రాష్ట్రంలో అరాచక పాలన రాజ్యమేలుతోందని ఏపీ టీడీపీ అధ్య క్షుడు, మాజీ మంత్రి కింజరాపు అచ్చన్నాయుడు విమర్శించారు. పలాసలో 40 ఏళ్లుగా నివాసం ఉంటున్న ప్రజల ఇళ్లు కూల్చడానికి రెవెన్యూ, పురపాలక అధికారులు ప్రయత్నించారని చెప్పారు. గురువారం రాత్రి అధికారులు పలాస- కాశీబుగ్గ మున్సిపాలిటీ 27వ వార్డు టీడీపీ కౌన్సిలర్ సూర్య నారాయణ ఇల్లు కూల్చేందుకు ప్రయత్నించారు. దీనిని వ్యతిరేకిస్తూ స్థానికులు పొక్లెయినర్ ముందు బైఠాయించారు. ఈ క్రమంలోనే బాధితులకు సంఘీభావం తెలపడానికి శుక్రవారం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు, గౌతు శిరీష పలాస బయల‌్దేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు లక్ష్మీపురం టోల్ గేట్ వద్ద వారిని అడ్డుకున్నారు. దాంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అచ్చెన్న, రామ్మోహన్, శిరీషలను పలాసలోకి అనుమతించేది లేదని పోలీసులు తేల్చి చెప్పారు. 


నోటిసులు ఇవ్వాల్సిందేనన్న అచ్చెన్నాయుడు..


అనుమతి లేదన్న విషయానికి సంబంధించి నోటీసు ఇవ్వాలని అచ్చెన్న కోరారు. దీంతో పోలీసులు అచ్చెన్న, రామ్మోహన్లకు నోటీసులు ఇచ్చి టెక్కలి తరలించారు. దీనిపై అచ్చె న్నాయుడు విరుచుకుపడ్డారు. విధ్వంసాలతో జగన్ పాలన సాగుతోందని, ప్రజలు ఆయనకు తగిన బుద్ధి చెబుతారన్నారని అన్నారు. టీడీపీ నాయకులపై కక్ష సాధింపులే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. 40 ఏళ్లుగా టీడీపీ కౌన్సిలర్ సూర్య నారాయణ ఆ స్థలంలో నివాసం ఉంటున్నారన్నారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా దానిని తొలగించే హక్కు రెవెన్యూ, పురపాలక శాఖ అధికారులకు ఎవరిచ్చారని అచ్చెన్న ప్రశ్నించారు. అవసరమైతే న్యాయపోరాటానికి కూడా వెనుకాడేది లేదన్నారు. ప్రతిపక్షం గొంతు నొక్కేందుకు జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. వైకాపా పాలనపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేక ఏర్పడిందని, ఆ దృష్టి మరల్చేందుకే టీడీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయిస్తున్నారన్నారు. 


మంత్రి అండదండలతోనే ఇవన్నీ..


పలాస భూకబ్జాలకు కేంద్రంగా మారిపోయిందన్నారు. ప్రభుత్వ భూములను వైకాపా నాయకులు కబ్జా చేస్తున్నా.. పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందన్నారు. పలాసలో భూములన్నీ వైకాపా నాయకులే ఆక్రమిస్తున్నారని, ఆ విషయం అధికారులకు కూడా తెలుసునన్నారు. మంత్రి అండదండలతోనే ఇవన్నీ జరుగుతున్నాయని అన్నారు. వాటిపై చర్యలు తీసుకోవడం మాని, టీడీపీ కౌన్సిలర్ ఇంటిని కూల్చేందుకు అధికారులు ప్రయత్నించడం సిగ్గు చేటన్నారు.


టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష మాట్లాడుతూ... వైకాపా కక్షసాధింపు రాజకీయాలకు తెరలేపిందని అన్నారు. నియోజకవర్గంలో టీడీపీకి పెరుగుతున్న ఆదరణను చూసి స్థానిక మంత్రి ఓర్వలేకపోతున్నారన్నారు. అందుకే టీడీపీ కౌన్సిలర్ ఇంటిని కూల్చేందుకు అధికారులు సిద్ధమయ్యారని, దీనివెనుక మంత్రి ఆదేశాలు ఉన్నాయన్నారు. బాధితులు అధికారుల కాళ్లపై పడి వేడుకున్నా కనికరించకపోవడం సరికాదన్నారు. అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని వైకాపా నాయకులు గుర్తించాలని సూచించారు. 


పలాసలోకి ప్రవేశించకుండా..


ఎంపీ రామ్మోహన్ నాయుడు, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు మెండ దాసునాయుడు, ఇతర టీడీపీ నేతలను పోలీసులు పలాసలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. మరోవైపు మాజీ మంత్రి గౌతు శివాజీ కూడా అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అవి నిజంగానే అక్రమ కట్టడాలైతే, అధికారులు ముందస్తు నోటీసులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. పలాస పట్టణంలో భూకబ్జాలు చేస్తున్నవారందరిపైనా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.


కూన రవికుమార్ హౌస్ అరెస్ట్.. 


పలాసలో టీడీపీ కౌన్సిలర్ ఇంటిని కూల్చేందుకు అధికారులు సిద్ధమవడంతో జిల్లావ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు అప్రమత్తం అయ్యాయి. పలాస వెళ్లేందుకు ప్రయత్నించిన టీడీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ను స్థానిక శాంతి నగర్‌లోని నివాసం వద్ద శుక్రవారం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీనిపై కూన మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం కాలరాస్తోందన్నారు. ఏ కారణంతో తనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారో చెప్పాలని డిమాండ్ చేసారు. ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించడం కూడా పాపంగా మారిందన్నారు. వైకాపా పాలనకు ప్రజలు త్వరలోనే చరమగీతం పాడుతారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక అందరి లెక్కలు సరి చేస్తామని హెచ్చరించారు.