తిరుమలలో‌ భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారం 18-08-2022 రోజున 70,674 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారికి 35,930 మంది తలనీలాలు సమర్పించగా, 4.53 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు. ఇక సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 25 కంపార్ట్మెంట్లు భక్తులతో‌ నిండి పోవడంతో స్వామి వారి సర్వ దర్శనంకు 10 గంటల సమయం‌ పడుతుంది.‌ ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనంకు రెండు గంటల సమయం పడుతుంది. ప్రతి శుక్రవారం ఆకాశ గంగ జలంతో శ్రీవేంకటేశ్వరుడికి అభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కలియుగ దైవం శ్రీనివాసుడి తిరుమల పుణ్యక్షేత్రం గోవింద నామ స్మరణలతో‌ మారుమోగుతోంది
ఆకాశ జలాలతో శ్రీ వేంకటేశ్వరుడికి అభిషేక సేవ
శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు. శుక్రవారం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారముకు తెరిచిన అర్చకులు. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు. అనంతరం ఆకాశ జలాలతో శ్రీ వేంకటేశ్వరుడికి అభిషేక సేవను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.‌ తోమాల, అర్చన సేవలు నిర్వహించిన అర్చకులు.. ప్రాతఃకాల ఆరాధనలో‌ భాగంగా స్నపన మండపంలో శ్రీకొలువు శ్రీనివాసమూర్తిని వారి సమక్షంలో దర్భార్ నిర్వహించారు. శ్రీవారికి పంచాంగ శ్రవణం, హుండీ జనాకర్షణ విన్నవించి, బెల్లంతో కలిపిన నువ్వుల పిండిని స్వామి వారిని నైవేద్యంగా సమర్పించారు. నవనీత హారతి సమర్పించి అనంతరం శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలో వేంచేపు చేసారు. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదనలో అన్నప్రసాదం, లడ్డూ, వడలు స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు. 


ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత వసంతోత్సవం సేవలు 
శ్రీవారి సన్నిధిలో శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం సాత్తుమొర నిర్వహించిన అనంతరం సర్కారు హారతి అందించి ప్రోటోకాల్ పరిధిలోని భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పించింది టీటీడీ. అనంతరం స్వామి వారికి రెండోవ గంట నివేదన, బలి జరిపి సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతించారు. శ్రీవారి ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారిని విమాన ప్రదక్షణగా సంపంగి ప్రాకారంలోనికి వేంచేపు చేసి మధ్యాహ్నం 12 గంటలకు నిత్య కళ్యాణోత్సవంను నేత్ర పర్వంగా నిర్వహిస్తారు అర్చకులు. అటుతరువాత ఆలయంలోని అద్దాల మండపంలో డోలోత్సవం సేవను నిర్వహించి,‌ ఉత్సవ మూర్తులను ఆలయ వెలుపల ఉన్న వైభోత్సవ మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్ళి ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత వసంతోత్సవం సేవలు నిర్వహిస్తారు అర్చకులు. 
ఊంజల్ సేవ
నేటి సాయంకాలం సహస్రదీపాల కొలువులో ఊంజల్ సేవ నిర్వహించిన తరువాత నిత్యోత్సవం నిర్వహిస్తారు అర్చకులు. సర్వదర్శనం నిలుపుదల చేసిన అనంతరం శ్రీవారికి రాత్రి కైంకర్యాలు ప్రారంభిస్తారు అర్చకులు. ఈ కైంకర్యాల్లో‌ భాగంగా రాత్రి తోమాల, అర్చన, రాత్రి గంట, తిరువీసం ,ఘంటాబలి నిర్వహిస్తారు. తిరిగి సర్వదర్శనం భక్తులను స్వాము వారి దర్శనంకు అనుమతించి, సర్వదర్శనం పూర్తి అయిన తరువాత ఆగమోక్తంగా శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవను నిర్వహిస్తారు అర్చకులు.
ఈ రోజుల్లో సిఫార్సు లేఖలను టీటీడీ స్వీకరించదు
శ్రీనివాసుడి దర్శనం కోసం భక్తులు తీసుకుని వచ్చే సిఫార్సు లేఖలను శుక్ర, శని, ఆదివారంలో టీటీడీ స్వీకరించదు. భక్తులు రద్దీతో ఇకపై వారంతాల్లో సిఫార్సు లేఖలు స్వీకరించకూడదని టీటీడీ‌ నిర్ణయం తీసుకుంది. ఇక  తిరుమల యాత్రకు విచ్చేసే భక్తులు అలిపిరి‌ నడక మార్గం, శ్రీవారి నడక మార్గం, తిరుమల ఘాట్ రోడ్డులో ప్రయాణం చేసి తిరుమల పుణ్యక్షేత్రంకు చేరుకోవచ్చు. ఇలా తిరుమలకు వచ్చిన భక్తులు ముందుగా సిఆర్వో కార్యాలయం వద్ద వసతి గదులు పొంది, స్వామి వారికి తలనీలాలు సమర్పించి స్వామి వారి దర్శన భాగ్యం పొందే అవకాశం కల్పిస్తోంది టీటీడీ. ఇక యాత్రికుల సౌఖర్యార్ధం తిరుమలలో ప్రధాన ప్రాంతాల్లో పుడ్ కౌంటర్లతో పాటుగా ,మాతృశ్రీ వెంగమాంబ అన్నదాన సత్రంలో ఉదయం ఏడు గంటల నుండి రాత్రి 11 గంటల వరకూ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తోంది టీటీడీ. అదే విధంగా భక్తులకు కోరినన్ని లడ్డూలను భక్తులకు టీటీడీ అందిస్తోంది. ఇక తిరుమల యాత్రతో పాటుగా వివిధ యాత్ర ప్రదేశాలు భక్తులు సందర్శించేందుకు బస్సు సౌఖర్యం కల్పించింది టీటీడీ. వారంతరం కావడంతో నేటి నుండి తిరుమలలో భక్తుల రద్దీ పెరిగే అవకాశం కనిపిస్తోంది.