Aqua Farmers Crisis Andhra Pradesh:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత కీలకమైన ఆక్వా రంగం ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బుధవారం  నిర్వహించిన ఆక్వా రైతుల సదస్సు, ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయి నుంచి తరలివచ్చిన వందలాది మంది ఆక్వా రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ దేశానికే భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని తెచ్చిపెడుతున్న ఆక్వా రంగాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిందని విమర్శించారు.

Continues below advertisement

ప్రస్తుతం ఆక్వా రైతాంగం తీవ్రమైన సుడిగుండంలో కూరుకుపోయిందని, దీనికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మండిపడ్డారు. ముఖ్యంగా ఫీడ్  ధరలను కంపెనీలు ఇష్టానుసారంగా పెంచుకుంటూ పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఏకపక్షంగా ధరలు పెంచవద్దని గతంలోనే అనేకసార్లు హెచ్చరించాం. కానీ ప్రస్తుత పాలకుల తీరు చూస్తుంటే దున్నపోతు మీద వర్షం పడినట్లుగా ఉంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాలకుల అండదండలతో ఏర్పడిన ఒక పెద్ద సిండికేట్ వల్లే మార్కెట్లో ఆక్వా రైతులు నిలువునా నష్టపోతున్నారని, శ్రమ ఒకరిదైతే లాభాలు మరొకరు దోచుకుంటున్నారని ఆరోపించారు.

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఆక్వా రంగాన్ని కాపాడేందుకు తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలను జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. క్వాలిటీ సీడ్, ఫీడ్ నిర్ధారించడంతో పాటు రైతుల ప్రయోజనాలను రక్షించేందుకు ప్రత్యేకంగా ఆక్వా రెగ్యులేటరీ బోర్డు ను ఏర్పాటు చేశామన్నారు. ఫీడ్ రేట్లు, రొయ్యలు-చేపల కొనుగోలు ధరల విషయంలో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ రైతులకు అండగా నిలిచామని చెప్పారు. కానీ, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే ఆ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని, బోర్డును ఉత్సవ విగ్రహంగా మార్చేశారని విమర్శించారు.

Continues below advertisement

కేవలం గత నాలుగు నెలల కాలంలోనే ఆక్వా ఫీడ్‌పై కేజీకి ఏకంగా రూ.14 నుంచి రూ.16 వరకు పెంచేశారని జగన్ గణాంకాలతో సహా వివరించారు. ఆక్వా సాగులో మొత్తం పెట్టుబడి వ్యయంలో 60 శాతం కేవలం ఫీడ్‌కే ఖర్చు అవుతుందని, అలాంటిది మేత ధరలతో పాటు మినరల్ మిక్సర్ రేట్లు కూడా విపరీతంగా పెరగడం వల్ల రైతులు కోలుకోలేని దెబ్బతింటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో రొయ్యల ధరలు తగ్గినప్పుడు ఇక్కడ కొనుగోలు ధరలు తగ్గించే కంపెనీలు.. మరి మేత ధరలు తగ్గినప్పుడు ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్నించారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో ఇలాంటి పరిస్థితి వస్తే కంపెనీలపై ఒత్తిడి తెచ్చి మరీ రేట్లు తగ్గించామని గుర్తు చేశారు.

 కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఆక్వా రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని జగన్ విమర్శించారు. గతంలో తమ ప్రభుత్వం యూనిట్ విద్యుత్‌ను రూ.1.50లకే అందించి ఐదేళ్లలో రూ.3,306 కోట్ల సబ్సిడీ భారాన్ని భరించిందని, చంద్రబాబు వదిలేసిన రూ.401 కోట్ల పాత బకాయిలను కూడా తామే చెల్లించామని చెప్పారు. కానీ నేడు సబ్సిడీ కరెంట్ ఇవ్వకపోగా కొత్త కనెక్షన్లు కూడా ఇవ్వడం లేదన్నారు. ఆక్వా రైతుల పక్షాన వైఎస్సార్‌సీపీ నిరంతరం పోరాడుతుందని, ప్రభుత్వం తక్షణమే స్పందించి ఫీడ్ ధరలను అదుపు చేయడంతో పాటు రైతులకు గిట్టుబాటు ధర దక్కేలా చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.'