Minister Perni Nani : పశ్చిమ గోదావరి జిల్లా(West Godavari District) విభజన వైసీపీ(Ysrcp)లో పెద్ద దుమారం రేపుతోంది. భీమవరాన్ని(Bhimavaram) జిల్లా కేంద్రంగా ప్రకటించడంతో నర్సాపురం వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు(Kottapalli Subbarayudu), ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు(Mla Mudunoori Prasadaraju) మధ్య రాజకీయ వైరం నడుస్తోంది. నర్సాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని అఖిలపక్షం నిరసలు చేస్తుంటే ఎమ్మెల్యే ప్రసాదరాజు స్పందించలేదని కొత్తపల్లి సుబ్బారాయుడు ఫైర్ అయ్యారు. నర్సాపురం ఎమ్మెల్యేగా ముదునూరి ప్రసాదరాజును గెలిపించినందుకు తనను తాను చెప్పుతో కొట్టుకున్నారు. ఈ ఘటనపై మంత్రి పేర్ని నాని(Minister Perni Nani) మండిపడ్డారు. 



సుబ్బారాయుడిపై మంత్రి పేర్ని నాని ఆగ్రహం 


వైసీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు తీరుపై మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాల విభజనపై ఏమైనా అభ్యంతరాలుంటే సీఎం జగన్(CM Jagan), ప్రభుత్వానికి తెలియజేయాలని సూచించారు. ఎమ్మెల్యే ప్రసాదరాజును గెలిపించుకున్నందున చెప్పుతో కొట్టుకుని నిరసన తెలపడాన్ని మంత్రి పేర్ని నాని తప్పుబట్టారు. పార్టీలు మారినప్పుడల్లా సుబ్బారాయుడు చెప్పులతో కొట్టుకుంటున్నారని పేర్ని నాని విమర్శించారు. ఎంతటి వారినైనా క్రమశిక్షణారాహిత్యాన్ని ఉపేక్షించమని హెచ్చరించారు. ప్రసాదరాజును రాజకీయంగా పతనం చేసేందుకే కొత్తపల్లి సుబ్బారాయుడు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మంత్రి ఆరోపించారు. 


ఏడు నియోజకవర్గాలకు అందుబాటులో భీమవరం 


కొత్తపల్లి సుబ్బారాయుడు మంత్రిగా, ఇతర బాధ్యతాయుతమైన పదవులు చేశారని మంత్రి పేర్ని నాని అన్నారు. సుదీర్ఘకాలం పాటు ప్రజాజీవితంలో ఉన్న ఆయన ఇలా మాట్లాడటం సరికాదన్నారు. నర్సాపురం(Narsapuram) జిల్లా చేస్తూ భీమవరాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ విషయంలో ఎమ్మెల్యేలకు సంబంధం ఏం ఉండదన్నారు. ఏడు నియోజకవర్గాలకు అందుబాటులో ఉంటుందని భీమవరాన్ని జిల్లా కేంద్రంగా ఎంపిక చేశామని మంత్రి అన్నారు. సుబ్బారాయుడికి ఏమైనా అభ్యంతరాలుంటే ముఖ్యమంత్రిని కలిసి వివరించాలని సూచించారు. ప్రసాదరాజుని రాజకీయంగా అడ్డు తొలగించుకుందామని ఆలోచన చేస్తే దానిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. మనకు నచ్చనప్పుడల్లా చెప్పుతో కొట్టుకోవాలంటే సుబ్బారాయుడు చాలా సార్లు చెప్పుతో కొట్టుకోవాలని మంత్రి పేర్ని నాని అన్నారు. 


అసలేం జరిగింది? 


మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ( Kothapalli Subbarayudu ) తన చెప్పుతో తాను కొట్టుకున్నారు. నర్సాపురం వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుకు మద్దతిచ్చి గెలిపించి తప్పు చేశానని ప్రాయశ్చితంగా తన చెప్పుతో ( Slipper ) తాను కొట్టుకున్నారు. కొత్తపల్లి సుబ్బారాయుడు ఇలా ఆవేశ పడటానికి కారణం జిల్లాల విభజన. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జిల్లాలను విభజిస్తున్న ఏపీ ప్రభుత్వం జిల్లా కేంద్రాల విషయంలో మాత్రం మార్పులు  చేసింది. నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా  మారుస్తున్న ప్రభుత్వం.. జిల్లా కేంద్రంగా మాత్రం భీమవరంను ప్రకటించింది. దీంతో రాజకీయంగా గగ్గోలు ప్రారంభమయింది. 


నర్సాపురాన్నే జిల్లా ( Narsa puram ) కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాలు జరుగుతున్నాయి. ఎలా చూసినా నర్సాపురం జిల్లా కేంద్రమే కరెక్ట్ అన్న వాదన పలువురు వినిపిస్తున్నాయి. బ్రిటిష్‌, డచ్‌ హయాం నుంచి సబ్‌ డివిజన్‌గా ఉన్న నరసాపురం పట్టణాన్నే జిల్లా కేంద్రంగా ప్రకటించాలని అన్ని పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు  ( Mudunoori Prasada Raju ) పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకుంటే అలా అన్నట్లుగా ఉన్నారు.   దీంతో  మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు జిల్లా కేంద్రం సాధన ఉద్యమాన్ని యాక్టివ్‌గా  నడుపుతున్నారు. 


ప్రస్తుతం వైఎస్ఆర్‌సీపీలోనే ఉన్న కొత్తపల్లి సుబ్బారాయుడు  టీడీపీ ( TDP ) , జనసేన ( Janasena ) నేతల్ని కూడా ఉద్యమం చేస్తున్నారు.  అందర్నీ కలుపుకుని నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో అభ్యంతరాల పరిశీలన గడువు కూడా పూర్తవుతోంది. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనలేదు. దీంతో బుధవారం నర్సాపురంలో పెద్ద ర్యాలీ నిర్వహించారు. సభ కూడా పెట్టారు. సభలో మాట్లాడుతూనే హఠాత్తుగా తన చెప్పును తీసుకుని కొట్టుకున్నారు.