Vizag Semi-ring Road: భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
Vizag: విశాఖ నగరానికి సెమీరింగ్ రోడ్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భోగాపురం నుంచి రాంబిల్లి వరకూ దీన్ని ప్లాన్ చేస్తున్నారు.

Visakhapatnam Semi Ring Road: విశాఖపట్నం నగరాన్ని అంతర్జాతీయ స్థాయి మెట్రోపాలిటన్ హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగవంతం చేస్తోంది. హైదరాబాద్లోని ఔటర్ రింగ్ రోడ్ మోడల్ను స్ఫూర్తిగా తీసుకుని, విశాఖలో భోగాపురం నుండి రాంబిల్లి వరకు సుమారు 85 కిలోమీటర్ల మేర సెమీ రింగ్ రోడ్ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టు కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారీకి విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఇప్పటికే రూ.4.84 కోట్లు మంజూరు చేసింది.
విశాఖ రూపు రేఖలు మార్చే సెమీ రింగ్ రోడ్ ప్రాజెక్ట్
నగర రవాణా ముఖ చిత్రాన్ని మార్చే కీలకమైన విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దీనికి సంబంధించి రైట్స్ సంస్థ నిర్వహిస్తున్న సమగ్ర అధ్యయనం మరో రెండు నెలల్లో పూర్తి కానుంది. ఈ నివేదిక అందిన వెంటనే కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో పనులను వేగవంతం చేసి, మూడేళ్ల కాలపరిమితిలో మెట్రోను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి దశలో భోగాపురం ఎయిర్పోర్ట్ నుండి స్టీల్ ప్లాంట్ వరకు దాదాపు 77 కిలోమీటర్ల మేర మూడు కారిడార్లలో మెట్రో రైలు పరుగులు తీయనుంది.
సిక్స్ లేన్ బీచ్ కారిడార్ పనులు కూడా వేగం
మరోవైపు, విశాఖ తీర ప్రాంతాన్ని పర్యాటక , ఆర్థిక కేంద్రంగా మార్చేందుకు సిక్స్-లేన్ బీచ్ కారిడార్ పనులు ఊపందుకుంటున్నాయి. దాదాపు రూ.6,300 కోట్ల వ్యయంతో కైలాసగిరి నుండి భోగాపురం విమానాశ్రయం వరకు 55-60 కిలోమీటర్ల మేర ఈ తీరప్రాంత రహదారి నిర్మించనున్నారు. ఇది అందుబాటులోకి వస్తే నగరం నుండి ఎయిర్పోర్ట్కు ప్రయాణ సమయం 40-45 నిమిషాలకు తగ్గుతుంది. అంతేకాకుండా, భోగాపురం విమానాశ్రయానికి అనుసంధానంగా నిర్మిస్తున్న 7 మాస్టర్ ప్లాన్ రోడ్లను మే 2026 నాటికి పూర్తి చేయాలని అధికారులు గడువు విధించుకున్నారు.
మరిన్నిపెట్టుబడులు ఆకర్షించేలా మౌలిక సదుపాయాల కల్పన
మున్సిపల్ పరిపాలన , పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ సమీక్షలో పట్టణ స్థానిక సంస్థల సామర్థ్యాన్ని పెంచుతూ, భారీ పెట్టుబడులను ఆకర్షించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. ఈ మౌలిక సదుపాయాల కల్పన ద్వారా విశాఖ నగరం కేవలం పరిపాలనా కేంద్రంగానే కాకుండా, ఐటీ మరియు పారిశ్రామిక రంగాల్లో ప్రపంచ స్థాయి నగరాలతో పోటీ పడేలా ఎదుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు




















