CM Jagan Will Visit Adudam Andhra Finals: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు తుది దశకు వచ్చాయి. గడిచిన నెల రోజులు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ క్రీడా సంబరాలను ప్రభుత్వం నిర్వహించింది. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన పోటీల్లో మెరుగైన ప్రదర్శన చేసిన జట్టు జిల్లా స్థాయిలో ఆడాయి. అక్కడ అద్భుత ప్రతిభ కనబర్చిన జట్టు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. రాష్ట్ర స్థాయి పోటీలకు 26 జిల్లాలు నుంచి 260 జట్లు ఎంపికయ్యాయి. 130 మహిళల జట్లు, 130 పురుషుల జట్లు ఉన్నాయి. వీరికి విశాఖలోని ఎనిమిది మైదానాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 9 నుంచి 13 వరకు రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తున్నారు. మంగళవారం జరగనున్న ఫైనల్‌ పోటీలకు సీఎం జగన్మోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. పీఎం పాలెంలోని ఏసీఏ వీడీసీఏ క్రికెట్‌ స్టేడియంలో జరగనున్న ఫైనల్‌ వేడుకల్లో సీఎం పాల్గొన్ని క్రీడాకారులు, ప్రేక్షకులను ఉద్ధేశించి ప్రసంగించనున్నారు. ఇందుకోసం అధికారులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. 


ఏర్పాట్లను పరిశీలించిన ప్రదుమ్న


ఫైనల్‌ మ్యాచ్‌కు సీఎం హాజరవుతున్న నేపథ్యంలో తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రద్యుమ్న అధికారులను ఆదేశించారు. ఆదివారం ఏసీఏ స్టేడియంతోపాటు హెలిప్యాడ్‌ ప్రాంతాలను పరిశీలించి అధికారులకు తగిన ఆదేశాలను జారీ చేశారు. అధికారులు సమన్వయంతో పని చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. పూర్తి స్థాయిలో ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించి నిర్వహించిన క్రీడా పోటీలు విజయవంతంగా ముగిసేలా చూడాలన్నారు. విభాగాలు వారీగా చేపట్టాల్సిన చర్యలకు సంబంధించిన మార్గదర్శకాలను ఈ సందర్భంగా ఆయన జారీ చేశారు. 


క్రీడాకారులు, ప్రేక్షకులకు ఏర్పాట్లు


సీఎం హాజరవుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పటిష్ట భధ్రతా ఏర్పాట్లు చేస్తోంది. భారీగా క్రీడాకారులు, ప్రేక్షకులు హాజరవుతారన, అందుకు అనుగుణంగా మంచి నీటి సదుపాయం, భోజన సదుపాయాలు ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ మల్లిఖార్జున వెల్లడంచారు. జిల్లా యంత్రాంగం, పోలీస, శాప్‌ నుంచి ఒక్కో అధికారిని ఒక్కో దానికి ఇన్‌చార్జ్‌గా నియమించినట్టు కలెక్టర్‌ తెలిపారు. ప్రేక్షకులు కూర్చునేందుకు అనుగుణంగా భారీ ఏర్పాట్లను చేసినట్టు తెలిపారు. సీఎం జగన్‌ మంగళవారం సాయంత్రం విశాఖ వచ్చి ఫైనల్‌ మ్యాచ్‌కు హాజరుకానున్నారు. ఇందుకు అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.