Somu Veerraju : ప్రధాని మోదీ ఈ నెల 11, 12 తేదీల్లో విశాఖలో పర్యటించనున్నారు. ప్రధాని పర్యటనలో పార్టీ పరంగా కార్యక్రమాలకు ఏపీ బీజేపీ ఏర్పాట్లు చేస్తుంది. విశాఖలో బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ప్రధాని పర్యటనపై మాట్లాడారు. ప్రధాని మోదీ ఈనెల 11 సాయంత్రం 6:25 కు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారన్నారు. పార్టీ తరపున ఘన స్వాగతం పలికి, అనంతరం రోడ్ షో నిర్వహిస్తామన్నారు. ఇవాళ సాయంత్రానికి అధిష్ఠానం  రోడ్ షో మార్గాన్ని నిర్ణయిస్తుందన్నారు. తాము రెండు రూట్లు పంపామని, ఒకటి ఎన్ఎడి వద్ద పాత ఐటిఐ నుంచి, రెండోది బీచ్ రోడ్ అన్నారు. 12వ తేదీ ఉదయం ఏయూ ఇంజినీరింగ్ గ్రౌండ్ లో పలు కేంద్ర ప్రభుత్వ పథకాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఉంటాయన్నారు. బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతారని సోము వీర్రాజు తెలిపారు. అదే రోజు మధ్యాహ్నం 12.15 కు ప్రధాని మోదీ తెలంగాణకు బయలుదేరివెళతారన్నారు. 


విపక్షాలపై అణచివేత చర్యలు 


కేంద్రం ఇంతకాలం ఎన్నో పథకాలకు నిధులు ఇచ్చిందని సోము వీర్రాజు అన్నారు. ఆ పథకాలను ప్రధాని దేశానికి అంకితం చేస్తారని తెలిపారు. రాష్ట్ర పరంగా ఏ అభివృద్ధి లేదన్నది స్పష్టం అయిందన్నారు. వైసీపీ ప్రభుత్వం విపక్షాల మీద అణచివేత చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. ఏపీలో అయిదువేల ఎస్సీ బస్తీల్లో సంపర్క్ అభియాన్  కార్యక్రమం నిర్వహిస్తున్నామని సోము వీర్రాజు అన్నారు. కడప జిల్లాలో ఎస్సీలు ఈ అభియాన్ కు తరలి వస్తే అధికార పార్టీ అడ్డుకుంటోందని ఆరోపించారు. దీనిపై పోరాడుతామన్నారు.  


పవన్ ను పిలుస్తారా? 


ఏపీ రాజధాని అమరావతికే బీజేపీ కట్టుబడి ఉందని సోము వీర్రాజు తెలిపారు. రాజధానిపై మరో వివాదానికి తావు లేదని స్పష్టం చేశారు. మూడు రాజధానుల పేరుతో ప్రజల్ని మభ్యపెడుతున్నారని వైసీపీపై మండిపెట్టారు.  ఈనెల 11న విశాఖలో ప్రధాని మోదీ పర్యటించనున్నారని, ఈ పర్యటన వివరాలను ఎంపీ జీవీఎల్‌ నరసింహారావుతో కలిసి సోము వీర్రాజు మీడియాకు తెలిపారు. ప్రధాని పర్యటన వివరాలను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ముందే ప్రకటించారని మీడియా ప్రతినిధులు ఆయనను అడిగారు. కేంద్రం చేస్తున్న అభివృద్ధిపై క్రెడిట్‌ కొట్టేసేందుకు వైసీపీ తొందరపడుతోందన్నారు. ప్రధాని సభకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను పిలుస్తారా? అని అడిగిన ప్రశ్నకు సోము వీర్రాజు సమాధానం దాటవేశారు.  


స్టీల్ ప్లాంట్ అంశం ముగిసిన విషయం 
 
విశాఖలో ఏ అభివృద్ధి చేసినా అది కేంద్ర నిధులతో జరిగినది మాత్రమే అని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. మోదీ సభకు రావటానికి అన్ని రాజకీయ పక్షాలూ ఆసక్తి చూపుతున్నాయన్నారు. హోదా, స్టీల్ ప్లాంటు వంటి అంశాలు గడిచిపోయిన విషయాలు అన్నారు. ప్రస్తుతం అభివృద్ధి అజెండా నడుస్తోందన్నారు.