AP Latest News in Telugu: Daggubati Purandeswari: ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిశారు. నేడు (మే 31) బీజేపీ నేతలతో కలిసి పురందేశ్వరి విజయవాడలోని రాజ్ భవన్ కు వెళ్లారు. ఏపీ ఆర్థిక స్థితిగతులపైన వివరాలు బహిరంగ పర్చాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్ ను పురందేశ్వరి కోరారు. ఈ మేరకు వినతి పత్రం కూడా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గవర్నర్ ను కలిసిన వారిలో పురందేశ్వరితో పాటుగా కాపు రామచంద్రారెడ్డి, సాధినేని యామిని శర్మ, బిట్ర శివన్నారాయణ, పాతూరి నాగభూషణం తదితరులు ఉన్నారు.


లేఖలో మరిన్ని అంశాలు
పురంధేశ్వరి లేఖలో ఇంకొన్ని అంశాలను కూడా ప్రస్తావించారు. ‘‘మొత్తం అవుట్ స్టాండింగ్ ఆర్బీఐ లిస్టు ప్రకారం తెచ్చిన అప్పులు. కార్పొరేషన్ల ద్వారా వాటి కోసం తెచ్చిన అప్పుల మొత్తం వివరాలు. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిలు మొత్తం ఎంత? రాష్ట్ర ప్రభుత్వం ఆస్తులు తాకట్టు పెట్టి తెచ్చిన అప్పులు మొత్తం ఎంత? రాష్ట్ర ప్రభుత్వం సావనీర్ గ్యారెంటీ ఇచ్చి తెచ్చిన అప్పులు ఎన్ని? ఎన్నికల అనంతరం కాంట్రాక్టర్లకు చెల్లించిన బిల్లుల వివరాలు బహిరంగ పర్చాలి. 


ప్రభుత్వ ఉద్యోగులు ఇతర ప్రావిడెంట్ ఫండ్స్ నుంచి ఆర్థిక సంస్థల నుంచి తెచ్చిన అప్పుల వివరాలు తెలపాలి. ప్రభుత్వ ఉద్యోగులకు TA, DA బకాయిలు ఎంత ఉన్నాయి. ప్రతి సంవత్సరం రీపేమెంట్‌కు అసలు ప్లస్ వడ్డీ కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఎంత కట్టాల్సి ఉంది. సివిల్ సప్లయర్స్ కార్పొరేషన్‌కు, డిస్కంలకు, పవర్ సప్లయర్స్‌లకు చెల్లించాల్సిన బకాయిలు ఎంత ఉన్నాయి. నిధులు రిలీజ్ చేయాల్సి ఉన్నప్పటికీ, అతి కొద్ది మాత్రమే ఇచ్చి మొత్తం విడుదల చేసినట్లుగా ప్రకటనలు చేస్తూ.. బటన్ నొక్కిన వారికి కూడా పాక్షికంగా చెల్లించిన విధానం. ఈ విధంగా ఈ సంవత్సరం సంక్షేమ పథకాలకు ఎంత నిధులు చెల్లించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వంపై ఎన్ని కేసులు ఉన్నాయి. కోర్టులు తీర్పు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం అమలుపరచని కేసులు ఎన్ని ఉన్నాయి. ఈ వివరాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ జవహర్ రెడ్డి ద్వారా తెప్పించాలి’’ అని పురందేశ్వరి గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కోరారు.