రాజమండ్రి సెంట్రల్ జైలులో ఓ ఖైదీ డెంగీ వల్ల చనిపోవడం పట్ల చంద్రబాబు భద్రతపై టీడీపీ నేతలు ప్రశ్నలు లేవనెత్తుతున్న సంగతి తెలిసిందే. దీనిపై వరుసగా వైఎస్ఆర్ సీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా టీడీపీ నేతలను ఉద్ధేశించి వైఎస్సార్‌ సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. టీడీపీ నేతల వ్యవహరం చూస్తుంటే వారే జైల్లో చంద్రబాబుకు హానీ తలపెడతారన్న అనుమానం కలుగుతోందని విజయసాయి రెడ్డి అన్నారు. బాబుకు వెన్నుపోటు పొడిచి ఆయన పదవిని కొట్టేయాలనే తాపత్రయం కొందరు టీడీపీ నేతల్లో కనిపిస్తోందని అన్నారు. టీడీపీ నేతలతో జైలు అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.






‘‘మీ వ్యవహారం చూస్తుంటే మీరు, మీ పార్టీ వారే... జైల్లో చంద్రబాబు గారికి హాని తలపెడతారన్న అనుమానం కలుగుతోంది. బాబుకు వెన్నుపోటు పొడిచి ఆయన పదవిని కొట్టెయ్యాలన్న కసి  కొందరు టీడీపీ నాయకుల్లో కనిపిస్తోంది. టీడీపీ వారితో జైలు అధికారులు  అప్రమత్తంగా ఉండాలి’’ అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.


మరో పోస్ట్ చేస్తూ.. ‘‘వైఎస్ఆర్ సీపీ గుర్తు ఫ్యాన్ అయినంత మాత్రాన జైలులో ఫ్యాన్ వాడరాదన్న నియమం ఏమీ లేదు. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఫ్యాన్ తీసేసి నాకు ఏసీ కావాలని పట్టుబట్టినా జైలు నిబంధనలు అందుకు అనుమతించవు. స్విచ్ వేయకుండా ఫ్యాన్ తిరగడం లేదంటే ఎలా?’’ అని మరో పోస్ట్ చేశారు.






వైఎస్ఆర్ సీపీ ఎంపీ నందిగాం సురేష్ వ్యాఖ్యలు ఇవీ 


‘‘చంద్రబాబుకు హాని చేసే ఉద్దేశం, ఆలోచన, అవసరం మాకు ఎవరికీ లేదు. హాని చేసే ఉద్దేశం ఉంటే గింటే మీకే ఉండాలి. గతంలో చంద్రబాబు కూడా వెన్నుపోటుతో అధికారం చేజిక్కించుకున్నారు. ఇప్పుడు తండ్రి నుంచి అలాగే అధికారం లాక్కోవాలని లోకేశ్ అనుకుంటున్నారేమో. తండ్రి ఆలోచనలే కొడుక్కి వచ్చి ఉంటాయి కదా? జైల్లో ఉన్న బాబును అడ్డు తొలగించుకుని పార్టీని లాక్కుందాం అనుకుంటున్నారేమో. జైళ్ల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలి. అసెంబ్లీలో బాలకృష్ణ హావభావాలు ఎంత నీచంగా, అసహ్యంగా ఉన్నాయో చూడండి. బూతుల హావభావాలు, వ్యాఖ్యలు చేస్తున్నారు. లోకేశ్ ఢిల్లీలో ఎందుకు దాక్కున్నారు? ఆంధ్రకు వెళ్తే అరెస్ట్ చేస్తారని భయపడుతున్నారు. చంద్రబాబు హాని జరిగితే టీడీపీ వల్లనే తప్ప ఇంకెవరూ కారణం కారు. సూట్ కేసులు మోసిన అంశంలో లోకేశ్ కూడా ఉన్నారు. తప్పు చేశారు కాబట్టే భయపడుతున్నారు.’’ అని ఎంపీ నందిగాం సురేష్ వ్యాఖ్యానించారు.