Weather Updates: భానుడి ప్రతాపంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు తేలిక పాటి వర్షాలతో కాస్త ఉపశమనం పొందుతున్నారు. ఏపీ, తెలంగాణలో కొన్ని జిల్లాల్లో స్వల్ప వర్షాలు కురియనున్నాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దాని ప్రభావంతో ఇతర జిల్లాల్లో భారీ ఉష్ణోగ్రతలు కొద్దిమేర దిగిరానున్నాయి. విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో అక్కడక్కడ కొన్ని వర్షాలు నమోదవుతాయి. ముఖ్యంగా పాడేరు పరిసర ప్రాంతాల్లో ఇలాంటి వాతావరణం ఉంది. వర్షాలు, మరోవైపు ఎండల తీవ్రత నేపథ్యంలో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్, మరికొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది.


ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో.. (Temperature in Andhra Pradesh)
ఏపీలోని ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో వాతావరణంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం,  ఉభయ గోదావరి జిల్లాల్లో ఎండల నుంచి ప్రజలకు కాస్త ఊరట లభించనుంది. మరో రెండు రోజులపాటు ఈ ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. మండు వేసవిలో మధ్యాహ్నం వేళ కొన్నిచోట్ల వర్షాలు పడతాయి. ఇలానే మరో వారం పాటు వాతావరణం కొనసాగనుంది. అత్యధికంగా నందిగామలో 36.8 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదు కాగా, కావలిలో 36 డిగ్రీలు, నెల్లూరులోనూ 35.5 డిగ్రీలు, విశాఖలో 35.2 డిగ్రీలు, జంగమేశ్వరపురంలో 36.2 డిగ్రీల మేర ఉష్ణోగ్రలు ఉన్నాయి.


దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ.. 
రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో భానుడి ప్రతాపంతో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. వడగాల్పుల వల్ల ఉమ్మడి చిత్తూరు, కడప​, కర్నూలు, అనంతపురం జిల్లాలో 40 నుంచి 44 డిగ్రీల దాక ఎండల తీవ్రత ఉంటుంది. మధ్యాహ్నం వేళ అవసరమైతే తప్ప దక్షిణ కోస్తాంధ్ర, సీమ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచించారు. అనంతపురంలో 41.4 డిగ్రీలు, కర్నూలులో 40.2 డిగ్రీలు, కడపలో 39.8 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.






తెలంగాణ వెదర్ అప్‌డేట్స్.. (Telangana Temperature Today)
తెలంగాణలో కొన్ని జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర పేర్కొంది. నిర్మల్, జగిత్యాల, కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ నగర్, సూర్యపేట, జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. పెద్దపల్లి, నిజామాబాద్, సిరిసిల్ల రాజన్న, జయశంకర్ భూపాళపల్లి, ములులు, జనగామ, కరీంనగర్, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్‌లో 41.2 డిగ్రీలు, నల్గొండలో 41.5 డిగ్రీలు, నిజామాబాద్‌లో 40.1 డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ కేంద్రం తెలిపింది. 


Also Read: Perni Nani: ఏపీలో మరో కొత్త జిల్లా ఏర్పాటు? పేర్ని నాని కీలక వ్యాఖ్యలు, ఈ ప్రాంతాలతోనేనట!


Also Read: Drugs Case: హైదరాబాద్‌ డ్రగ్స్‌ సరఫరాలో కింగ్‌ పిన్‌ అరెస్టు - లక్ష్మీపతిని అదుపులోకి తీసుకున్న నార్కోటిక్ వింగ్