వైఎస్‌ఆర్‌సీపీ(YSRCP) ప్రభుత్వ లోపభూయిష్ట నిర్ణయాలు, అనాలోచిత విధానాలే ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో విద్యుత్ సంక్షోభానికి(Power Crisis) కారణమని జనసేన పార్టీ(Janasena Party) చీప్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఆరోపించారు. పల్లెల్లో 11 నుంచి 14 గంటలు, పట్టణాల్లో 5 నుంచి 8 గంటలు, నగరాల్లో 4 నుంచి 6 గంటలు చొప్పున అనధికార విద్యుత్ కోతలు విధించడంతో జనం అల్లాడిపోతున్నారని అన్నారు. మొబైల్ ఫోన్(Mobile) లైట్ల వెలుగులో ఆస్పత్రుల్లో ఆపరేషన్లు(Operations), ప్రసవాలు(Deliveries) జరగడం చూస్తుంటే విద్యుత్ సంక్షోభం ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతోందన్నారు. 


హైదరాబాద్‌(Hyderabad)లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విద్యుత్ సంక్షోభంపై మాట్లాడిన పవన్ కల్యాణ్‌... రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉండేదన్నారు. 2014 – 19 లో విద్యుత్ కోతల ప్రభావం లేదన్న పవన్.. ఛార్జీల పెంపు జరగలేదని తెలిపార. ఒకటి రెండు సందర్భాల్లో విద్యుత్ ఛార్జీలు పెంచినపుడు వ్యతిరేకత వస్తే ప్రభుత్వం ఉపసంహరించుకుందని గుర్తు చేశారు. 


వైసీపీ అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వం చేసుకున్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు(PPA) పీపీఏలను రద్దు చేసిందన్న పవన్... యూనిట్ రెండు రూపాయలకే గ్రీన్ ఎనర్జీ(Green Energy)ని తీసుకొస్తామని చెప్పి కోల్ ఎనర్జీ()Coal Energyని రూ.20 పెట్టి కొంటోందని ఎద్దేవా చేశారు. ఇలాంటి లోపభూయిష్ట నిర్ణయాల వల్లే విద్యుత్ సంక్షోభం ఏర్పడిందన్నారు. 


ఉచితం అని చెప్పి ఛార్జీలు పెంచారు 


అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని... అల్పాదాయ వర్గాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇస్తామని  చెప్పిన వైసీపీ 57 శాతం ఛార్జీలు పెంచింది అన్నారు పవన్. ఫ్యాను, రెండు లైట్లు, 15 గంటలు టీవీ చూసినా 150 యూనిట్లే ఖర్చు అవుతుందని... మరో 50 యూనిట్లు పెద్ద మనసుతో అదనంగా ఇస్తున్నామని చెప్పారు. ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచి ఇళ్లల్లో ఫ్యాన్లు వేసుకోకుండా చేశారని విమర్శించారు. 


విద్యార్థులకెన్నో ఇక్కట్లు


విద్యార్థులు, పరీక్షలకు సన్నద్దమవుతున్న టైంలో విద్యుత్‌ కోతలు ఇబ్బంది పెడుతున్నాయన్నారు పవన్ కల్యాణ్. పగలంతా తరగతి గదుల్లో ఉండి రాత్రిళ్లు ప్రశాంతంగా నిద్ర లేక ఒత్తిడికి గురవుతున్నారన్నారు. ఇళ్లల్లో కరెంటు లేకపోవడంతో కొందరు రైల్వే స్టేషన్, బస్టాండుల్లో పడుకుంటున్నారని వివరించారు. పరిశ్రమలకు ఇప్పటికే వారాంతంలో ఒక రోజంతా విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారన్నారు. తాజాగా మరో రోజు పవర్ హాలిడే(Power Holiday) ప్రకటించడంతో పరిశ్రమలు వారానికి రెండు రోజులు మూతపడనున్నాయని దీని వల్ల ఉపాధి అవకాశాలు పోతాయన్నారు పవన్. అలాగే నిరంతరం పని చేసే పరిశ్రమలు ఇప్పుడు వాడుతున్న కరెంట్‌లో 50 శాతం మాత్రమే వాడాలనే నిబంధన విధించిందన్నారు. కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన పారిశ్రామికవేత్తలు విద్యుత్ కోతలతో నష్టాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పారిశ్రామిక అభివృద్ధికి విఘాతం కలుగుతుందని...36 లక్షల మంది కార్మికుల ఉపాధిపై ప్రభావం పడే ప్రమాదం ఉందన్నారు. 


సహనాన్ని పరీక్షించకండి 


వ్యక్తిగత అజెండాతో జనసేన పార్టీని స్థాపించలేదన్న పవన్... ప్రజలు బాగుండాలి, వారిని పల్లకీ ఎక్కించాలనే ఉద్దేశంతోనే పార్టీని ప్రారంభించానన్నారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యల నుంచి పెరిగిన విద్యుత్ ఛార్జీల వరకు ప్రజల పక్షానే పోరాటం చేస్తున్నామన్నారు. ఉద్యోగులు రోడ్డెక్కడానికి, కౌలు రైతుల ఆత్మహత్యలకు కారణం మీ విధానాలేనన్న పవన్‌ ప్రభుత్వ విధానాలు, పాలసీల గురించి మాట్లాడితే వ్యక్తిగతంగా రాక్షసుడు, దుర్మార్గుడు అని దూషిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా దూషణలకు దిగితే వాటిని ఎలా ఎదుర్కోవాలో బాగా తెలుసన్న జనసేనాని నోటికి వచ్చినట్లు మాట్లాడి సహనాన్ని పరీక్షించ వద్దని హెచ్చరించారు. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల రద్దు నుంచి పరిశ్రమలకు పవర్ హాలీడే ప్రకటించే వరకు వైసీపీ అనాలోచిత విధానాలతో ఎలా మోసం చేస్తోందో ప్రజల్లోకి తీసుకెళ్లాలని జనసైనికులకు సూచించారు.