YSRCP Chief Jagan will start 2024 Assembly Election Campaign: వైనాట్‌ 175  నినాదాన్ని ఎత్తుకున్న వైసీపీ(YSRCP) ఎన్నికల శంఖారావం పూరించనుంది. 175 అసెంబ్లీ స్థానాలతోపాటు 25 లోక్ సభ(Lok Sabha) స్థానాల్లో కూడా విజయం సాధించాలన్న ధ్యేయంతో ప్రజల ముందు వెళ్తోంది. ఇప్పటి వరకు చేసిన సంక్షేమాన్ని ప్రజల ముందు ఉంచి ఓట్లు అడగబోతోంది. విశాఖ(Vizag)లోని భీమిలి(Bhimili) వద్ద సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ సమర భేరీ మోగించనున్నారు. 


యుద్ధ భేరీతో సిద్ధం


సిద్ధం పేరుతో నిర్వహించే భీమిలి సభకు భారీగా జనాలను సమీకరిస్తోందీ వైసీపీ. ఈ మధ్య కాలంలో ఉత్తరాంధ్రలో టీడీపీ నిర్వహించిన పాదయాత్ర ముగింపు సభ కంటే గ్రాండ్ సక్సెస్ చేయాలని వైసీపీ భావిస్తోంది. ప్రజలకు చేసిన మంచితోపాటు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని తిప్పి కొట్టడం, జరుగుతున్న రాజకీయాన్ని ప్రజల ముందు ఉంచడమే ఆ పార్టీ టార్గెట్‌. 


మూడు ప్రాంతాలు నాలుగు సభలు


మూడు ప్రాంతాల్లో నాలుగు సభలు నిర్వహించేలా వైసీపీ మొదట ప్లాన్ చేసింది. సిద్ధం పేరుతో నిర్వహిస్తున్న మొదటి సభకు ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల నుంచి నాయకులు, కార్యకర్తలను తరలిస్తున్నారు. అందుకే భీమిలిలో 15 ఎకరాల్లో ఏర్పాట్లు చేశారు. 


కార్యకర్తలతో భేటీ


సిద్దం పేరుతో నిర్వహిస్తున్న బహిరంగ సభల్లో ప్రసంగించడమే కాకుండా... కార్యకర్తలు, నేతలతో జగన్‌ సమావేశం కానున్నారు. ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేస్తూ వస్తున్న వైసీపీ అధినేత ఇప్పుడు ప్రచారంలోకి కూడా దూకారు. ఇది పార్టీ శ్రేణులను మరింత ఉత్సాహపరుస్తుందని నేతలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే సుమారు 60 వరకు అసెంబ్లీ అభ్యర్థులను ఖరారు చేశారు. పది ఎంపీ స్థానాలకు కేండిడేట్‌లను కూడా డిసైడ్ చేశారు. మిగతా వారి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. 


ఏం మాట్లాడతారు- షర్మిల విమర్శలపై ఎలా రియాక్ట అవుతారు


ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చిన జగన్‌ ఇప్పటి వరకు పార్టీ అధినేతగా ఎలాంటి బహిరంగ సభల్లో పాల్గొనలేదు. ఇప్పటి వరకు కార్యకర్తలను కూడా నేరుగా కలుసుకోలేదు. మధ్య మధ్యలో ఒకట్రెండు సమావేశాలు జరిగినా అవి ఒకటి రెండు ప్రాంతాలకే పరిమితం అయ్యాయి. దీంతో ఆయన స్పీచ్ ఎలా ఉంటుంది. ఏం చెప్పబోతున్నారు. షర్మిల విమర్శలపై ఎలా రియాక్ట్ అవుతారనే చర్చ నడుస్తోంది. 


సంక్షేమ పాలనగా ప్రచారం 


ఇప్పటికే గడప గడపకు మన ప్రభుత్వం, వై ఏపీ నీడ్స్ జగన్ వంటి కార్యక్రమాలతో ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. వాటితోపాటు గతంలో ఇచ్చిన మేనిఫెస్టోను ప్రజలకు ఇచ్చి అమలు చేసిన పథకాలు వివరించనున్నారు. గతానికి ఇప్పటికి పోల్చి ఓటు వేయాలని అభ్యర్థించనున్నారు. డీబీటీ ద్వారా ప్రజలకు 2.53 లక్షల కోట్లు, నాన్‌ డీబీటీ ద్వారా 1.68 కోట్లు ఇచ్చామని వివరించనున్నారు. 


పోల్చి చూడాలని అభ్యర్థన 


విద్య, ఆరోగ్య, పాలనా రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చామని జగన్‌ చెప్పనున్నారు. అవన్నీ గ్రామాల్లో మండలాల్లో కనిపిస్తున్నాయని వివరించనున్నారు. సామాజిక న్యాయాన్ని పాటిస్తూ అన్ని వర్గాలకు పదవులు పంపిణీ చేశామన్నారు. అన్నింటినీ మైండ్‌లో పెట్టుకొని మరోసారి ఆశీర్వదించాలని కోరుబోతున్నారు.