రెండేళ్ళ తర్వాత శ్రీనివాసుడి దర్శనార్ధం అధిక సంఖ్యలో తిరుమలకు విచ్చేసిన భక్తులతో ఏడు కొండలు కిటకిట లాడుతున్నాయి. వారాంతరాలు కావడంతో కొండపై ఊహించని రీతిలో‌ ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది.  దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మొదలుకొని, క్యూలైన్స్ పూర్తిగా భక్తులతో నిండి పోయింది. 


విశేష సంఖ్యలో వచ్చిన భక్తుల గోవింద నామస్మరణలతో శేషాచలం మారుమోగుతోంది. శ్రీ వేంకటేశ్వరుడి దర్శనార్ధం నిత్యం వేలాది సంఖ్యలో భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి తిరుమలకు చేరుకుంటారు. ఇలా చేరుకున్న భక్తులు క్షణకాలం పాటు జరిగే స్వామి వారి దర్శనం కోసం భక్తులు గంటలు, రోజులు తరబడి వేచి ఉండి మరి స్వామి ఆశీస్సులు పొందుతుంటారు. కోవిడ్ పూర్తి స్ధాయిలో అదుపులోకి రావడంతో టిటిడి సామాన్య భక్తులకు పెద్ద పీఠ వేస్తూ టిక్కెట్లు లేకుండానే భక్తులను కొండకు అనుమతిస్తూ వస్తుంది. ఈక్రమంలో గత కొద్ది నెలలుగా భక్తుల సంఖ్య భారీగా తిరుమలలో కొనసాగుతూ వస్తుంది. 


ప్రస్తుతం పదోవ తరగతి పరీక్షలు పూర్తి కావడంతో తిరుమల యాత్రకు విచ్చేసిన భక్తులతో తిరుమలగిరులు నిండి పోయాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1,2 లోని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండి పోవడంతో సర్వదర్శనం క్యూలైన్ లేపాక్షి సర్కిల్ దాటుకుని షాపింగ్ కాంప్లెక్స్ మీదుగా పాత అన్నదాన సత్రం వరకూ చేరింది. పదోవ తరగతి పరీక్షలు పూర్తి కావడం, వారంతరాలు కావడంతో భక్తుల సంఖ్య ఏడుకొండలపై మరింత పెరిగే అవకాశం ఉంది. 


రెండేళ్ళ కాలంలో కోవిడ్ పూర్తి స్ధాయిలో తగ్గడంతో పాత అన్నదానం సత్రం వరకూ రావడం ఇదే మొదటిసారి. వాతావరణంలో మార్పు కారణంగా తిరుమలలో తేలికపాటి చిరుజల్లులు కురుస్తున్నా భక్తులు మాత్రం ఏమాత్రం క్యూలైన్స్ నుంచి బయటక రావడం లేదు. భక్తుల రద్దీ పెరగడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, క్యూలైన్స్ వద్ద అధికారులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. 


భక్తుల అనూహ్యం రద్దీపై వివిధ విభాగాధిపతులతో టిటిడి ఈవో ధర్మారెడ్డి సెట్స్ ద్వారా ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తూ ఏర్పాట్లపై ఆరా తీస్తున్నారు. క్యూలైన్స్ వేచి ఉన్న సామాన్య భక్తుల కోసం అన్నప్రసాదం, తాగునీరు, పాలు వంటి సౌఖర్యాలు ఏర్పాట్లు చేశారు టిటిడి అధికారులు. మరికొద్ది రోజులపాటు భక్తుల రద్దీ ఏడుకొండలపై కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనాకు వచ్చారు. ఈ క్రమంలో సామాన్య భక్తులకు అవసరం అయ్యే ఏర్పాట్లపై అధికారులు దృష్టి పెట్టారు. 


భక్తుల సంఖ్య పెరగడంతో భక్తుల రద్దీ ప్రదేశాలైన అన్నదాన సత్రం, లడ్డూ వితరణ కేంద్రం, అతిధి గృహాలు, వసతి భవనాలు, పిఏసీ-1,2,3,4,5 వద్ద పోలీసులు భద్రతా ఏర్పాట్లు కట్టిదిట్టం చేశారు. మరోవైపు చిరుజల్లు కురుస్తుండడంతో ఘాట్ రోడ్డులో ప్రయాణించే భక్తులకు టిటిడి విజిలెన్స్ సిబ్బంది సూచనలు చేస్తున్నారు.