Cognizants Campus in Visakhapatnam: ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
విశాఖపట్నంలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ను ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ శుక్రవారం ఉదయం ప్రారంభించారు. ఏడాదిలోనే పూర్తిస్తాయి క్యాంపస్ విశాఖకు వస్తుందన్నారు.

Nara Lokesh Inaugurates Cognizants Campus in Vizag | విశాఖపట్నం: విశాఖపట్నంలో ప్రముఖ అంతర్జాతీయ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ముందుగా ఫిన్ టెక్ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు వేదమంత్రోచ్ఛారణల మధ్య ఘనస్వాగతం పలికారు. అనంతరం కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ (Cognizants Campus) ను మంత్రి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేశారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మధురవాడ హిల్ నెం-2లోని మహతి ఫిన్ టెక్ భవనంలో వెయ్యి మంది సీటింగ్ కేపాసిటీతో ఈ తాత్కాలిక క్యాంపస్ ను ఏర్పాటుచేశారు. కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ మొదటి దశ పూర్తయ్యే వరకు తాత్కాలికంగా ఫిన్ టెక్ భవనంలో కార్యకలాపాలను కొనసాగించనున్నారు. ఈ కేంద్రం కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజినీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్ వంటి ఆధునిక సాంకేతిక రంగాలపై దృష్టి సారించనుంది.
ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్
అనంతరం మంత్రి లోకేష్ కాగ్నిజెంట్ ఉద్యోగులతో కాసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. మీరంతా ఏపీ మొత్తాన్ని గర్వపడే విధంగా చేయాలి. యువతే రాష్ట్రానికి టార్చ్ బేరర్స్. కష్టపడి జీవితంలో విజయం సాధించాలి. ఇవి మీకు ఎంతో ఉద్వేగభరిత క్షణాలు. గతేడాది జనవరి 23న రవిని కలిశాను. ఏడాదిలోనే కాగ్నిజెంట్ సంస్థను రాష్ట్రానికి తీసుకువచ్చాం. ఇప్పుడు యువత చరిత్రకు సాక్షులుగా నిలిచారు. భవిష్యత్ లో విశాఖ ను మరింతగా అభివృద్ధి చేస్తామని’ అన్నారు.
ఈ కార్యక్రమంలో కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గుమ్మడి సూర్య, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ తిరుమల నారాయణన్, వైస్ ప్రెసిడెంట్ గౌరవ్ హజ్రా, ఎంపీ భరత్, మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్, ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు తదితరులు పాల్గొన్నారు.






















