన బీజేపీకి బానిసగా మారారని ఎద్దేవా చేసింది. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సిద్ధాంతాలను జగన్ మంటగలిపారని, ఆయన వారసత్వం గురించి మాట్లాడే నైతిక హక్కును కోల్పోయారని కాంగ్రెస్ చీఫ్ మండిపడ్డారు. రాజ్యాంగానికి విఘాతం కలిగించే బిల్లులను విపక్షాలన్నీ ఏకమై అడ్డుకుంటే.. జగన్ మాత్రం గొర్రెలా గుడ్డిగా తలాడించడాన్ని ఆ పార్టీ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. దక్షిణాది రాష్ట్రాల భావోద్వేగాలను, ప్రయోజనాలను అర్థం చేసుకోకుండా, సొంత రాష్ట్ర ప్రజల గుండెలను గాయపరుస్తూ బీజేపీకి జై కొట్టడం ప్రపంచంలో ఎక్కడా లేని వింత అని, జగన్ చేసిన ఈ  నీచపు పని కి వైఎస్సార్ ఆత్మ ఘోషిస్తుందని షర్మిల  ఆవేదన వ్యక్తం చేసింది. మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం జగన్ అవివేకానికి నిదర్శనమని  షర్మిల అన్నారు.  మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని ఎవరూ వ్యతిరేకించడం లేదని, అసలు ఈ బిల్లు 2023లోనే ఆమోదం పొందిందని గుర్తు చేశారు.  కేవలం మోదీ రాజకీయ లబ్ధి కోసం అక్రమంగా తెచ్చిన డీలిమిటేషన్ అంశాన్ని మాత్రమే విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని, అది కూడా తెలియకుండా జగన్ మాట్లాడటం హాస్యాస్పదమని.. 2026 జనాభా లెక్కలు రాకుండా, కులగణన ద్వారా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల సంఖ్య తేలకుండా సీట్లు పెంచడం దేశాన్ని మోసం చేయడమేనని స్పష్టం చేశారు.   

Continues below advertisement

 ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ అంటే చంద్రబాబు, జగన్, పవన్ కల్యాణ్ అని.. ఈ ముగ్గురూ మోదీ మెప్పు కోసం పాకులాడే వారేనని షర్మిల విమర్శించారు. రాష్ట్రంలో నిజమైన ప్రతిపక్షం ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని, ప్రజల పక్షాన నిలబడి పోరాడేది తామేనన్నారు.  వెనుకబడిన కులాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలన్నా, చిన్న రాష్ట్రాల వాదనలను పరిగణనలోకి తీసుకోవాలన్నా కాంగ్రెస్ స్టాండ్ చాలా స్పష్టంగా ఉందని, కానీ జగన్ తన స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని అన్నారు.  షర్మిల ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

Continues below advertisement