Ramana Dikshitulu Comments Viral : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలను షేక్ చేసే వీడియో ఒకటి వైరల్‌ అవుతోంది. ఆ వీడియోతో నేరుగా రాజకీయాలకు సంబంధం లేకపోయినా రాజకీయ దుమారానికి కారణం అయ్యేందుకు ఎక్కువ ఆస్కారం ఉంది. తిరుమలలో జరుగుతున్న అక్రమాలపై రమణదీక్షితులు మాట్లాడిన వీడియోను భారత చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పోస్టు చేశారు. ఇందులో చెప్పిన ప్రతి కామెంట్ కూడా తీవ్ర చర్చకు కారణమయ్యేలా ఉంది. ఇప్టటికే ఆ కామెంట్స్‌ను రమణ దీక్షితులు ఖండించారు. అయినా దుమారం ఆగేలా కనిపించడం లేదు. 


తిరుమలలో అపవిత్ర కార్యక్రమాలు


పరమ పవిత్రమైన తిరుమల క్షేత్రంలో అక్రమాలు జరుగుతున్నాయని ఆ వీడియోలో రమణ దీక్షితులు చెప్పుకొచ్చారు. టీటీడీ ఈవోగా ఉన్న ధర్మారెడ్డి క్రిస్టియన్ అంటూ అందులో ఆరోపించారు. ఆయన వేషభాషలు చూస్తేనే అర్థమైపోతుందని కామెంట్ చేశారు. అక్కడి నుంచి మొదలైన వీడియోలో చాలా అంశాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. 


సీబీఐ విచారణకు డిమాండ్


తిరుమలలో కొన్నేళ్లుగా అక్రమాలు జరుగుతున్నాయని చెప్పడం, గుప్త నిధుల తవ్వకాల అంశం కూడా తెరపైకి రావడంతో రామచంద్రయాదవ్‌ కేంద్రానికి లేఖ రాశారు. భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా కార్యక్రమాలు ఉన్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు రాసిన లెటర్‌లో పేర్కొన్నారు. సీబీఐ విచారణ చేసి నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు.


కామెంట్స్‌ను ఖండించిన రమణ దీక్షితులు


వీడియో వైరల్‌ కావడంతో రమణ దీక్షితులు స్పందించారు. ఆ వీడియోలో చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అందులో ఉన్న వాయిస్‌ తనది కాదన్నారు. ఆ వీడియో చూసిన తర్వాత తాను షాక్‌కి గురైనట్టు ట్వీట్ చేశారు. తిరుమల అధికారులతో ఉన్న తనకు సత్సంబంధాలను దెబ్బ తీసేందుకు ఇలాంటి చీప్‌ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని మండిపడ్డారు. చాలా మందికి తానంటే అసూయని చెప్పుకొచ్చారు. ఇలాంటి దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మబోరన్నారు. 




క్రిస్టియన్స్‌తోనే సమస్య


ఇంతగా చర్చకు కారణమైన ఆ వీడియోలో ఏముందో ఓసారి పరిశీలిస్తే... టీటీడీలో చాలా మంది క్రిస్టియన్‌లు ఉండటమే పెద్ద సమస్య అని రమణ దీక్షితులు అన్నారు. ఈఓ ధర్మారెడ్డి ఒక క్రిస్టియన్, సీఎం జగన్మోహనరెడ్డి క్రిస్టియన్ అని అన్నారు. ధర్మారెడ్డి కుమారుడు చనిపోతే దహనం చేయలేదు ఖననం చేశారని అన్నారు. ఆయనను చూస్తేనే తెలుస్తుంది కదా, బొట్టు కూడా పెట్టుకోడు. వేషధారణ, మాట కూడా అంతే ఉంటుందని అన్నారు. 


 



తరచూ అహోబిలం వెళ్తున్న ధర్మారెడ్డి


ఈ మధ్య కొత్త విషయం తెలిసిందని... అహోబిలంలో రెండు వందల సంవత్సరాల క్రితం కొండ మీద ఒక గుహలో ఓ జియ్యర్ లోపలకు వెళ్లి సమాధి అయ్యాడట. ఆ గుహలో అప్పట్లో విజయనగర సామ్రాజ్యం కాలంలో పెద్ద ఎత్తున నిధులు పెట్టారని అంటారు. ఇప్పుడు ఉన్న జియ్యర్ తర్వాత వచ్చే రెండో జియ్యర్‌కు ఆ నిధులు అందాలని సంకల్పం చేశారట. దాన్ని బయటకు తీయాలని చాలా సార్లు అహోబిలం జియ్యర్ దగ్గరికి ధర్మారెడ్డి వెళ్లి వస్తున్నారని ఆరోపించారు. 


సాష్టాంగం పడితేనే నిధులు


అవినాష్ రెడ్డి కోసం చాలా సార్లు హైదరాబాద్‌ తిరుగుతున్నారని రమణ దీక్షితులు పేర్కొన్నారు. పెద జియ్యర్, చిన జియ్యర్‌లు ధర్మారెడ్డికి సాస్టాంగ పడతారన్నారు. ఇది చాలా మంది నమ్మరు కానీ నిజమని అన్నారు రమణ దీక్షితులు. పెద జియ్యర్, చిన జియ్యర్ వారానికి ఒకసారి ధర్మారెడ్డి ఇంటికి వెళ్లి సాస్టాంగ నమస్కారం చేసి వస్తుంటారని, అలా చేయకపోతే వాళ్లకు ఇచ్చే మూడు, నాలుగు కోట్ల నిధులను నిలిపివేస్తారని అన్నారు. శేషాద్రి ఉన్నప్పుడే ఒకసారి ఆపి బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపించారు. బెంగళూరులో ఆర్కియాలజీలో పురుషోత్తమరెడ్డి అనే అధికారి ఉన్నాడనీ, అతను పూర్తిగా ధర్మారెడ్డి మనిషి అని అన్నారు. 


కిచెన్‌లో అసాంఘిక కార్యకలాపాలు 


తిరుమల కిచెన్‌లో అన్ని అసాంఘీక కార్యక్రమాలు జరుగుతుంటాయని అన్నారు రమణ దీక్షితులు. గుట్కా ప్యాకెట్‌లు అన్నీ చింపి బయట పోస్తుంటారని తెలిపారు. అందరినీ మ్యానేజ్ చేస్తుంటారు. దర్శనానికి వచ్చే జడ్జిలు, మినిస్టర్లు, ఆడిటర్‌లు, ఇలా అందరినీ లడ్లు ఇవ్వడం, గుడ్డలు (శాలువా) కప్పి మేనేజ్ చేస్తారని అన్నారు. వాళ్లను ఎయిర్ పోర్టు వరకూ వెళ్లి దించేసి వస్తారని చెప్పారు. 


పరకాణిలో గుప్త నిధుల తవ్వకాలు


ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా టీటీడీ చెబితే వినదు. సీఏజీ చెబితే ఒప్పుకోము. సమాచార శాఖ చట్టం మేము ఒప్పుకోము ఎందుకంటే మేము గవర్నమెంట్ కాదంటుంది. మళ్లీ ఈఓ, చైర్మన్, డైరెక్టర్‌లు అన్నీ నియామకాలు ప్రభుత్వమే చేస్తుంది. తిరుమల ఆలయంలోని పరకామణిలో గ్రానైట్ తీసి తవ్వకాలు చేస్తున్నారు. అంతకు ముందు రాతి బండలు ఉండేవి అయితే దాని మీద పరకామణి కోసం గ్రానైట్ వేశారని, ఇప్పుడు నిధుల కోసం తవ్వకాలు జరుగుతుండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. వెయ్యి కాళ్ల మండపం గానీ, దేవ మండపం కానీ అన్నీ నిధుల కోసమే తవ్వారని ఆరోపించారు. తిరుమల ఆలయం లోపలికి క్రేన్, గోడలకు డ్రిల్లింగ్ చేసి నాశనం చేస్తున్నారన్నారు. ఇష్టమొచ్చినట్లుగా చేసేస్తున్నారు. ఆగమశాస్త్రం ప్రకారం ఏమి జరగడం లేదని అన్నారు.


శ్రీవారికి నైవేద్యం, కైంకర్యాలపై ఆరోపణలు 


శ్రీవారికి నైవేద్యం, కైంకర్యాలు సరిగ్గా జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రమణ దీక్షితులు. స్వామివారిని చూస్తుంటే బాధేస్తుందని అన్నారు. స్వామివారి ఎత్తున బట్టి ఎంత నైవేద్యం పెట్టాలనేది ఉంటుందన్నారు. రోజు ఎంత మంది వచ్చారు. ఎంత మంది గుండ్లు కొట్టించుకున్నారు. హుండీ కలెక్షన్ ఇంత వచ్చిందని అనే విషయాలు బయటకు చెబుతారు కానీ ప్రతి రోజు వచ్చే బంగారం, వెండి ఎందుకు బయట పెట్టడం లేదని ప్రశ్నించారు.  


గోపురం సంప్రోక్షణకి జీయ్యంగార్‌


కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి ఏమీ లాభం లేదు. ఏ ఆఫీసర్ వస్తే వారికి సరెండర్ అవుతుంటారని అన్నారు. గోవిందరాజ స్వామి విమాన గోపురం సంప్రోక్షణకి మూహూర్తం పెట్టడానికి ధర్మారెడ్డి జీయ్యంగార్‌ను పిలిపించాడని, అక్కడ అర్చకుడు అభ్యంతరం వ్యక్తం చేశారని అన్నారు. ఆగమ శాస్త్రం ప్రకారం జరిగేదానికి జియ్యంగార్‌కు ఏమి సంబంధం అని రమణ దీక్షితులు ప్రశ్నించారు.


పక్కా బిజినెస్


టీటీడీ మాజీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పక్కా బిజినెస్ మ్యాన్ అని ఆరోపించారు రమణ దీక్షితులు. దేవుడి డబ్బులు ఇష్టానుసారంగా ఖర్చు పెడుతున్నారని అన్నారు. సీఎం జగన్ వంద శాతం దెబ్బతింటాడని అన్నారు. అది ఎప్పుడు అనేది చూడాలన్నారు.


అమిత్ షా కు లేఖ రాసిన రామచంద్ర యాదవ్
రమణ దీక్షితులు మాట్లాడిన అంశాలు బాగా వైరల్ అయ్యాయి. దీనిపై రామచంద్రయాదవ్‌ సీరియస్‌గా స్పందించారు. తిరుమల విషయంలో వైసీపీ ప్రభుత్వంపై గత కొన్నేళ్లుగా వస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చేలా ఉన్నాయన్నారు. వెంటనే ఈ అంశాలను కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు. దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.