YSRCP Chief YS Jagan : లిక్కర్ స్కామ్‌పై మాట్లాడిన వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడే స్కామ్ చేసి ఇప్పుడు తమపై బురదజల్లుతున్నారని ఆరోపించారు. వ్యవస్థలను మేనేజ్ చేసి ప్రశ్నించే వారిని జైల్లో పెడుతున్నారని విమర్శించారు. అందులో భాగంగానే లిక్కర్ స్కామ్‌ తెరపైకి తీసుకొచ్చారని అన్నారు. ఉన్న సమస్యల నుంచి, సూపర్ సిక్స్ హామీల నుంచి దృష్టి మరల్చేందుకే ఈ పన్నాగమని అన్నారు.  

వైసీపీ పాలనలో లిక్కర్ అమ్మకాలు తగ్గించామని అన్నారు జగన్. అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా లేకుంటే అమ్మకాలు పెంచితే లంచాలు ఇస్తారా అని ప్రశ్నించారు. కానీ చంద్రబాబు 2014 నుంచి 2019 వరకు చేసిందే అసలైన స్కామ్ అన్నారు. అందుకే అప్పట్లోనే కేసు నమోదు అయిందన్నారు. ఇప్పుడు ఆ కేసులో చంద్రాబబు బెయిల్‌పై ఉన్నారని గుర్తు చేశారు. తనపై ఉన్న కేసు లాంటిదే ఇప్పుడు తమపై కేసులు పెడుతున్నారని అన్నారు. దాన్ని బలహీనపరిచేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఎలాంటి స్కామ్ జరగపోయినా జరిగినట్టు మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.  

వైసీపీ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 33 శాతం దుకాణాలు తగ్గించామని గుర్తు చేశారు జగన్. అమ్మకాలు కూడా భారీగా పడిపోయాయని తెలిపారు. తమ హయాంలో ఒక్క మద్యం కంపెనీకి లైసెన్స్‌ ఇవ్వలేదని వివరించారు. ట్యాక్స్‌లు కూడా పెంచినట్టు పేర్కొన్నారు. ఇలాంటివి చేస్తే ఎవరైనా లంచాలు ఇస్తారా అని ప్రశ్నించారు. ఇక్కడ కంపెనీలకు లాభాలు తగ్గించడమే కాకుండా ప్రజలకు మేలు చేశామని అన్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాలు పెట్టి క్యూఆర్‌ కోడ్‌ విధానాం అమలు చేసి ఎలాంటి అక్రమాలు జరగకుండా అమ్మకాలు చేశామన్నారు. 

అసలు లిక్కర్ స్కామ్ చంద్రబాబు హయాంలోనే జరిగిందని అన్నారు జగన్ ఆరోపించారు. 2014-19 మధ్య కాకుండా ఇప్పుడు కూడా జరుగుతోందని అన్నారు. ఇప్పుడు బియ్యం డోర్ డెలివరీ చేయడం లేదు కానీ మద్యాన్ని మాత్రం సరఫరా చేస్తున్నారని విమర్శించారు. ప్రతి చోట బెల్ట్‌షాపులు కనిపిస్తున్నాయని అన్నారు. తమ అనుచరులకు షాపులు కట్టబెట్టారని అన్నారు. అప్పుడూ ఇప్పుడూ అదే అనుసరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

వైసీపీ హయాంలో ఎలాంటి స్కామ్‌ జరగపోయినా కొందర్ని బెదిరించి భయపెట్టి తప్పుడు సాక్ష్యాలు సృష్టించి, తప్పుడు వాంగ్మూలాలతో భయాన పరిస్థితులు సృష్టిస్తున్నారని ఆరోపించారు జగన్. చిన్న స్థాయి ఉద్యోగుల నుంచి పారిశ్రామికవేత్తల వరకు బెదిరిస్తున్నారని ఆన్నారు. అసలు వీటితో సంబంధం లేని వ్యక్తులను కూడా కేసులో లాగి ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. 

విజయసాయిరెడ్డి మాటకు విలువ ఎక్కడుంది?చంద్రబాబుకు లొంగిపోయిన విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తుల మాటకు ఎక్క విలువ ఉంటుందని ప్రశ్నించారు జగన్. కూటమికి మేలు చేసేలా తన రాజ్యసభ సీటుకు రాజీనామా చేశారన్నారు.  చంద్రబాబు చేసిన ప్రలోభాలకు విజయసాయిరెడ్డి లొంగిపోయారని ఆరోపించారు. అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్‌మెంట్‌కు ఏం విలువ ఉంటుందని ప్రశ్నించారు.  

సిన్సియర్ ఆఫీసర్‌లను జైల్లో పెట్టారు: జగన్ లోక్‌సభ ఎంపీ, ఫ్లోర్‌ లీడర్ మిథున్ రెడ్డిని కూడా ఈ లిక్కర్ స్కామ్‌లోకి లాగారని అన్నారు జగన్. అసలు ఆయనకు ఆయన తండ్రికి ఆ శాఖతో ఏం సంబంధమని ప్రశ్నించారు. గతంలో ఎప్పుడూ ఐపీఎస్‌, ఐఏఎస్‌లను జైల్లో పెట్టిన సందర్భాలు లేవని అన్నారు జగన్. ఇప్పుడు మాత్రం జైల్లో పెడుతూ చిత్రవధ పెడుతున్నారని ఆరోపించారు. ధనుంజయ్‌రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్పకు ఈ కేసుతో ఉన్న సంబంధం ఏంటని ప్రశ్నించారు. ధనంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి సిన్సియర్‌ ఆఫీసర్‌లు అని కితాబు ఇచ్చారు. అయినా వాళ్లను జైల్లో పెట్టి హింసిస్తున్నారని అన్నారు.