Weather Latest News: నైరుతి రుతుపవనాలు విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉన్న ఉపరితల అల్పపీడన ద్రోణి దక్షిణ ఛత్తీస్ గఢ్ నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకు సముద్ర మట్టానికి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం సైతం ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.


ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఇలా..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చాలా భాగాల్లో ప్రస్తుతం ఆకాశం మేఘావృతమై ఉంది. అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మరో మూడు రోజులు ఇక్కడ తేలికపాటి వర్షం పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని ఉరుములు మెరుపులు కూడా రావచ్చని అధికారులు అంచనా వేశారు.










నెల్లూరు జిల్లా ఉత్తర భాగాల్లో వర్షాలు కురిశాయని, అవి నేరుగా ప్రకాశం జిల్లా దక్షిణ భాగాలకు ముఖ్యంగా చిమకుర్తి, కనిగిరితో పాటుగా తూర్పు భాగాలైన కందుకూరు - ఒంగోలు బెల్ట్, చీరాలలో వర్షాలు పెరగనున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ వెల్లడించారు. అర్ధరాత్రి దాటాక బాపట్ల జిల్లాలో వర్షాలు పడనున్నాయని అంచనా వేశారు.


Telangana Weather News: తెలంగాణ వాతావరణం ఇలా
‘‘తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ నేడు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది’’ అని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు.