Pavithrotsavam in Tirumala: తిరుపతి : తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. సోమవారం 08-08-2022న స్వామి వారిని 74,830 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక 39,405 మంది తలనీలాలు సమర్పించగా, హుండీ ద్వారా 4.79 కోట్లు ఆదాయం లభించింది. ఇక సర్వదర్శనానికి 29 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి వుండడంతో పాటుగా బయట క్యూలైన్స్ లో 2 కిలోమీటర్ల మేర భక్తులు వేచి‌ ఉన్నారు. ఇక శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక ప్రవేశ దర్శనంకు రెండు గంటల సమయం పడుతుంది. నేడు ఆలయంలో రెండోవ రోజు పవిత్రోత్సవాలు సందర్భంగా దర్శన వేళల్లో మార్పులు చేసింది టీటీడీ. దీంతో దర్శనం ఆలస్యం అయ్యే అవకాశం ఉందని ఆలయ అధికారులు ప్రకటించారు.
శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు
శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు. ఇందులో‌ భాగంగా మంగళవారం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారముకు తెరిచిన అర్చకులు. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు. అనంతరం  తోమాల, అర్చన సేవలు నిర్వహించిన అర్చకులు. ప్రాతఃకాల ఆరాధనలో‌ భాగంగా స్నపన మండపంలో శ్రీకొలువు శ్రీనివాసమూర్తిని వారి సమక్షంలో దర్భార్ నిర్వహించారు. శ్రీవారికి పంచాంగ శ్రవణం,హుండీ జనాకర్షణ విన్నవించి, బెల్లంతో  కలిపిన నువ్వుల పిండిని స్వామి వారిని నైవేద్యంగా సమర్పించారు. నవనీత హారతి సమర్పించి అనంతరం శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలో వేంచేపు చేశారు. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదనలో అన్నప్రసాదం, లడ్డూ, వడలు స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు. 
శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు
సన్నిధిలో శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం సాత్తుమొర నిర్వహించిన అనంతరం సర్కారు హారతి అందించి వి.ఐ.పి భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పించింది టీటీడీ. అనంతరం స్వామి వారికి రెండోవ గంట నివేదన, బలి జరిపిన అనంతరం ప్రతి "మంగళవారం" రోజు నిర్వహించే "అష్టదళపాద పద్మరాధన" సేవను పవిత్రోత్సవాల కారణంగా టీటీడీ రద్దు చేసింది.‌ సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనంకు అనుమతించారు. ఇక రెండోవ రోజు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాల కార్యక్రమంను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు.‌ ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో ప్రతి ఏడాది మూడు రోజుల పాటు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. 


ఈ నెల 8వ తారీఖు నుండి మొదలైన పవిత్రోత్సవాలు మూడు రోజుల పాటు కొనసాగనుంది. ఇందులో భాగంగా, ఈ ఉత్సవంలో భాగంగా రెండోవ రోజు ఆల‌యంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వ‌హిస్తారు. అటుతరువాత రెండోవ రోజు పవిత్ర సమర్పణ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించనున్నారు. ఇక సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి భ‌క్తుల‌కు ద‌ర్శన‌ం ఇవ్వనున్నారు. 


స్వామి వారి ఉత్సవ మూర్తులు శ్రీవారి ఆలయం చేరుకున్న అనంతరం సర్వదర్శనం నిలుపుదల చేసి శ్రీవారికి రాత్రి కైంకర్యాలు ప్రారంభిస్తారు అర్చకులు. ఈ కైంకర్యాల్లో‌ భాగంగా రాత్రి తోమాల, అర్చన, రాత్రి గంట, తిరువీసం ,ఘంటాబలి నిర్వహిస్తారు. తిరిగి సర్వదర్శనం భక్తులను స్వాము వారి దర్శనంకు అనుమతించి, సర్వదర్శనం పూర్తి అయిన తరువాత ఆగమోక్తంగా శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవను నిర్వహిస్తారు అర్చకులు. ఇక ప‌విత్రోత్స‌వాల్లో భాగంగా నేడు అష్ట‌ద‌ళ పాద‌ ప‌ద్మారాధ‌న‌తో పాటుగా, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను ఇదివరకే రద్దు చేసింది టీటీడీ.