Anakapalli Pharma SEZ: అనకాపల్లిలోని పరవాడ ఫార్మా సెజ్‌లో మరో ప్రమాదం జరిగింది. సినర్జిన్ యాక్టివ్‌లో అర్థరాత్రి  ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.  అవసరమైతే ఎయిర్ అంబులెన్స్‌ను ఉపయోగించి బాధితులను వేరే ప్రాంతానికి తరిలించి మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. హోమంత్రి అనిత కూడా అధికారులతో మాట్లాడారు. బాధితులతో కూడా మాట్లాడారు. ఏం భయం లేదని ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

  


అర్థరాత్రి 12.30 గంటల ప్రాంతంలో జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో ఈ ప్రమాదం జరిగింది. సినర్జిన్ యాక్టివ్ ఇన్ గ్రేడియంట్స్ సంస్థలో ఘటన జరిగినట్టు జిల్లా అధికారులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా అధికారులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. గాయపడిన వారి పరిస్థితి గురించి ఆరా తీశారు. బాధితులకు అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించేందకు ఏం కావాలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హోంమంత్రి, ఇతర ఉన్నతాధికారులను వెంటనే బాధితుల వద్దకు వెళ్లాలని చంద్రబాబు ఆదేశించారు. 
ప్రమాదంలో గాయపడిన నలుగురిని విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ నలుగురు కూడా జార్ఖండ్ వాసులుగా గుర్తించారు. ఘటన, బాధితులకు అందుతున్న సాయంపై ఎప్పటికప్పుడు సమాచారం పంపాలని అధికారులను ఆదేశించిన చంద్రబాబు ఆదేశించారు.