Nakkapalli Bulk Drug Park: బల్క్డ్రగ్ పార్క్ అంటే ఏంటీ? నక్కపల్లితోపాటు మంజూరైన బీపీడీల స్టాటస్ ఏంటీ?
Nakkapalli Bulk Drug Park: దేశవ్యాప్తంగా మూడే మూడు బల్క్ డ్రగ్ పార్క్లు ఏర్పాటు అవుతున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్లోని నక్కపల్లిలో ఒకటి నిర్మిస్తున్నారు. ఇది వైద్యరంగంలో గేమ్ఛేంజర్గా మారబోతోంది.

Nakkapalli Bulk Drug Park: మన దేశ ఔషధ రంగ భవిష్యత్ను పూర్తిగా మార్చే సత్తా ఉన్న మెగా ప్రాజెక్టు ఈ బల్క్డ్రగ్ పార్క్. కరోనా సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కేంద్రం వైద్యరంగంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. కోవిడ్ టైంలో అసలు మాస్క్లను కూడా భారీగా ఉత్పత్తి చేయలేని మన వైద్యరంగం ఉండేది. భవిష్యత్లో వైద్యపరంగా ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు కేంద్రం ప్రత్యేక ప్రణాళికలు రచించింది. అందులో భాగంగా దేశంలో అతి పెద్ద బల్క్డ్రగ్ పార్క్లను ఏర్పాటు చేయాలని భావించింది. దీని కోసం దేశంలోని అనేక రాష్ట్రాలు పోటీ పడ్డాయి. కానీ మూడు రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు నచ్చిన కేంద్రం వారికి ఆ అవకాశం కల్పించింది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లో ఈ డ్రగ్పార్క్లు ఏర్పాటుకు అంగీకరించింది. ఏడాదిన్నర లోపు ఈ డ్రగ్ పార్క్ మొదటి విడత ప్రారంభించాలనే లక్ష్యంతో పనులు ప్రారంభించారు. కానీ ఆంధ్రప్రదేశ్లో అనేక అవాంతరాలు కారణంగా ఇప్పటి అనుకున్న లక్ష్యం చేరుకోలేకపోయింది. ఈ ప్రాజెక్టు చేజారిపోకుండా వచ్చే మార్చి నాటికి మొదటి విడత పూర్తి చేస్తామని ప్రభుత్వం ఫైనల్ గడువు ఇచ్చి పనులు చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన బల్క్ డ్రగ్స్ పార్క్ను విశాఖపట్నం సమీపంలోని నక్కపల్లి వద్ద ఏర్పాటుకు ప్రభుత్వాలు అంగీకరించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో దీన్ని దాదాపు 2000 ఎకరాల విస్తీర్ణంలో 1876 కోట్ల తో దీన్ని నిర్మించనున్నారు. ఇది కేవలం ఔషధాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యానికి ఇది ప్రతిబింబం. ఈ ప్రాజెక్టు ప్రస్తుత పురోగతి, దాని ప్రత్యేక విలువ, భారతీయ ఫార్మా పటంలో నక్కపల్లిని నిలపనున్నాయి.
బల్క్ డ్రగ్ ఫార్మా అంటే ఏంటీ?
బల్క్డ్రగ్ పార్క్ అంటే చాలా మందికి ఒక పెద్ద ఫ్యాక్టరీ లేదా ఫార్మా సిటీలా అనిపిస్తుంది. కానీ దాని ప్రాముఖ్యత అంతకు మించి ఉంటుంది. అసలు మెడిసిన్ పని చేయడానికి గల ప్రధాన కారణం అందులో ఉండే బల్క్డ్రగ్ లేదా యాక్టివ్ఫార్మస్యూటికల్ ఇంగ్రిడియంట్. ఒక టాబ్లెట్లో మందు చాలా తక్కువ మోతాదులో ఉంటుంది కానీ ఆ టాబ్లెట్ ఆకారం, రుచి, అన్ని వాతావరణాలకు తట్టుకునేలా ఉండేందుకు మరికొన్ని పదార్థాలు కలుపుతారు. ఈ బల్క్డ్రగ్స్ను పెద్ద ఫ్యాక్టరీలలో రసాయనిక చర్యల ద్వారా తయారు చేస్తారు. వాటిని శుద్ధి చేసి, నాణ్యత పరీక్షించిన తర్వాతే, మందులు తయారు చేసే కంపెనీలకు పంపిస్తారు. ఈ కంపెనీలకు ఫార్ములేషన్ ప్లాంట్స్ అంటారు. ఈ ఫార్ములేషన్ ప్లాంట్స్లో ఈ బల్క్ డ్రగ్స్ను ఇతర పదార్థాలతో కలిపి టాబ్లెట్లు, సిరప్లు క్యాప్సూల్స్గా మారుస్తారు. ఈ బల్క్ డ్రగ్స్ లేకపోతే మెడిసిన్ తయారు చేయడం అసాధ్యం. అందుకే, ఈ కీలకమైన ముడి పదార్థాల ఉత్పత్తిని ఒకే చోట కేంద్రీకృతంచేసి, అత్యాధునిక మౌలిక వసతులతో ఏర్పాటు చేసేదే బల్క్ డ్రగ్ పార్క్.
కాకినాడ నుంచి నక్కపల్లికి ఎందుకు మారింది?
నక్కపల్లిలో ఈ భారీ ప్రాజెక్టును ఇప్పుడే ఎందుకు ఏర్పాటు చేస్తున్నారనే ప్రశ్న వస్తుంది. దీనికి ప్రధాన కారణం కోవిడ్. 2019లో కరోనా మహమ్మారికి ముందు వరకు, భారతదేశం తన బల్క్ డ్రగ్ అవసరాలలో అధిక భాగాన్ని చైనా నుంచి దిగుమతి చేసుకునేది. అయితే కోవిడ్ సమయంలో చైనా నుంచి దిగుమతులు పూర్తిగా తగ్గిపోవడం, సరఫరా చైన్ తెగిపోవడం వల్ల మనం దేశం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ సంక్షోభమే తర్వాతే, మన దేశంలోనే ఎందుకు బల్క్ డ్రగ్స్ ఉత్పత్తి చేయకూడదు అనే ఆలోచనకు భారత్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పార్క్ నక్కపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో భాగం. ఇది విజయవాడ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, విశాఖపట్నం-కాకినాడ పెట్రోలియం, కెమికల్ అండ్ పెట్రోకెమికల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఉంది. రాజయ్యపేట, బుచిరాజుపేట, చందనాడ, వెంపాడు, డోనివాని లక్ష్మీపురం గ్రామాల్లో విస్తరించి ఉంది. ఈ డ్రగ్స్ పార్క్ కోసం సౌత్ ఇండియాలో చాలా రాష్ట్రాల్లో తీవ్రంగా పోటీ పడ్డాయి. మొదట్లో ఈ పార్కును కాకినాడలో ఏర్పాటు చేయాలని భావించారు. నక్కపల్లి వద్ద భూమి సిద్దంగా ఉందని అక్కడికి తరలించారు. నక్కపల్లిలో ఈ పార్క్ ఏర్పాటు చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి.
రవాణా సౌకర్యం:- నేషల్ హైవేకు 16కు కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది.
రైల్వే కనెక్టివిటీ కూడా ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎగుమతి దిగుమతులకు ఈ రైలవే లైన్ ఉపయోగపడుతుంది.
పోర్టులు కూడా దగ్గరే:- గంగవరం పోర్టుకు చాలా దగ్గరగా ఉంది. విశాఖపట్నం పోర్టుకు 70 కిలోమీటర్లు, కాకినాడ పోర్టుకు 60 కిలోమీటర్ల దూరంలో ఉండటం దీనికి ఉన్న ప్రత్యేకత. వీటి కారణంగా ఉత్పత్తులు, ముడిసరకులు రవాణా మరింత సులభం అవుతుంది.
విద్యుత్& నీటి సౌకర్యాలు:- పారిశ్రామిక అవసరాల కోసం ప్రత్యేకమైన ఇండస్ట్రీయల్ పవర్ గ్రిడ్ ఉంది. భవిష్యత్లో పునరుత్పాదక ఇంధనం వనరులను కూడా దీనికి అనుసంధానం చేస్తారు. రసాయన పరిశ్రమలకు అత్యవసరమైన నీటి సరఫరా కోసం ఏలూరు కాలువ ఉండనే ఉంది.
ఫార్మా ఎకో సిస్టమ్:- ఈ ప్రాంతానికి సమీపంలోనే ఉన్న హెటెరో దివిస్ ల్యాబ్స్, లాల్స్ ల్యాబ్స్ వంటి ప్రముఖ ఫార్మా కంపెనీలు ఇప్పటికే ఉన్నాయి. ఇవి ఈ బల్క్ డ్రగ్స్ పార్క్లో కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు.
బల్క్ ప్రాజెక్టు అంచనా ఎంతా
నక్కపల్లి ప్రాజెక్ట్ ఖర్చు ₹1,876.66 కోట్లుగా అంచనాలు వేస్తున్నారు. జనవరి 2024లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ₹1000 కోట్ల గ్రాంట్ అందిస్తోంది, మార్చి 2023లో మొదటి ఇన్స్టాల్మెంట్ ₹225 కోట్లు విడుదల కూడా చేసింది. ఈ బీపీడీ మూడు ప్యాకేజీలుగా విభజించారు. వాటికి టెండర్లు పిలిచారు. వర్క్ నడుస్తున్నాయి. ప్యాకేజీ 1లో రోడ్లు, డ్రైన్లు, సరిహద్దు గోడలు, గ్రీన్ ఏరియా డెవలప్మెంట్, నీటి సరఫరా, రీసైకిల్ వాటర్ సరఫరా, వేస్ట్ వాటర్ సిస్టమ్, పవర్ సప్లై, ఎమర్జెన్సీ, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్, సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్, ట్రక్ టెర్మినల్స్, మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వంటి పనులు ఉంటాయి. ప్యాకేజీ 2లో కామన్ ఎఫ్లియెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్, మోరిన్ అవుట్ఫాల్ సిస్టమ్ ఈ పనులు వ్యర్థ జలాలు శుద్ధి చేసి పర్యావరణానికి హాని కలగకుండా చూస్తారు. ప్యాకేజీ 3లో స్టీమ్ జనరేషన్, డిస్ట్రిబ్యూషన్, కామన్ సాల్వెంట్ రికవరీ సిస్టమ్ పనులు పూర్తి చేస్తారు.
శరవేగంగా పనులు
ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎనహెచ్ 16 నుంచి ఎన్ఐఏకు 4.5 కిలోమీటర్ల గ్రీన్ఫీల్డ్ రోడ్ నిర్మాణాన్ని ప్రారంభించింది. పార్క్ కోసం సేకరించిన రెండు వేల ఎకరాల భూమి మొత్తం ఏపీఐఐసీ ఆధీనంలో ఉంది. భవిష్యత్ విస్తరణ కోసం అదనంగా 723.2 ఎకరాలు కేటాయించారు. ఇందులో పరిశ్రమలకు 1900 ఎకరాలను కేటాయిస్తారు. సౌకర్యాల కోసం 70 ఎకరాలు ఇస్తారు. పార్కింగ్, లాజిస్టిక్ అవసరాల కోసం 120 ఎకరాలు, మిగిలిన భూమిని యుటిలిటీలు, ఓపెన్ స్పేస్, వాటర్ బాడీ, గ్రీన్ బెల్ట్, రోడ్ల కోసం కేటాయిస్తారు. మొత్తం సేకరించిన భూమిలో కేవలం 57.90 శాతం విక్రయించడానికి వీలుగా ఉంటే మిగిలిన ప్రాంతాన్ని యుటిలీలు, ఓపెన్ స్పేస్, రోడ్లకు కేటాయిస్తారు.
బల్క్ డ్రగ్ ఉత్పత్తి ఖర్చులు తగ్గించి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు అందించి ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులను ఆకర్షించడం దీని ముఖ్య ఉద్దేశం. ఇక్కడ పెట్టుబడిదారులు కోర్ ఉత్పత్తిపై దృష్టి పెడతారు. ఇది పెట్టుబడి, ఆపరేటింగ్ ఖర్చును 15-20 శాతం వరకు తగ్గిస్తుంది. అంతే కాకుండా 2033-34 నాటికి 27 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తుంది.
హిమాచల్ ప్రదేశ్లోని ప్రాజెక్టు స్టాటస్ ఏంటీ?
హిమాచల్ ప్రదేశ్ ఉనా జిల్లాలోని హరోలీలో ప్రమోషన్ ఆఫ్ బల్క్ డ్రగ్ పార్క్ స్కీమ్లో భాగంగా బీడీపీ ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని 1400 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నారు. దీని కోసం 2071 కోట్లు ఖర్చు పెట్టనున్నారు. ఇందులో వెయ్యికోట్లు కేంద్రం ఇస్తోంది. మిగతాది రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది. దీనికి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వచ్చేసింది. ఈ ఏడాది జనవరిలోనే ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ కూడా సమీక్ష నిర్వహించి ఆగస్టులో సీఈటీపీ నిర్మాణానికి టెండర్లు కూడా ఆహ్వానించారు. ముంబైలో జులైలో జరిగిన ఇన్వెస్టర్ల సమావేశంలో కూడా ఈ బీడీపీ గురించి ప్రచారం చేశారు. దీన్ని కూడా వచ్చే ఏడాది మార్చికి పూర్తి చేయాలని భావిస్తున్నారు.
గుజరాత్లో బల్క్ డ్రగ్ పార్క్ స్టాటస్ ఏంటీ?
గుజరాత్లోని భరూచ్ జిల్లా జంబుసర్ తాలూకాలో బల్క్ డ్రగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ కూడా దాదాపు 2000 వేల ఎకరాల్లో దీన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ పార్క్ కోసం 3920 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. ఇందులో వెయ్యి కోట్లు కేంద్రం ఇస్తోంది. ఇక్కడ ఇప్పటికే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మొదటి ఫేజ్ను వచ్చే ఏడాది ప్రారంభించనున్నారు.





















