Gade Saikrishna Missing Case: విజయవాడ నగరంలో ఎక్కడ చూసిన ఒకటే చర్చ . అసలు సాయికృష్ణ ఎక్కడ? గడప దాటిన సాయికృష్ణ ఏమయ్యాడు. కృష్ణలంక పోలీస్‌లు చంపేశారనే ఆరోపణలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. " నా కొడుకు బతికున్నాడో లేదో చెప్పండి అని సాయికృష్ణ తల్లి వేస్తున్న ఆర్తనాదాలు అందర్నీ కలిచివేస్తున్నాయి. ఈ మిస్టరీని ఛేదించేందుకు ప్రభుత్వం ఇప్పుడు ఒక స్పెషల్ ఆఫీసర్‌ని రంగంలోకి దించింది. 

Continues below advertisement

ఈ కేసులో అసలు ఏం జరిగింది? పోలీసులపై వస్తున్న ఆరోపణల్లో నిజమెంత? రాజమండ్రి  ఎస్పీ నరసింహ కిషోర్ రాకతో ఈ ఇన్వెస్టిగేషన్ ఏ మలుపు తిరుగబోతోందో చూద్దాం. 

ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా రాజమండ్రి ఎస్పీ!

విజయవాడ రౌడీషీటర్ సాయికృష్ణ మిస్సింగ్ కేసును ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ కేసులో నిజనిజాలు నిగ్గు తేల్చేందుకు రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్‌ను విచారణాధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నరసింహ కిషోర్ వంటి సమర్థవంతమైన అధికారికి బాధ్యతలు అప్పగించడం వెనుక పెద్ద స్ట్రాటజీ ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. పోలీసులు తప్పు చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూదనే క్లియర్ మెసేజ్‌ని ప్రభుత్వం పంపినట్టు కనిపిస్తోంది. 

Continues below advertisement

కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌పై లాకప్ డెత్ మరక 

ఈ కేసులో ప్రధానంగా వినిస్తున్న ఆరోపణ కృష్ణ లంక పోలీస్ స్టేషన్‌లో జరిగిన దారుణం గురించి, సాయికృష్ణను విచారణ పేరుతో తీసుకెళ్లి అక్కడ విపరీతంగా కొట్టడం వల్లే సాయి మరణించాడని, ఆపై పోలీసులు బాడీని మాయం చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నేడు నేరుగా కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లనున్నా ఎస్పీ నరసింహా కిషోర్‌, అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్, లాగ్ బుక్స్, ఆ సమయంలో డ్యూటీలో ఉన్న సిబ్బందిని విచారించనున్నారు. 

బూడిదైనా ఇప్పించండని తల్లి ఆవేదన 

ఏ తల్లికైనా తన బిడ్డ క్షేమంగా ఉండాలని కోరుకోవడం సహజం. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. తన కొడుకును పోలీసులు తీసుకెళ్లిన తర్వాత మళ్లీ కంటికి కనిపించలేదని అతను బతికున్నాడో లేదో కూడా పోలీసులు చెప్పడం లేదని ఆమె కన్నీటి పర్యంతమవుతున్నారు. సాయికృష్ణ బతికున్నాడో లేదో కనీసం సమాచారం ఇవ్వాలని, చంపేసి ఉంటే బూడిదైనా ఇవ్వాలని ఆమె వేడుకుంటున్నారు. 

సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ 

స్థానిక పోలీసుల విచారణపై సాయికృష్ణ కుటుంబ సభ్యులకు ఏ మాత్రం నమ్మకం లేదని అంటున్నారు. అందుకే ఈ కేసును వెంటనే సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులే నిందితులుగా ఉన్నప్పుడు మరో పోలీస్ అధికారి చేసే విచారణ ఎంత వరకు నిష్పక్షపాతంగా ఉంటుందనేది వారి ప్రశ్న. హైకోర్టు పర్యవేక్షణలో లేదా కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపిస్తే నిజాలు వెలుగులోకి వస్తాయని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.