పారాచూట్‌ ట్రైనింగ్‌లో గాయపడి అమరుడైన నేవీ కమాండో చందక్ గోవింద్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాల మధ్య ఘనంగా సాగుతున్నాయి. గోవింద్ పార్థివదేహం ఈ ఉదయం చీపురుపల్లి మండలం పర్లకు చేరుకున్న పార్ధివదేహానికి ఆ ప్రాంత ప్రజలంతా వచ్చి నివాళి అర్పించారు.  


పశ్చిమబెంగాల్‌ నుంచి గోవింద్‌ పార్థివదేహాన్ని ముందు విశాఖలోని ఐ.ఎన్.ఎస్ కర్ణలో ఉంచారు. అక్కడ ఆర్మీ అధికారులు వచ్చి నివాళి అర్పించారు. అనంతరం స్వగ్రామానికి తరలించారు. విజయనగరం జిల్లా గరివిడి మండలం పెనుబర్తి గ్రామం నుంచి గోవింద్‌ పార్థివదేహాన్ని ర్యాలీగా తీసుకెళ్లారు. సుమారు 20 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. దారిపొడవున ప్రజలు గోవింద్ అమర్‌రహే అంటూ నినాదాలు చేశారు. భారత్‌మాత ముద్దుబిడ్డ అమర్‌రహే అంటూ స్లోగన్స్ చేశారు. 


చిన్న వయసులోనే తమను వదిలి తిరిగి రానిలోకాలకు వెళ్లిపోయావా అంటూ గోవింద్ స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. తల్లి చందక లక్ష్మిని ఓదార్చడం ఎవరి వల్లా కావడం లేదు. నిన్నటి నుంచి ఆమె పచ్చి మంచినీళ్లు కూడా తాగడం లేదు. 
కుటుంబ సభ్యులు, బంధువుల సందర్శనార్ధం భౌతికదేహాన్ని ఇంటి వద్ద ఉంచనున్నారు. అనంతరం అంతిమాయత్ర ప్రారంభం కానుంది. అనంతరం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేపట్టనున్నారు అధికారులు. 


పారాచూట్ ట్రైనింగ్‌లో జరిగిన ప్రమాదంంలో చీపురుపల్లి నేవీ ఉద్యోగి చందక గోవింద్ అమరుడయ్యారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పర్ల గ్రామానికి చెందిన నేవీ ఉద్యోగి చందక గోవింద్ విశాఖ నేవల్ బేస్‌లో ఉద్యోగం చేస్తున్నారు. పారాచూట్ విభాగంలో పశ్చిమ బెంగాల్‌లోని బంకురా జిల్లాలో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ట్రైనింగ్‌లో భాగంగా చేసిన కార్యక్రమంలో ప్రమాదం జరిగింది. 


ట్రైనింగ్‌లో భాగంగా గోవింద్ కోల్ కత్తాలో హెలికాఫ్టర్‌ నుంచి దూకి కొంత దూరం వెళ్లిన తర్వాత పారాచూట్‌ను ఓపెన్ చేయాలి. అయితే దూకేంతవరకు అంతా బాగానే ఉన్నప్పటికీ మార్గ మధ్యలో ఏం జరిగిందో తెలియదు కానీ.. పారాచూట్ తెరుచుకోలేదు. అంతే అతి వేగంగా కిందిపడిపోయారు గోవింద్‌. 


ప్రమాదానికి సంబంధించిన వీడియోను కూడా నేవీ విడుదల చేసింది. హెలికాఫ్టర్‌లో సహచరులతో హుషారుగా కనిపించారు గోవింద్. ట్రైనింగ్‌లో భాగంగా ముందు ఒక్కొక్కరు హెలికాఫ్టర్‌ నుంచి బయటకు దూకారు. రెండో దశలో వారి ఇద్దరిద్దరు కలిసి దూకి కొంత దూరం ట్రావెల్ చేసిన తర్వాత విడిపోవాలి. ఆ క్రమంలో పారాచూట్‌ ఓపెన్ చేయాలి. 


రెండోదశ ట్రైనింగ్‌ తీసుకుంటున్న టైంలోనే ప్రమాదం జరిగింది. తన సహచరుడు చేతులు పట్టుకున్న వీడియోను నేవీ విడుదల చేసింది. అలా కాసేపు ఇద్దరూ చేతులు పట్టుకొని కొంత టైం తర్వాత గోవింద్ చేతులను సహచరుడు వదిలేశారు. అలా వదలేసిన తర్వాత గోవింద్‌ పారా చూట్ సాయంతో సేప్‌ల్యాండ్ అవుతారని అంతా అనుకున్నారు. 


మార్గ మధ్యలో ఏం జరిగిందో తెలియదు కానీ.. గోవింద్‌ క్రాష్‌ ల్యాండింగ్ అయ్యారు. పారాచూట్‌ తెరుచుకోకపోవడంతో వేగంగా నేలపై పడి గాయలపాలయ్యారు. తీవ్ర గాయాలపాలైన ఆయన్ని బార్జోరా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. 


బుర్ద్వాన్‌ జిల్లాలోని పనాగడ్‌ ఎయిర్‌పోర్స్‌ స్టేషన్‌లో పారా ట్రూపర్స్ ట్రైనింగ్‌ టీంలో గోవింద్ విధులు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. పారా ట్రూపర్స్ బృందంలో సభ్యుడైన గోవింద్‌... హెలికాఫ్టర్‌ నుంచి సాధారణ డ్రాప్ సమయంలో అదృశ్యమైనట్టు ఇండియన్ నేవీ తెలిపింది. దీనిపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్టు పేర్కొంది.