Visakha Harbor: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గత వారం, పది రోజులుగా కురుస్తున్న వర్షాలు కారణంగా చాలా మంది జీవనోపాధిని కోల్పోతున్నారు. ముఖ్యంగా విశాఖపట్నంలోని మత్స్యకారులు వర్షాల కారణంగా చేపల వేటకు వెళ్లలేకపోతున్నారు. గత పది రోజులుగా ఫిషింగ్ హార్బర్ లోని బోట్లన్నీ లంగర్ వేసే ఉంచాల్సిన పరిస్థితి నెలకొందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు గత రెండునెలలుగా చేపల వేటకు విరామం ఇచ్చామని వివరిస్తున్నారు. ఆ గడువు పూర్తవడంతో.. ఈ నెలలోనే గంగమ్మ జాతర జరిపి మళ్ళీ చేపల వేటకు సన్నద్ధమయ్యారు. 


కానీ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు వారి చేపల వేటకు మళ్ళీ ఆటంకం కలిగించాయి. గత కొన్ని రోజులుగా మారిన వాతావరణం నేపథ్యంలో ముద్రంలో గంటకు 55 కిలోమీటర్ల వరకూ వేగంతో గాలులు వీస్తున్నాయి. కొన్నిసార్లు అయితే ఏకంగా గంటకు 65 కిలోమీటర్ల వేగం కూడా నమోదవుతుంది. ఈ పరిస్థితిల్లో చేపల వేటకు సముద్రంలోకి వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. దీనితో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లలేని స్థితి నెలకొందని మత్స్యకారులు వాపోతున్నారు. అదే తమకు జీవనాధారమంటూ.. తామిప్పుడు ఎలా బతకాలంటూ ఆందోళన చెందుతున్నారు. 


దాదాపు 170 ఫిషింగ్ బొట్లు హార్బర్ లోనే నిలిపివేత..


విశాఖ జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 686 మర పడవలు, 1208 మోటారు బోట్లు, 350 మామూలు పడవలు (తెప్పలు ) ఉన్నాయి. ఇవి హార్బర్ నుండి సముద్రంలో వేటకు వెళుతుంటాయి. కొన్ని రకాల పడవలు సాయంత్రానికి వెనక్కి వచ్చేస్తే .. సముద్రం లోనికి వెళ్లే మర పడవలు చేపలను వెతుక్కుంటూ తీరానికి చేరతాయి. రెండు డు రోజులపాటు అక్కడే వేట సాగించి తిరిగి వస్తాయి. అయితే ఇవన్నీ ఇప్పుడు కురుస్తున్న వర్షాల వల్ల గత వారం రోజులుగా వేటకు వెళ్లనే లేదు. ఒక్క విశాఖ జిల్లా పరిథి లోనే దాదాపు 80 కిలో మీటర్ల తీరా ప్రాంతం , 12 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలు, 15 మత్స్యకార పల్లెలు ఉన్నాయి. వైజాగ్ హార్బర్ పరిథిలో సుమారు 12,000 కుటుంబాలు మత్స్యకార, దాని అనుబంధ వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నారు. అయితే జోరుగా కురుస్తున్న వర్షాలు, వీస్తున్న బలమైన గాలుల కారణంగా అనేక చోట్ల తీరం వెంబడి ఫిషింగ్ బోట్లను నిలిపి వేశారు . 


గంజాం తీరంలో నిలిచిపోయిన 40 బోట్లు..


ఈ వర్షాలు ప్రారంభం కావడానికి ముందే చేపల వేటకు వెళ్లిన విశాఖ ఫిషింగ్ హార్బర్ కు చెందిన 40 బోట్లు గంజాం తీరంలోనే ఉండిపోయాయి. మొదట్లో వాటిని అనుమతించకపోయినప్పటికీ, విశాఖ జిల్లాకు చెందిన అధికారులు మాట్లాడడంతో వాటిని తాత్కాలికంగా అక్కడి తీరంలోకి అనుమతించారు. గత 10 రోజులుగా ఆ బోట్లలోని సిబ్బంది అక్కడే ఉన్నారు. వాతావరణం శాంతిస్తే తిరిగి రావడం కోసం వారు ఎదురు చూస్తున్నారు.