Srikakulam Temple Stampede: కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట ఘటనపై పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం
Pawan Kalyan on Srikakulam Stampede | కాశీబుగ్గలోని ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన వారి కుటుంబాలను, గాయపడినవారిని పరామర్శించేందుకు జనసేన ఎమ్మెల్యేలు వెళ్లనున్నారు.

Srikakulam Kasibugga Temple Stampede | కాశీబుగ్గ: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలను, క్షతగాత్రులను పరామర్శించేందుకు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేలను, పార్టీ నాయకులను ఘటనా స్థలికి వెళ్లాలని పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేశారు.
తొక్కిసలాటకు కారణాలపై జనసేన క్షేత్రస్థాయిలో పరిశీలన
ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, నిమ్మక జయకృష్ణ, లోకం నాగ మాధవిలను కాశీబుగ్గ ఘటన మృతుల కుటుంబాలను పరామర్పించి ఓదార్చాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ ఘటనకు గల కారణాలను పరిశీలించి పవన్ కళ్యాణ్ కు పార్టీ నుంచి ఎమ్మెల్యేలు నివేదిక అందిస్తారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పార్టీ నేత పిసిని చంద్రమోహన్, కొరికాన రవికుమార్, డా. దానేటి శ్రీధర్, గేదెల చైతన్య తదితరులు కాశీబుగ్గ ప్రాంతానికి వెళ్ళి బాధితులకు అవసరమైన సేవలు అందిస్తున్నారని జనసేన అధ్యక్షుడి రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు.
కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట విషాదకరం
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలచివేసిందన్నారు పవన్ కళ్యాణ్. కార్తీక ఏకాదశి సందర్భంగా ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్న క్రమంలో తొక్కిసలాట మూలంగా 9 మంది మృతిచెందారని తెలిసి ఆవేదన లోనయ్యారు. ఈ ఘటనలో మృతి చెందినవారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా అధికార యంత్రాంగానికి కూటమి ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. బాధిత కుటుంబాలను ఏపీ ప్రభుత్వం ఆదుకొంటుందన్నారు.
శ్రీకాకుళం జిల్లా, పలాస - కాశీబుగ్గ పట్టణం లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఏకాదశి సందర్భంగా స్వామివారి దర్శనానికి వేలాదిగా భక్తులు పోటెత్తడంతో జరిగిన తొక్కిసలాటలో 9 మంది భక్తులు మరణించడం అత్యంత దురదృష్టకరం. వారిలో చిన్నారి కూడా ఉండటం తీవ్రంగా కలచివేసింది. ఈ ఘటనలో గాయపడిన…
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) November 1, 2025
ప్రైవేట్ వ్యక్తుల నిర్వహణలో ఉన్న కాశీబుగ్గ ఆలయంలో చోటు చేసుకున్న విషాదకర ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపడుతుంది. కార్తీక మాసంలో రాష్ట్రంలోని శైవ క్షేత్రాలతోపాటు, ప్రముఖ ఆలయాలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందన్నారు. క్యూ లైన్ల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని దేవాదాయ శాఖ అధికారులకు సూచించారు. ముఖ్యంగా మహిళలు, చిన్న పిల్లలు, వృద్ధులకు ఆలయాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఆలయ ప్రాంగణాల్లో తగిన రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనా వేసినప్పుడు పోలీసు బందోబస్తుతోపాటు, మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయాలన్నారు.






















