ఏపీ, యానాం మీదుగా ఉత్తర, ఈశాన్య దిశల నుంచి దిగువ ట్రోపోస్ఫెరిక్ స్థాయిలో గాలులు వీస్తున్నట్లుగా అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం ఈశాన్య రుతుపవనాల ప్రభావం వల్ల కేరళ, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, తమిళనాడు, కరైకాల్, రాయలసీమ, దక్షిణా కోస్తాలోని కొన్ని చోట్ల నేటి నుంచి స్వల్పంగా చలి తగ్గే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేశారు.


నేడు పొడిగాల ప్రభావంతో చలి తగ్గనుంది. సముద్రంలోని తేమ గాలులు కోస్తా తీరం వెంబడి రావడం వల్ల కాస్త వెచ్చదనం ఉంటుందని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. తెలంగాణ, రాయలసీమల్లో చలి తీవ్రత తీవ్రంగానే ఉంటుందని తెలిపారు.


‘‘విశాఖ నగరంలో చలి గత నాలుగు రోజులతో పోలిస్తే కొంచెం తగ్గింది. విశాఖ నగరంతో పాటుగా నగర పరిసర ప్రాంతాల్లో అన్ని చోట్లల్లో ప్రస్తుతం 20 డిగ్రీల సెల్సియస్ కి పైగానే ఉష్ణోగ్రతలు ఉన్నాయి, ఒక్క కైలాసగిరి తప్ప​. చిన్న వాల్టేరు - 22.1 C, గాజువాక - 22 C, అనకాపల్లి - 21.9 C, కైలాసగిరి - 18.4 C ఈ ఉష్ణోగ్రతలు రానున్న రోజుల్లో ఇంకా పెరగనున్నాయి కాబట్టి తీవ్రమైన చలి నగరంలో జనవరి 13 నుంచి ఉండే అవకాశాలు లేవు’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.


ఉత్తరాదిన కూడా అదే పరిస్థితి
మరోవైపు, దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో చలిగాలులు పెరిగాయి. రాజధాని ఢిల్లీతో పాటు హరియాణా, చండీఘడ్, అమృతసర్ ప్రాంతాల్లో సోమవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు దట్టమైన పొగమంచు కమ్ముకుంటుందని భారత వాతావరణ విభాగం హెచ్చరిక చేసింది. ఢిల్లీలో గురువారం ఉదయం కనిష్ఠ ఉష్ణోగ్రత 4 డిగ్రీల సెల్షియస్ అని నమోదు అయింది.


పంజాబ్, హరియాణా - చండీగఢ్ - ఢిల్లీ, ఉత్తర రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో చలి గాలులు తీవ్రంగా ఉన్నాయి. రాబోయే రెండు రోజుల్లో రాజస్థాన్ లోని సౌరాష్ట్ర, కచ్ మీదుగా చలిగాలుల పరిస్థితులు కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.


తెలంగాణ వాతావరణం
తెలంగాణ వ్యాప్తంగా పొడి వాతావరణమే ఉంటుంది. కానీ, అక్కడక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.  ఆదిలాబాద్, కుమురం భీం, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేయగా, మిగిలిన జిల్లాల్లో చలి సాధారణంగానే ఉండనుంది. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో చలి గాలులు కూడా పెరుగుతాయని వాతావరణ అధికారులు తెలిపారు. కేవలం దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో మాత్రం ఎలాంటి హెచ్చరికలు చేయలేదు.


హైదరాబాద్ లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీలు, 15 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఈశాన్య దిశ నుంచి గాలులు గాలి వేగం గంటకు 4 నుంచి 6 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న 31.1 డిగ్రీలు, 14.9 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


హైపోథర్మియాతో జాగ్రత్త
విపరీతమైన చలిలో బయటకు వెళ్లే వారు ఎవరైనా అల్ప ఉష్ణస్థితికి (హైపోథర్మియా) గురయ్యే ప్రమాదం ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత హానికర స్థాయికి పడిపోయే పరిస్థితినే హైపోథర్మియా అంటారు.