AP BRS : ఏపీలో విస్తరణకు బీఆర్ఎస్ పార్టీ భారీ ప్రణాళిక సిద్ధం చేసింది. ఏపీలో విద్యా సంస్థల అధినేతలు, ఉద్యమ నేతలను బీఆర్ఎస్ టార్గెట్ చేసింది. విశాఖలో జరిగే కేసీఆర్ సభలో కీలక నేతలను పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించింది. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ విశాఖలో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, మాజీ జేడీ లక్ష్మీ నారాయణతో భేటీ అయ్యారు. వారితో బీఆర్ఎస్ లో చేరేందుకు మంతనాలు జరిపినట్లు సమాచారం. మరికొంత మంది ఉత్తరాంధ్ర నేతలతో ఎమ్మెల్యే వివేక్ భేటీ అయినట్లు తెలుస్తోంది. 


ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలతో మంతనాలు!  


ఇప్పటికే తోట చంద్రశేఖర్‌ను ఏపీ బీఆర్ఎస్ కు అధ్యక్షుడిగా కేసీఆర్ నియమించారు. దీంతో కాపుల్ని బీఆర్ఎస్ కు దగ్గరకు చేసేందుకు ప్లాన్ వేసింది.  అలాగే కాపుల్లో గంటా శ్రీనివాస్ కు ఉన్న పాపులారిటీని ఉపయోగించుకోవాలని బీఆర్‌ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో విశాఖలో సభ పెట్టి వాళ్లను పార్టీలో చేర్చుకునే దిశగా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్‌ గంటా, మాజీ జేడీ లక్ష్మీనారాయణతో రహస్యంగా భేటీ అయినట్లు సమాచారం. అలాగే ఉత్తరాంధ్రకు చెందిన కొందరు ఎమ్మెల్యేలతో వివేక్‌ మంతనాలు జరుగుతున్నాయి.
 


సిట్టింగ్ ఎమ్మెల్యేలు వస్తారంటూ కేసీఆర్ వ్యాఖ్యలు  


తోట చంద్రశేఖర్ ను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించినప్పుడు సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ లోకి సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు వస్తారంటూ సీఎం కేసీఆర్ అన్నారు. కేసీఆర్ అంటున్నట్లుగా బీఆర్ఎస్ లోకి వెళ్లే జంప్ జిలానీలు ఎవనేదారి పై అంచనాలు వేసుకుంటున్నారు.  ఆంధ్రప్రదేశ్ లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం భారతీయ రాష్ట్ర సమితిలోకి రావటానికి సిద్దంగా ఉన్నారని కేసీఆర్ బీఆర్ఎస్‌లో నేతల చేరిక సందర్భంగా వ్యాఖ్యానించారు. వైసీపీ,టీడీపీ పార్టిలకు  పక్కాగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వర్తిస్తాయి. ఎందుకంటే ఈ రెండు పార్టీలకు చెందిన శాసనసభ్యులే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసన సభలో ఉన్నారు.  వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యేల్లో ఎవరు భారతీయ రాష్ట్ర సమితికి జై కొడతారు అనేది కీలకంగా మారింది. దీంతో రెండు పార్టీలకు చెందిన శాసన సభ్యులపై అంచనాలు కూడా మొదలయ్యాయి. ఏపీలో ఉన్న కీలకమైన రాజకీయ పార్టీలను కాదని, తెలంగాణ సెంటిమెంట్ ను కేంద్రంగా చేసుకొని ఏర్పాటైన టీఆర్ఎస్ పార్టీ ఆ తరువాత భారతీయ రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందిన పార్టీలో చేరుతారా అన్నది ప్రధాన సందేహం.  ప్రజారాజ్యం, వైసీపీ, జనసేనల్లో పోటీ చేసి ఓడిపోయిన  తోట చంద్రశేఖర్ తో పాటుగా, ఏపీకి చెందిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు సహా  పలు పార్టీల్లో పనిచేసి సైలెంట్ అయిన కొందరు ద్వితీయ శ్రేణి నేతలు కేసీఆర్ సమక్షంలోనే బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.  గంటా, లక్ష్మీనారాయణతో బీఆర్ఎస్ నేతలు మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. దీంతో ఏపీలో బీఆర్ఎస్ చేరికలపై ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో కీలక నేతలు బీఆర్ఎస్ లో చేరుతున్నారు. ఇటీవల ఒడిశా మాజీ సీఎం బీఆర్ఎస్ లో చేరారు. మహారాష్ట్ర, ఝార్ఖండ్ కు చెందిన కీలక నేతలు పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.