YS Sharmila Comments: కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెమ్మ‌సాని మాట‌లు ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కాన్ని శాశ్వ‌తంగా లేకుండా చేసేలా ఉన్నాయ‌ని ఏపీసీసీ చీఫ్ ష‌ర్మిల అనుమానం వ్య‌క్తం చేశారు. కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చే ఆయుష్మాన్ భార‌త్ కార్డులు ప్ర‌తి ఒక్క‌రూ తీసుకోవాల‌ని చెప్ప‌డం ఈ అనుమానాల‌కు బ‌లం చేకూర్చేలా ఉంద‌ని ఆమె పేర్కొన్నారు. కేంద్రం అమ‌లు చేస్తున్న ఆయుష్మాన్ భార‌త్ ప‌థ‌కానికి కూడా ఆరోగ్య‌శ్రీ ప‌థ‌క‌మే ప్రేర‌ణ అని ఆమె పేర్కొన్నారు. ఎక్స్ వేదిక‌గా కూట‌మి ప్ర‌భుత్వంపై ఆమె విమ‌ర్శ‌లు గుప్పించారు. పేద ప్ర‌జ‌ల‌కు సంజీవ‌నిగా నిలిచిన ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కాన్ని నిర్వీర్యం చేయ‌బోతున్నారా అంటూ సీఎం చంద్ర‌బాబును ప్ర‌శ్నించారు. మంత్రి మాట‌లు చూస్తుంటే ప‌థ‌కానికి పొగ‌పెట్టేలా ఉన్నాయ‌ని ఆమె అభిప్రాయం వ్య‌క్తం చేశారు. త‌న పోస్టులో కేంద్ర మంత్రి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్‌, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్‌, ఏపీ బీజేపీని, ఏపీ టీడీపీని ట్యాగ్ చేశారు. గ‌త ప్ర‌భుత్వ బ‌కాయిలు రూ. 1600 కోట్లు వెంట‌నే విడుద‌ల చేసి ఆరోగ్య శ్రీ సేవ‌ల‌ను వెంట‌నే పున‌రుద్ధరించాల‌ని ఆమె ప్ర‌భుత్వాన్ని కోరారు. 


ష‌ర్మిల్ ట్వీట్ ఇదీ


‘‘ఆరోగ్యశ్రీ అమలుపై కేంద్రమంత్రి పెమ్మసాని చేసిన వాఖ్యలు అనుమానాలు కలుగుతున్నాయి. ఆయుష్మాన్ భారత్ కార్డులు ప్రతి ఒక్కరూ తీసుకోవాలి అంటే ఇక రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ లేనట్లేనా ? ఆయుష్మాన్ పథకమే ఇక అమలు చేయాలి అనుకుంటున్నారా ? ఆరోగ్యశ్రీ ని నిలిపివేసే ఆలోచన మీ కూటమి సర్కార్ చేస్తుందా ? అందుకే పథకానికి నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేస్తున్నారా ? పెండింగ్ లో ఉన్న బకాయిల చెల్లింపుపై ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు ? బిల్లులు చెల్లించే మీ ప్రభుత్వమే బిల్లులు రావడం లేదు అని చెప్పే సమాధానం దేనికి సంకేతం ? ఆయుష్మాన్ కింద కేంద్రం ఇచ్చే 5 లక్షలతోనే సరిపెడితే మరి రాష్ట్రం ఇచ్చేది ఏమి లేదా ? ఆరోగ్య శ్రీ కింద ఇక వైద్యం లేదని చెప్పకనే చెప్తున్నారా ? గత YCP ప్రభుత్వం 16 వందల కోట్లు బకాయిలు పెడింగ్ లో పెడితే.. ఆసుపత్రులు కేసులను తీసుకోవడమే మానేశాయి. ఇప్పుడు మీ మంత్రుల మాటలు పథకం అమలుకే పొగ పెట్టేలా ఉన్నాయి. దీనికి @ncbn చంద్రబాబు గారు, @PawanKalyan పవన్ కల్యాణ్ గారు వెంటనే సమాధానం చెప్పాలి. ఆరోగ్యశ్రీ  డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశ పెట్టిన అద్భుత పథకం.పేద కుటుంబాలకు పునర్జన్మ ఇచ్చిన పథకం. ఎంతటి జబ్బు చేసినా ప్రాణానికి భరోసా ఇచ్చిన పథకం. కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్ కి కూడా ఆదర్శం ఆరోగ్యశ్రీనే. ఇలాంటి పథకాన్ని నీరుగార్చాలని చూస్తే సహించం. ఆరోగ్యశ్రీ పై వెంటనే కూటమి సర్కార్ @JaiTDP @JanaSenaParty @BJP4Andhra క్లారిటీ ఇవ్వాలని, పెండింగ్ లో ఉన్న 16 వందల కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని, పథకానికి ఏ లోటు లేకుండా అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం’’ అని షర్మిల ట్వీట్ చేశారు.


నిన్న కేంద్రం మంత్రి పెమ్మ‌సాని ఆరోగ్యశ్రీ ప‌థ‌కం అమ‌లు గురించి చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిని గురించి మాట్లాడుతూ ఆయుష్మాన్ భార‌త్ ప‌థ‌కాన్ని వినియోగించుకోవాల‌ని చెప్ప‌డంపై నిర‌స‌న‌లు వ్య‌క్తం అవుతున్నాయి. ఆరోగ్య‌శ్రీ గురించి ఆయ‌న మాట్లాడిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌కు దారితీసింది. ప‌థ‌కం అమలు జ‌రుగుతుందా లేదా అని కూడా ఎక్స్‌లో  ప‌లువురు పోల్స్  నిర్వ‌హిస్తున్నారు.