New investments for AP :  ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు  వియత్నాంకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ విన్ ఫాస్ట్ ఆసక్తి చూపిస్తోంది. ఆ కంపెనీ  ప్రతినిధి బృందం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు.  విన్ ఫాస్ట్ సీఈవో ఫామ్ సాన్ చౌ, ఆ సంస్థ ప్రతినిధులు సీఎం చంద్రబాబుతో చర్చలు జరిపారు. విన్ ఫాస్ట్ కంపెనీకి అనువైన భూములను పరిశీలించాల్సిందిగా పరిశ్రమల శాఖను ఆదేశించానని వివరించారు. విన్ ఫాస్ట్ సంస్థతో విజయవంతమైన భాగస్వామ్యం కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు.

  





 


విన్ ఫాస్ట్... వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల తయారీ సంస్థ  .   ఏపీలో విద్యుత్ ఆధారిత వాహనాలు, బ్యాటరీల తయారీ పరిశ్రమ స్థాపించాలని విన్ ఫాస్ట్ సంస్థ ఆసక్తిగా ఉంది.                  


విన్ ఫాస్ట్ నిజానికి తమిళనాడులో ప్లాంట్ పెట్టాలనుకుంది. తుత్తుకూడిలో శంకుస్థాపన కూడా చేశారు. కానీ తర్వాత నిర్మాణం ముందుకు సాగలేదు. ఈవీ వాహనాల తయారీలో ఎంతో పేరెన్నిక గన్న విన్ ఫాస్ట్ భారత్ మార్కెట్ పై చాలా కాలంగా కసరత్తు జరుపుతోంది. ఇప్పటికే   విన్ ఫాస్ట్ బ్రాండ్ కార్లను ఇండియాలో టెస్టింగ్ చేస్తున్నారు.  ఈ కంపెనీ మిడ్-సైజ్ ఎస్‍యూవీ ఇండియాలో టెస్టింగ్ చేస్తున్నట్లుగా కొన్ని ఆటోమోబైల్ న్యూస్ పోర్టళ్లు  రిపోర్టు చేశాయి.                            
 
 ప్రస్తుతం వియత్నాం ,  ఇండోనేషియాలో  విన్ ఫాస్ట్ ఈవీలు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి.  ఈ కార్లు   కేవలం 9 సెకన్లలో 0-100కెఎంపిహెచ్ వేగాన్ని అందుకుంటాయి. ఈవీల్లో ఇది అత్యుతమైన సామర్థ్యమని అనుకోవచ్చు.  కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్, హోండా ఎలివేట్ ,  ఎంజి ఆస్టర్ వంటి మోడల్స్ తో పోటీ పడేలా కార్లను సిద్ధం చేస్తుంది.  


ఆటోమోబైల్ రంగంలో ఆంధ్రప్రదేశ్ కు మంచి బ్రాండ్ నేమ్ ఉంది. కియా కంపెనీ ఉత్పత్తిని రికార్డు స్థాయిలో ప్రారంభమయ్యేలా చేయడంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపించింది. ఈ క్రమంలో విన్ ఫాస్ట్ తో కూడా చర్చలు ఫలప్రదంగా ముగిస్తే.. ప్లాంట్ నిర్మాణానికి ముందుకు వచ్చే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు.