Vizag Crime News :    సంచల నం సృష్టించిన విశాఖ కిడ్నీ రాకెట్‌ కేసును ఎట్టకేలకు విశాఖ పోలీసులు ఛేదించారు. కిడ్నీ మార్పిడి కేసులో ఓ డాక్టర్‌ సూత్రధారిగా వ్యవహరించారు.  పేదల ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా తీసుకుని దళారుల సాయంతో ఇద్దరు వైద్యులు ఈ కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేశారు.  నార్ల వేంకటేశ్వరరావు అనే డాక్టర్‌ కీలకంగా వ్యవహరించారు.  డాక్టర్‌ పరమేశ్వర రావుతోపాటు ఐదుగురు దళారులు కామరాజు, శ్రీను, శేఖర్‌, ఎలీనా, కొండమ్మలను పోలీసులు అరెస్ట్ చేశారు.  పెందుర్తి శ్రీ తిరుమల ఆస్పత్రిలోనే బాధితులు వినయ్‌ కుమార్‌, వాసుపల్లి శ్రీనివాస్‌ రావుకు ఆపరేషన్‌ జరిగింది.  ఈ వ్యవహారంలో కీలక సూత్రధారి నార్ల వేంకటేశ్వరరావు గతంలో శ్రద్ధ హాస్పిటల్‌లోనూ అక్రమంగా కిడ్నీ మార్పిడి చేసినట్లుగా పోలీసులు గుర్తించారు.   ఈ కేసులో మరింత మందిని అరెస్టు చేసే అవకాశముంది. 
 
ఇస్తానన్న డబ్బులు ఇవ్వకపోవడంతో మోసం వెలుగులోకి ! 


పెందుర్తి వాంబే కాలనీకి చెందిన జి వినయ్  కుమార్‌కు కిడ్నీ దానం చేస్తే రూ.8.50 లక్షలు ఇస్తామని కొందరు ఆశ చూపారు. దానికి సంబంధించి వినయ్  కుమార్‌ క్లినికల్‌ పరీక్షలకు, ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ఆపరేషన్‌కు హాజరయ్యారు. అనంతరం అతనికి రూ.ఐదు లక్షలు ఇచ్చినట్టు చూపించి రూ.2.50 లక్షలు మాత్రమే చెల్లించి మోసం చేశారు. దీంతో బాధితుడు ఏప్రిల్‌ 26న పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  కారు డ్రైవర్‌గా పని చేస్తున్న వినయ్  కుమార్‌తో వాంబే కాలనీకే చెందిన శ్రీను, అతని భార్య కొండమ్మ, కామరాజు, ఎలీనా పరిచయం పెంచుకున్నారు. వారంతా  కిడ్నీ ఇవ్వడానికి ఒప్పించి మహరాణిపేటలో ఉంటున్న నార్ల వెంకటేశ్వరరావుకు పరిచయం చేశారు.                  


బాధితుడ్ని బెదిరించి మరీ కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ 


ఈ క్రమంలోనే విజయ డయాగస్టిక్‌ సెంటర్‌లో ల్యాబ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శేఖర్‌ తప్పుడు పత్రాలు సృష్టించాడు. క్లినికల్‌ టెస్టులు అక్కడ కొన్ని చేయించాడు. మిగిలిన వాటిని అపోలో ఆస్పత్రిలో చేయించారు. అనంతరం నార్ల వెంకటేశ్వరరావు అనుచరులు రమేష్‌, పవన్‌ గతేడాది సెప్టెంబర్‌, అక్టోబర్‌ మధ్య కాలంలో పెందుర్తి వద్ద ఉన్న తిరుమల నర్సింగ్‌ హోమ్‌లోని డాక్టర్‌ పరమేశ్వరరావును సంప్రదించారు. ఆస్పత్రిలోని రెండో అంతస్తులో ఉన్న ఆపరేషన్‌ గదిని రూ. 50 వేలకు, వార్డు రూమ్‌ను రూ.10 వేలకు అద్దెకు తీసుకుని అక్కడి సిసి కెమెరాలు పనిచేయకుండా చేశారు. తొలుత పరీక్షల అనంతరం  కిడ్నీ ఇచ్చేందుకు విముఖత చూపుతూ హైదరాబాద్‌ వెళ్లిపోగా అతన్ని బెదిరించి బలవంతంగా విశాఖకు రప్పించారు. కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేశారు. 


సినిమాల్లో ముఠాల మాదిరి అవయవాల వ్యాపారం


విశాఖలో వెలుగు చూసిన ఈ వ్యవహారం పోలీసులు చేధిచినట్లుగా చెబుతున్నంత చిన్నది కాదని చాలా పెద్ద రాకెట్ ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఒకరిద్దర్ని అరెస్ట్ చేసి పోలీసులు కేసును పూర్తి చేశామంటున్నారు కానీ.. అసలు ఎంత మంది ఇలా బాధితులయ్యారన్న విషయాన్ని.. అసలు ముఠాను పట్టుకోలేదన్న విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.