Ongole Latest News: రన్నింగ్ ట్రైన్ నుంచి పడిపోయిన 9 ఏళ్ల బాలిక.. రైల్వే సిబ్బంది సాహసం..ఒంగోలులో ఏం జరిగిందంటే?
Ongole Latest News: ఒంగోలులో ఎక్స్ ప్రెస్ ట్రైన్ నుం 9ఏళ్ల బాలిక కిందపడిపోయింది. వెంటనే స్పందించిన మరో ట్రైన్ సిబ్బంది పాపను కాపాడారు.

Ongole Latest News: రన్నింగ్ ట్రైన్ నుంచి పడిపోయిన 9ఏళ్ల బాలికను అత్యంత వేగంగా సాహసోపేతంగా కాపాడారు రైల్వే సిబ్బంది. నిన్న (బుధవారం) 25.02.2026 అర్ధరాత్రి ట్రైన్ నెంబర్ 17248 ధర్మవరం నుంచి నరసాపురం వెళ్లే ఎక్స్ప్రెస్ ట్రైన్ సూరారెడ్డి పాలెం స్టేషన్ దాటాక ఒంగోలు రైల్వే స్టేషన్కు జస్ట్ రెండు కిలోమీటర్ల దూరంలో ఘటన జరిగింది. అర్ధ రాత్రి 23.53నిమిషాలకు 9ఏళ్ల పాప ఆ ఎక్స్ ప్రెస్లో నుంచి ప్రమాదవశాత్తూ పడిపోయింది. దానితో షాక్ తిన్న బాలిక తల్లిదండ్రులు ట్రైన్ రాత్రి 12:03కి ఒంగోలు చేరగానే స్టేషన్లోని RPF పోలీసులకు రైల్వే అధికారులకు విషయం చెప్పారు.
బాలికను ఎలా కాపాడారు అంటే..!
బాలిక ట్రాక్పై పడిపోయిన విషయం తెలియగానే ఆ వెనకాలే వస్తున్న ట్రైన్ నంబర్ 12761 తిరుపతి -కరీంనగర్ ట్రైన్ డ్రైవర్ (లోకో పైలట్ )కు సమాచారం అందించారు. దానితో ఆయన ఒంగోలు స్టేషన్కు కాస్త ముందు ఇంటర్ మీడియట్ బ్లాక్ సిగ్నల్ దగ్గర బాలికను గమనించి ట్రైన్ ఆపేశారు. ట్రైన్ ఇంజన్ వెనకాలే ఉన్న జెనరల్ బోగీలో ఉన్న ప్రయాణికులు కూడా సాయం వచ్చి పాపను రక్షించారు. ఈలోపు ఒంగోలు స్టేషన్ నుంచి ట్రాక్ఫై బాలికను వెతుక్కుంటూ వచ్చిన RPF, GRP పోలీసులు పాపను తీసుకుని వెళ్ళారు. ఆమె ఎడమ చేతికి, కాళ్ళకు స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రాథమిక చికిత్స చేసి ఒంగోలు స్టేషన్ మాస్టర్ సమక్షంలో బాలికను ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు.
రైల్వేకు థాంక్స్ చెప్పిన బాలిక తల్లిదండ్రులు
సకాలంలో తమ కుమార్తెను రక్షించి తమకు అప్పగించిన రైల్వే అధికారులకు ఆమె తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రాథమిక చికిత్స అనంతరం బాలికను ఆమె తల్లిదండ్రులను ట్రైన్ నెంబర్ 22826 చెన్నై -షాలిమర్ ఎక్స్ప్రెస్లో వారు వెళ్లవల్సిన విజయవాడకు సురక్షితంగా పంపినట్టు విజయవాడ డివిజనల్ రైల్వే PRO నుశ్రత్ తెలిపారు.























