వైకుంఠ వాసుడు కొలువైయున్న తిరుమల పుణ్యక్షేత్రం సందర్శనార్ధం నిత్యం వేల సంఖ్యలో‌ భక్తులు తరలి వస్తుంటారు. క్షణకాలం పాటు జరిగే శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్య మంగళ స్వరూపం కోసం భక్తులు పరితపించి పోతుంటారు. దేశ విదేశాల నుండి ఎన్నో వ్యయ ప్రయాసలకు గురై భక్తులు ముందుగా తిరుపతికి చేరుకుంటారు. ఇలా తిరుపతికి చేరుకున్న లక్షల లాది మంది భక్తుల రాకతో ట్రాఫిక్ అంతరాయం కలగడంతో గంటల తరబడి భక్తులు తిరుపతి నగరంలో ట్రాఫిక్ లో చిక్కుకునే వారు.‌ అయితే భక్తుల సమస్యలను దృష్టిలో ఉంచుకున్న గత ప్రభుత్వం శ్రీవారి పాదాల చెంత గరుడ వారధిని నిర్మించాలని నిర్ణయించుకుంది. దీంతో దాదాపుగా 684 కోట్ల రూపాయలతో శ్రీనివాస సేతు (గరుడవారధి) పనులను చేపట్టింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత గరుడ వారధిని శ్రీనివాస సేతుగా మార్పు చేపట్టింది. ఇప్పటికే మొదటి దశలో పనుకు పూర్తి కావడంతో శ్రీనివాస సేతుపై వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి.


ట్రాఫిక్ సమస్యల్ని పరిష్కరించేందుకు శ్రీనివాస సేతు
ఇక ఆధ్యాత్మిక నగరంగా పేరు గాంచిన తిరుపతి మహా నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం చూపేందుకే శ్రీనివాస సేతులు నిర్మాణాన్ని దాదాపు 684 కోట్ల రూపాయలతో నిర్మించారు. కోవిడ్ సమయంలో ఈ నిర్మాణ పనులకు అంతరాయం ఏర్పడింది. కొద్ది నెలల క్రితం తిరిగి ఈ శ్రీనివాస సేతులు ప్రారంభం అయ్యాయి. స్మార్ట్ సిటీ 33 శాతం నిధులు కేటాయించగా, టీటీడీ 67 శాతం నిధులు కేటాయిస్తోంది. ఇక తిరుపతి‌ నగరంలో దాదాపు ఏడు కిలో మీటర్ల మేర ఈ శ్రీనివాస సేతు పనుల నిర్మాణం జరుగుతుంది. ఇప్పటికే ఈ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు మొదటి దశలో పనులు పూర్తి కావడంతో ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక రెండోవ దశ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరికల్లా శ్రీనివాస సేతు పనుకు పూర్తి చేసి యాత్రికులకు అందుబాటులోకి తీసుకుని రావాలని టీటీడీ భావిస్తోంది. 


దారి మళ్లింపులు ఇవీ
ఈ క్రమంలో శ్రీనివాస సేతు పనులు జరుగుతున్న నేపధ్యంలో వాహనాల రాక పోకల కారణంగా కొంత ఇబ్బందులు తలెత్తడంతో వాహనదారుల రాకపోకలను మళ్ళించారు తిరుపతి పోలీసులు. హైదరాబాదు, కర్నూల్, కడప, వాహనాలు కరకంబాడి మీదుగా, నెల్లూరు, సత్యవేడు, శ్రీకాళహస్తి, పుత్తూరు మరియు చెన్నై నుండి వచ్చే వాహనాలు రేణిగుంట, రామనవిలాస్ సర్కిల్, కరకంబాడి, మంగళం లీలమహల్ మీదుగా గానీ, గాజులమండ్యం జంక్షన్, ఆర్.సి.పురము జంక్షన్, రామానుజపల్లి చెక్ పోస్ట్, మహిళా యునివర్సిటి, బాలాజి కాలనీ, నంది సర్కల్, శ్రీనివాస సేతు మీదుగా మళ్ళించారు‌ పోలీసులు. ఇక పల్లెవెలుగు ఆర్టిసీ బస్సులు రేణిగుంట మీదుగా నారాయణాద్రి హాస్పిటల్, తిరుచానూర్ ఫ్లై ఓవర్, ఆర్.సి పురము జంక్షన్, ఏంఆర్.పల్లి పోలీసు స్టేషన్, అన్నమయ్య, వెస్ట్ చర్చ్, బాలాజి కాలనీ, నంది సర్కల్, శ్రీనివాస సేతు మీదుగా ఆర్టిసీ బస్ స్టాండ్ లోకి మళ్ళించారు.


బెంగళూరు, చిత్తూరు నుండి వచ్చే ఆర్టిసీ బస్సులు రామానుజపల్లి చెక్ పోస్ట్ వద్ద నుండి శ్రీపద్మావతి మహిళా యునివర్సిటీ, అలిపిరి, నంది సర్కల్, శ్రీనివాస సేతు మీదుగా మళ్ళించగా, చంద్రగిరి టౌన్, చెర్లోపల్లి, జూపార్క్, అలిపిరి, నంది సర్కల్, శ్రీనివాస సేతు మీదుగా ఆర్టిసీ బస్సు స్టాండ్ లోకి మళ్ళించారు. మదనపల్లి, పీలేరు, రాయచోటి, అనంతపురం నుండి వచ్చే ఆర్డిసీ బస్సులు చెర్లోపల్లి సర్కల్, బాలాజి కాలనీ, అలిపిరి, నంది సర్కల్, శ్రీనివాస సేతు మీదుగా ఆర్టిసీ బస్సుస్టాండ్ లోకి  మళ్ళించగా, చెర్లోపల్లి, జూపార్క్, అలిపిరి, నంది సర్కల్, శ్రీనివాస సేతు మీదుగా ఆర్టిసీ బస్సు స్టాండ్ లోకి  మళ్ళించడం జరిగింది.


ఇక పోతే లైట్ మోటార్ వాహనాలు బస్ స్టాండ్ నుండి రేణిగుంట, రామానుజం, లక్ష్మిపురం సర్కల్ వైపు డీబీఆర్ హాస్పిటల్ మీదుగా హీరో హోండా షోరూమ్ వద్ద రైల్వే లెవల్ క్రాస్ దాటుకొని వెళ్ళేందుకు చర్యలు తీసుకున్నారు. అత్యవసర వాహనాలు అంబులెన్స్, మెడికల్, ప్రభుత్వ వాహనాలకు, రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ మళ్లింపు కారణంగా అందరు సహకరించాలని, అలాగే యాత్రికులు, ఉద్యోగస్తులు, స్థానిక ప్రజలు, విద్యా సంస్థలు తమ విద్యార్థుల రవాణా సౌకర్యార్థం అనువైన మార్గంను ఎంచుకుని వాహనాలను మళ్లించుకోవాలని, ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ మార్గాలను ఎన్నుకోవాలని తిరుపతి ఎస్పి పరమేశ్వర రెడ్డి విజ్ఞప్తి చేశారు.