పాయకరావుపేటలో పశువుల అక్రమ రవాణా జరుగుతోందని, దీని వెనుక హోంమంత్రి అనిత పీఏ సుంకర గణేష్ ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయి.
Home Minister Anitha: హోంమంత్రి పీఏపై పశువుల అక్రమ రవాణా ఆరోపణలు! సమగ్ర విచారణకు అనిత ఆదేశం!
Home Minister Anitha: హోంమంత్రి అనిత పీఏ సంకర గణేష్పై సంచలన ఆరోపణలు వినిపిస్తున్నాయి. పశువుల అక్రమ రవాణాలో ఆయన పాత్ర ఉందని ప్రచారం జరుగుతోంది.

Home Minister Anitha: ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా, పాయకరావుపేట నియోజకవర్గం ప్రస్తుతం ఓ వార్త హల్చల్ చేస్తోంది. పశువుల అక్రమ రవాణాకు అడ్డగా మారిపోయిందని దీనికి హోంమంత్రి అనిత పీఏ సహకారం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గో సంరక్షణ పేరుతో మూగ జీవాల పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరిస్తున్న ముఠా వెనుకాల సంకర గణేష్ ఉన్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వారిని సపోర్ట్ చేసే మీడియాలో కథనాలు వచ్చాయి.
హోంమంత్రి అనిత సొంత నియోజకవర్గం పాయకరావుపేటలో చీమ చిటుక్కుమన్నా సరే సంచలనంగా మారుతోంది. గతంలో హోంమంత్రి వద్ద పీఏగా పని చేసిన జగదీష్పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో వెంటనే ఆ వ్యక్తిని విధుల నుంచి తప్పించారు. ఆయన స్థానంలో సుంకర గణేష్ను తీసుకున్నారు. ఇప్పుడు ఆయన కూడా వివాదాల్లో చిక్కుకున్నారు. ఇప్పటికే ఈ గణేష్పై 2022లో కాకినాడ జిల్లా ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐర్ నమోదై ఉంది. ఇప్పుడు ఆ వ్యక్తిపైనే పశువుల అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపణలు రావడంతో అనిత ప్రత్యర్థులు విరుచుకుపడుతున్నారు.
ఈ అక్రమ రవాణాకు పకడ్బందీగా నెట్వర్క్ ఏర్పాటు చేశారు. ఎస్ రాయవరం మండంలోని పెనుగొల్లు, సోమదేవులపల్లి, గోకులపాడు, ధర్మవరం అగ్రహారం వంటి గ్రామాల్లో కొందరు వ్యక్తులను ఏర్పాటు చేసుకున్నారు. వీళ్లంతా పెనుగొల్లు గ్రామంలో దందా సాగిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. గోశాల పేరుతో ఏర్పాటు చేసుకున్న ట్రస్ట్ ముసుగులో గోవులను తరలిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. రహస్యంగా వధశాలలకు అమ్మేస్తున్నారని అంటున్నారు. వ్యాపారులతో జరిగిన సమావేశానికి సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయని చెబుతున్నారు. ఈ దందాపై ఎస్రాయవరం గ్రామానికి చెందిన వ్యక్తి కలెక్టర్ విజయ్ కృష్ణన్కు ఫిర్యాదు చేశారు. లోకాయుక్తలో కంప్లైంట్ చేశారు.
పశువుల అక్రమ రవాణాలో తన పీఏ గణేష్ ఉన్నారని వార్తలు రావడంతో హోంమంత్రి అలర్ట్ అయ్యారు. మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని సూచించారు. ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. తాము చాలా పారదర్శకంగా ఉన్నామని అందుకే ఏదో రూపంలో బురదజల్లేందుకు ప్రత్యర్థులు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మంత్రి చెప్పుకొచ్చారు.
Frequently Asked Questions
పాయకరావుపేటలో ఏ ఆరోపణలు వస్తున్నాయి?
పీఏ సుంకర గణేష్పై ఇంతకుముందు ఏమైనా కేసులు నమోదయ్యాయా?
అవును, 2022లో కాకినాడ జిల్లా ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్లో సుంకర గణేష్పై ఇప్పటికే ఒక ఎఫ్ఐర్ నమోదై ఉంది.
పశువుల అక్రమ రవాణా ఎలా జరుగుతోంది?
గోశాల పేరుతో ఏర్పాటు చేసుకున్న ట్రస్ట్ ముసుగులో గోవులను రహస్యంగా వధశాలలకు తరలిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
ఈ విషయంపై హోంమంత్రి అనిత స్పందన ఏమిటి?
హోంమంత్రి అనిత ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులను సమగ్ర దర్యాప్తు చేయాలని ఆదేశించారు. ప్రత్యర్థులు బురదజల్లేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.






















