Three people with terror links arrested in Vijayawada:  విజయవాడలో పెను ఉగ్ర కుట్రను కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ అధికారులు భగ్నం చేశారు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలైన ఐసిస్, ఆఖిస్ (AQIS) లతో సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిని మహమ్మద్ రహమతుల్లా షరీఫ్, ఎండి. డానిష్ , మీర్జా సోహైల్ బేగ్‌లుగా గుర్తించారు. దేశంలో అశాంతిని సృష్టించేందుకు వీరు రహస్యంగా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు నిఘా వర్గాలు నిర్ధారించాయి.

Continues below advertisement

అల్ మాలిక్ ఇస్లామిక్ యూత్ పేరుతో నెట్‌వర్క్ 

అరెస్టయిన యువకులు అల్ మాలిక్ ఇస్లామిక్ యూత్ అనే పేరుతో ఒక రహస్య సంస్థను ఏర్పాటు చేసినట్లు విచారణలో వెల్లడైంది. స్థానిక యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించడం, వారిని రాడికలైజ్ చేయడం ఈ సంస్థ ప్రధాన ఉద్దేశ్యం. సోషల్ మీడియా వేదికగా ఉగ్రవాద భావజాలాన్ని ప్రచారం చేస్తూ, యువతలో మతపరమైన ఉన్మాదాన్ని నింపేందుకు వీరు ప్రయత్నించారు. ముఖ్యంగా భారత జాతీయ పతాకం  స్థానంలో ఐసిస్ పతాకాన్ని ఉంచాలంటూ వీరు చేసిన ప్రచారం తీవ్ర దుమారం రేపుతోంది.

Continues below advertisement

కీలక ఆధారాలు లభ్యం ?  నిందితులపై నిఘా ఉంచిన కౌంటర్ ఇంటలిజెన్స్  సెల్ అధికారులు, పక్కా సమాచారంతో వారి నివాసాలపై దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో అనేక ఎలక్ట్రానిక్ పరికరాలు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు , ఉగ్రవాద భావజాలానికి సంబంధించిన విద్రోహ పూరిత పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరు విదేశీ హ్యాండ్లర్లతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి. దీంతో ఈ ముగ్గురిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారికి జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.     

దేశవ్యాప్త నెట్‌వర్క్‌పై ఆరా                              

విజయవాడ కేంద్రంగా సాగుతున్న ఈ వ్యవహారం వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో అధికారులు లోతుగా విచారిస్తున్నారు. వీరికి దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఉగ్రవాద ముఠాలతో సంబంధాలు ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనతో విజయవాడ పోలీసులు అప్రమత్తమయ్యారు మరియు అనుమానిత వ్యక్తుల కదలికలపై నిఘాను మరింత తీవ్రం చేశారు.