Delimitation Meeting In Chennai | డీలిమిటేషన్ ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాలది రాజకీయం కాదని, ప్రజల హక్కుల కోసం చేసే పోరాటం అని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) అన్నారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల సీట్లను విభజిస్తే కనుక దక్షిణాదికి జరిగేది తీరని నష్టమే. ఉత్తరాది రాష్ట్రాల ప్రాబల్యం మరింతగా పెరిగి.. దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యతతో ఏ పనిలేకుండా పోతుందన్నారు. చెన్నైలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (Stalin) ఆధ్వర్యంలో ఎన్డీయేతర విపక్షాల సమావేశం జరుగుతోంది. ఈ కీలక సదస్సుకు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళతో పాటు పంజాబ్, ఒడిశా రాష్ట్రాల విపక్ష నేతలు హాజరై దక్షిణాదికి జరగబోయే అన్యాయంపై చర్చిస్తున్నారు. ఈ క్రమంలో డిలిమిటేషన్‌పై వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. 


యూపీ సీట్లకు దక్షిణాది 4 రాష్ట్రాల సీట్లు సమానం..


‘అప్పుడు సొమ్ము సౌత్ ది..సోకు నార్త్ ది అనే పరిస్థితి ఎదురుకాక తప్పదు. కనుక డీలిమిటేషన్ పేరుతో లిమిటేషన్ ఫర్ సౌత్‌లా చేస్తామంటే ఊరుకునేది లేదు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజనను  అంగీకరించం. కేంద్ర ప్రభుత్వ ప్రస్తుత విధానంతో ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే 143 సీట్లకు పెరిగితే... దక్షిణాదిలోని తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణ లాంటి ప్రధాన రాష్ట్రాల్లో పెరిగే సీట్లు 49+41+54 = 144 అవుతాయి. ఇది కాదా వివక్ష చూపడం అంటే ? యూపీ, బీహార్ రెండు రాష్ట్రాలు కలిపితే ఏకంగా 222 సీట్లు పెరిగితే.. దక్షిణాది రాష్ట్రాల్లో మొత్తం తిప్పి కొట్టినా 192 సీట్లకే పరిమితం అవుతాం. దక్షిణ భారతదేశానికి  జరిగే అన్యాయం ఇదేనని’ షర్మిల పేర్కొన్నారు.


రాజకీయాలు పక్కన పెట్టాలన్న షర్మిల


డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాల పోరాటానికి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఐక్యంగా పోరాటం చేస్తే తప్పా నియంత ప్రధాని నరేంద్ర మోడీకి బుద్ధి రాదని షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మోదీ ఎన్డీయే పక్షం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)  మౌనం వహించడం రాష్ట్ర ప్రజలను మోసం చేసినట్లే అన్నారు. ఇది ప్రజల హక్కులను ప్రభుత్వం కాలరాసినట్లేనని.. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి (YS Jagan)  సైతం నోరు విప్పకపోవడం మోదీకి పరోక్ష మద్దతు తెలిపినట్లే అన్నారు. డీలిమిటేషన్ పై రాజకీయాలు పక్కన పెట్టీ  టీడీపీ, YSRCParty వైసీపీ,  జనసేన పార్టీ (JanaSena Party)లు ముందుకు రావాలని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల పిలుపునిచ్చారు. ఇది రాజకీయాలు చేసే సమయం కాదని, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం పోరాడే సమయం ఆసన్నమైందన్నారు.