BJP Vishnu :   అమిత్‌షాతో జూనియర్‌ ఎన్‌టీఆర్‌ సమావేశం కావడాన్ని వైఎస్ఆర్‌సీపీ విమర్శిస్తే  ఆయనకు 18 కోట్ల భాజపా సభ్యులు అండగా ఉంటారని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.  రాజకీయాలతో సంబంధం లేని జూనియర్‌ ఎన్‌టిఆర్‌ పేరు మార్పు విషయంలో చేసిన ట్వీట్‌లో ఏం తప్పుందని ఆయన ప్రశ్నించారు. ఏపీ బీజేపీ నిర్వహిస్తున్న ప్రజాపోరు సభల్లో పాల్గొనేందుకు విస్తృతంగా పర్యటిస్తున్న ఆయన విజయనగరంలో మీడియాతో మాట్లాడారు.  నాడు  పోలవరం పేరు , నేడు యూనివర్సిటీ ల పేర్లను పెట్టుకుంటూ, మార్చుకుంటూ వివాదాలకు కారణం అవుతున్నారని ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.  ప్రజలు నేటి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యలు గమనిస్తున్నారుని గుర్తు చేశారు. 


ఎన్టీఆర్, వైఎస్ఆర్ పథకాలకు తమ పేర్లు పెట్టుకోలేదు !


ఎన్‌టిఆర్‌, వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఏ పథకాలకు తమ పేర్లు పెట్టుకోలేదని.. కాంగ్రెస్‌ ఎన్నో ప్రభుత్వ సంస్థలకు పేర్లు పెట్టుకుంటే భాజపా ఏనాడూ పేర్లు మార్చలేదని విష్ణువర్దన్ రెడ్డి గుర్తు చేశారు.  ప్రజలను ఊచకోత కోసిన ఔరంగజేబు పేరును ఢల్లీిలో మార్చి దానికి అబ్దుల్‌ కలాం పేరు పెట్టామని.. కాంగ్రెస్‌ పార్టీ పట్టించుకోకుంటే మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, సర్ధార్‌ వల్లభాయ్‌పటేల్‌లకు గౌరవం కల్పించి స్మారక చిహ్మాలు నిర్మించామన్నారు.  విశాఖ కింగ్‌జార్జి ఆసుపత్రి పేరు మార్చాలి... గుంటూరు జిల్లా  టవర్‌ సెంటర్‌ పేరు మార్చి దేశభక్తుల పేర్లు పెట్టాలని డిమాండ్ల చేశారు. 


మంత్రులకు మానసిక చికిత్స అందించాలి !


రాష్ట్ర మంత్రులు నోరుజారి, ప్రజలను భయభ్రాంతులను చేస్తూ ాఅదుపు తప్పి, సిగ్గులేకుండా పిచ్చిపట్టిన వారి వలే మాట్లాడుతున్నారని విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఉపముఖ్య మంత్రి తమను ప్రశ్నిస్తే సంక్షేమ పథకాలు ఆపుతామంటారు. సిదిరి అప్పలరాజు ఓట్ల కోసం కాళ్లు పట్టుకుంటామంటారు... బొత్స సత్సనారాయణ పాదయాత్రను 5 నిమిషాల్లో ఆపేస్తానంటున్నారు. అంబటి రాంబాబు అడ్డగోలుగా ఎదుటివారిని దూషిస్తున్నారు. ఎదుటివారిని బూతులు తిట్టడం అర్హతగా భావిస్తున్నారా? .. ఇలాంటి వారినందర్నీ ముఖ్యమంత్రి అదుపులో పెట్టాలన్నారు. వారికి మానసిక వైద్య చికిత్స అందించాలని విష్ణువర్దన్ రెడ్డి సెటైర్లు వేశారు.  ప్రజలు కట్టే పన్నులతో సకల సౌకర్యాలు, పదవులూ అనుభవిస్తూ, వారినే దూషిస్తారా? అని విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. 


రుణయాప్‌ల కట్టడికి ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించాలి !


మంత్రుల విషయంలో సిఎం ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.  ఎపీలో రుణ యాప్‌ల వత్తిడి కారణంలో 26 మంది నిర్భాగ్యులు ప్రాణాలు కోల్పోయారు. విద్యార్థులు, అల్పాదాయాల వారు రుణయాప్‌ల ఉచ్చులో పడి అవసరాల నిమిత్తం రుణాలు తీసుకుని వారి వత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.  ఈ విషయంలో విచారణ చేపట్టి నేరస్తులను చట్టప్రకారం శిక్షించాలని..  తక్షణం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించి యాప్‌లను అదుపు చేయడానికి నూతన ఐటీ చట్టం చేయాలని డిమాండ్ చేశారు.  దసరా పండుగ సందర్భంగా ఆలయాల్లో రూ.300, రూ.500  ప్రత్యేక దర్శన టిక్కెట్ల పేరుతో చేస్తున్న  దోపిడిని ఆపాలన్నారు. కోర్సులు పూర్తయిన వారికి జగనన్న విద్యా, వసతి దీవెన పథకాల ద్వారా ఫీజులు విడుదల చేయక ఆపివేయడంతో సర్టిఫికెట్లు అందక ఇబ్బందిపడుతున్నారు. కోర్సు పూర్తయిన వారికి బకాయి ఫీజులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.