శ్రీ సత్య సాయి జిల్లా చిలమత్తూరు మండలంలోని వైసీపీ ఎమ్మెల్సీ షేక్‌ మహమ్మద్‌ ఇక్బాల్‌ ఇంటికి బారీగా జనం తరలి వచ్చారు. సార్ ఇంట్లో లేరని చెప్పినా వినిపించుకోలేదు. సార్‌ను కలవాల్సిందేనంటూ పట్టుపట్టారు. గతంలో ఇచ్చిన హామీ సంగతి అడిగి వెళ్తామని భీష్మించారు. పోలీసులు ఏదోలా చేసి ఎమ్మెల్సీతో మాట్లాడించి వారిని అక్కడి నుంచి పంపేశారు. 


తమ్మినేనిపల్లి రోడ్డు సమస్య వైసీపీ ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ ఇంటికి చేరింది. తమకు గతంలో ఇచ్చిన హామీ మేరకు రోడ్డు ఎప్పుడు బాగు చేస్తారో చెప్పాలంటూ ఆ గ్రామ ప్రజలంతా ఎమ్మెల్సీ ఇంటికి వచ్చారు. ఇటీవల భారీ వర్షాలు కురవడంతో తమ గ్రామానికి వెళ్లే రోడ్డు పూర్తిగా దెబ్బతిందని వాపోయారు. దాన్ని వల్ల గ్రామం నుంచి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయినట్లు వివరించారు.


గత నెల రోజులుగా ఊళ్లో వాళ్లంతా గ్రామం నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడిందని తీవ్ర సమస్యలు ఎదుర్కుంటున్నట్లు స్పష్టం చేశారు. ఈ సమస్యనే ఎమ్మెల్సీ ఇక్బాల్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీని కోసం ఊళ్లోని వాళ్లంతా లారీలో ఎమ్మెల్సీ ఇంటికి చేరుకున్నారు. కానీ ఆ సమయంలో ఎమ్మెల్సీ గడపగడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో ఉండటంతో ఫోన్‌లో విషయాన్ని చెప్పారు. 


వారం రోజుల్లో రోడ్డు వేయిస్తా..


దీనిపై స్పందించిన ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ వారం రోజుల్లో రోడ్డు సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడే అధికారులతో మాట్లాడతానని చెప్పి ఫోన్ పెట్టేశారు. దీనిపై తమ్మినేని పల్లి వాసులు పెదవి విరుస్తున్నారు. గతంలో కూడా ఇలానే హామీ ఇచ్చారని ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. తాము అడగక ముందే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకీ ఓటు వేస్తే రోడ్డు వేయిస్తానని మాట ఇచ్చారని, తర్వాత దాని సంగతే పట్టించుకోలేదని అన్నారు.   


సోమవారం గ్రామ సచివాలయానికి తాళం వేసి నిరసన..


రోడ్డు బాగు చేయించాలని సోమవారం గ్రామస్థులు అందరూ కలిసి కేతేపల్లి గ్రామ సచివాలయానికి తాళం వేసి మరీ నిరసన తెలిపారు. రోడ్డు పరిస్థితి ప్రభుత్వానికి అర్థం అయ్యేందుకు రహదారిపైనే నాట్లు వేశారు. కనీసం తమ గ్రామానికి అంబులెన్స్ కూడా రాలేకపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర సరకులు తెచ్చుకోవాలన్నా, వేరే పనుల కోసం ఊరు దాటి బయటకు వెళ్లాలంటే చాలా కష్టంగా ఉందన్నారు. వేరే ఊళ్లలో చదువుకునే పిల్లలను బడికి కూడా పంపించలేకపోతున్నామని చెప్పారు. అయితే సోమవారం గంటలపాటు పిల్లా జెల్లలతో ఆడ, మగా కలిసి ధర్నా చేసినా ప్రభుత్వం స్పందించలేదని చెప్పారు. 


రంగంలోకి దిగిన పోలీసులు..


అందుకే ఆడ, మగా తేడా లేకుండా అందరం కలిసి ఎమ్మెల్సీ ఉంటున్న తమ్మినేని పల్లి గ్రామానికి వచ్చినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ ఇంటి ముందు బైఠాయించారు. ఆయన లేకపోయినప్పటికీ ఫోన్ చేసి మాట్లాడారు. గతంలో ఇచ్చిన హామీలు ఎలాగూ నెరవేర్చలేకపోయారు.. కనీసం ఇప్పుడైనా మాట నిలబెట్టుకోవాలని సూచించారు. పెద్ద ఎత్తున గ్రామస్థులంతా ఎమ్మెల్సీ ఇంటికి వెళ్లిన విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫోన్‌లో చెప్పినట్లుగానే వారం రోజుల్లో ఎమ్మెల్సీ మీ సమస్య తీరుస్తానని నచ్చజెప్పడంతో గ్రామస్థులు వెనుదిరిగారు.