విశాఖలోని తొట్లకొండ బౌద్ధ క్షేత్రానికి కొత్త అందాలు జతకూరాయి. దాదాపు 2 వేల  సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ బౌద్ధ క్షేత్రం విశాఖ నగరం కంటే చాలా పురాతనమైంది. క్రీ. పూ. 3 వ శతాబ్దంలో ఏర్పడిన ఈ బౌద్ధ క్షేత్రం చాలా ప్రత్యేకమైంది. సాధారణ బౌద్ధ క్షేత్రాలకు భిన్నంగా తొట్లకొండ చాలా పెద్దది. ధ్యాన స్తూపంతోపాటు బౌద్ధ సన్యాసుల గదులు, వారికి మంచినీటిని ఇచ్చే కొలను, ధాన్యాగారం లాంటి వాటితోపాటు బౌద్ధ సన్యాసులు అందరూ కలిసి భోజనం చెయ్యడానికి వీలుగా ఏర్పాటు చేసిన డైనింగ్ హాల్ తొట్లకొండకు ప్రత్యేకం. దాదాపు 600 సంవత్సరాలు బౌద్ధ ధర్మ వ్యాప్తికి కేంద్రంగా నిలిచింది ఈ క్షేత్రం. శ్రీలంకతోపాటు ఆగ్నేయాసియాలోని ఇతర దేశాల్లో బౌద్ధ ధర్మ విస్తరణకు తొట్లకొండలో ఉండే బౌద్ధ భిక్షువులు ఎంతో  దోహదపడ్డారు అని చరిత్రకారులు చెబుతూ ఉంటారు. అయితే క్రీ .శ . 7వ శతాబ్దం తరువాత నెమ్మదిగా ఈ తొట్లకొండ మరుగున పడిపోయింది . 

 

నేవీ అధికారులు బయటకు తెచ్చిన  తొట్ల కొండ :

 

1970లో భారత నౌకాదళం తమ స్థావర ఏర్పాటు కోసం సరైన ప్రాంతాన్ని వెతుకుతున్న సమయంలో తొట్లకొండ బౌద్దారామం బయటపడింది . దానిని 1978 లో ఆర్కియాలజీ శాఖ తమ చేతుల్లోకి తీసుకుని మరిన్ని తవ్వాకాలు జరిపి పూర్తి స్తూపాన్ని వెలుగులోనికి తెచ్చింది .

 

హుద్ హుద్ సమయంలో దెబ్బతిన్న తొట్లకొండ :

 

విశాఖ
నగరాన్ని వణికించిన హుద్ హుద్ తుఫాను ధాటికి తొట్లకొండ కూడా బాగా దెబ్బతింది . దానితో ఇక ఈ స్తూపం కాలగర్భంలో కలిసిపోక తప్పద్దని చాలామంది భావించారు. అయితే ఆర్కియాలజీయే డిపార్ట్మెంట్ దీనిని మళ్ళీ బాగుచేసి అందుబాటులోనికి తెచ్చింది .

 

విశాఖ -భీమిలి దారిలో పర్యాటక కేంద్రంగా తొట్లకొండ భౌద్ద  క్షేత్రం  :

వైజాగ్ నుంచి భీమిలి వెళ్ళే దారిలో సముద్రం ఒడ్డున కొత్త అందాలను సంతరించుకున్న తొట్లకొండ పర్యాటకులకు ఆహ్వానం పలుకుతోంది. ఇక్కడకు వచ్చే టూరిస్టుల కోసం చక్కటి షెడ్లు, మంచినీటి వసతితోపాటు ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్ సైతం ఏర్పాటు చేసారు . అలాగే తొట్లకొండలోని ప్రతీ చారిత్రక స్థలం వద్ద దానిని వివరించే బోర్డులను సైతం ఏర్పాటు చేయడం వలన ఇక్కడి విశేషాలు తెలుసుకుందామని వచ్చిన తమకు ఎంతో ఉపయోగకరంగా ఉందని పర్యాటకులు అంటున్నారు .

 

తప్పక చూడాల్సిన చారిత్రక ప్రాంతం 

 

 ఒక్కసారి అడుగుపెడితే చాలు ప్రశాంత వాతావారణంలో రెండువేల ఏళ్ల చరిత్రను మన ముందుకు తెచ్చే తొట్లకొండను విశాఖ సందర్శించే ప్రతీ ఒక్కరూ తప్పక చూడాల్సిందే.